
కుభీర్, వెలుగు : కరెంట్కోతలను నిరసిస్తూ నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని గోడాపూర్ గ్రామస్తులు, రైతులు మండల కేంద్రంలోని సబ్స్టేషన్ ముట్టడించి ధర్నా చేశారు. కుభీర్- –భైంసా రోడ్డుపై బైఠాయించి గంటపాటు రాస్తా రోకో చేశారు. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల పాటు కరెంట్ఇస్తామని చెబితే పంటలు వేశామని, ఇప్పుడు అప్రకటిత కోతలు విధిస్తున్నారని మండిపడ్డారు. దీంతో పోలీసులు అక్కడికి వచ్చి రైతులను సముదాయించే ప్రయత్నం చేయగా వినలేదు. విద్యుత్శాఖ ఏఈ ముల్లా అజిమొద్దీన్అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పారు. విద్యుత్ సరఫరాలో సాంకేతిక లోపాలతో పాటు కొందరు రైతుల అక్రమ కనెక్షన్లతో లోడ్ పెరిగిపోయి ఇలా జరుగుతోందన్నారు. మంగళవారం నుంచి ఇలా జరగకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.