
- నేర గుర్తింపులో వేలిముద్రలతోపాటు కాలిముద్రలు కూడా..
- ఎత్తు, బరువు, ఐరిస్డాటా బేస్లో నిక్షిప్తం
- నిర్మల్జిల్లాలోని 12పోలీస్ స్టేషన్లకు లైవ్ స్కానర్లు
- నిర్వహణపై సిబ్బందికి శిక్షణ
నిర్మల్, వెలుగు: వరుసగా నేరాలు చేస్తున్నవారు ఇక తప్పించుకోలేరు. పోలీస్ శాఖ తెస్తున్న అంబిస్ టెక్నాలజీతో క్రిమినల్స్ఎక్కడున్నా వారి గత చరిత్ర ఆధారంగా పోలీసులకు ఇట్టే దొరికిపోతారు. ఇప్పటివరకు వేలిముద్రలకే పరిమితమైన పోలీసులుఇకనుంచి నేరగాళ్ల కాలిముద్రలు కూడా సేకరించనున్నారు.
ఇందుకోసం పోలీస్శాఖ ఆధ్వర్యంలో అంబిస్ పరికరాలను రూపొందించారు. వీటిని అన్ని పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేసి, నిర్వహణపై కొంతమంది సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఈ పరికరంతో నేరస్తుల కాలిముద్రలు, ఐరిస్, ముఖ కవలికలు, ఎత్తు, బరువు, చేతి రాత ఇలా ప్రతీ అంశాన్ని నిక్షిప్తం చేసే అవకాశం ఉంది. ఏదైనా నేరం జరిగినప్పుడు అది చేసినవారిని గుర్తించేందుకు పోలీసులు తమ వద్ద ఉన్న పాత నేరస్తుల వివరాలతో తెలుసుకోవచ్చు.
గత అఫీజ్ టెక్నాలజీకి భిన్నంగా..
ఇప్పటివరకు నేరస్తులను గుర్తించేందుకు పోలీసులు అఫీజ్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. దీనితో లైవ్ స్కానర్ ద్వారా నేరగాళ్ల వేలిముద్రలు, అరచేతి ముద్రలు మాత్రమే తీసుకునేవారు. అయితే నేరస్తులు తెలివితేటలతో తమ వేలిముద్రలు, అరచేతి ముద్రలను లైవ్ స్కానింగ్ లో క్లారిటీగా రాకుండా చూసుకుంటున్నారన్న ఫిర్యాదులున్నాయి. చాలాసార్లు దీని ద్వారా నేరస్తులను గుర్తించడంలో ఇబ్బందులు వస్తున్నాయి. ఇకనుంచి దీనికి భిన్నంగా ఉండే అంబిస్ టెక్నాలజీని వినియోగించబోతున్నారు.
అనేక ప్రత్యేకతలు..
అంబిస్ టెక్నాలజీలో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో ఆప్టిప్లెక్స్ ఆల్ ఇన్ వన్, ఐరిస్ స్కానర్, ఎప్సన్ వి 39 స్కానర్, లాజిక్ వెబ్ కామ్, హెల్త్ సెన్స్ బీఎస్ 161, ఎంఎస్ సీడీ పాపిలోన్ పామ్ లైవ్ స్కానర్ ఉంటాయి. వీటన్నింటి ద్వారా సేకరించే వివరాలను అంబిస్ డాటా బేస్ లో నిక్షిప్తం చేసి, ఏదైనా నేరం జరిగినప్పుడు అక్కడి సాక్షాలతో సరిపోలుస్తారు. నేరస్తులను పట్టుకోవడం సులువవుతుందని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలోని 12 ఠాణాల్లో అమలు చేస్తాం
నిర్మల్ జిల్లాలోని 12 ఠాణాల్లో అంబిస్ టెక్నాలజీ అమలు చేయనున్నాం. దీనికోసం సంబంధిత పరికరాలను పోలీస్ స్టేషన్లకు పంపిణీ చేస్తున్నాం. కొత్త టెక్నాలజీతో నేరస్తులను గుర్తించడం సులభంగా మారుతుంది. పోలీస్ అధికారులకు సాంకేతిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఠాణాల్లో ఎంపిక చేసిన సి బ్బందికి శిక్షణ ఇవ్వనున్నాం. నేరాల నియంత్రణ, నేరస్తులను గుర్తించడం వంటి అంశాలలో అంబిస్టెక్నాలజీ కీలక పాత్ర పోషించబోతోంది. - ఎస్పీ జానకి షర్మిల