మర్యాదపూర్వకమే అన్న ఆర్థిక మంత్రి ఆఫీస్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ను కలిశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన్ను కలవడం ఇదే మొదటిసారి. జులై 5న పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయనతో భేటీ అయినట్లు సీతారామన్ ఆఫీస్ వర్గాలు చెప్పాయి. కేవలం మర్యాదపూర్వకంగానే మాజీ ప్రధానిని సీతారామన్ కలిశారని చెప్పాయి. దేశానికి వరుసగా రెండుసార్లు ప్రధానిగా ఉన్న మన్మోహన్సింగ్ ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1991 ఎకనామిక్ రిఫామ్స్ను ప్రవేశపెట్టారు. 30 ఏళ్లపాటు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న మన్మోహన్సింగ్ పదవీ కాలం పూర్తి కావటంతో మొదటిసారి బడ్జెట్ సమావేశాలకు దూరంగా ఉన్నారు.
మన్మోహన్ ఆఫీస్ స్టాఫ్లో కోత
మన్మోహన్సింగ్ ఆఫీస్ స్టాఫ్ను 14 నుంచి ఐదుకు తగ్గిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. స్టాఫ్ను తగ్గిస్తున్నామని పీఎంవో గత నెలలో మన్మోహన్సింగ్కు చెప్పింది. ప్రస్తుతం ఆయనకు ఇద్దరు పర్సనల్ అసిస్టెంట్లు, ఇద్దరు ప్యూన్లు, ఒక క్లర్క్ మాత్రమే ఉన్నారు. రూల్స్ ప్రకారం మాజీ ప్రధానికి ఐదు సంవత్సరాల పాటు 14 మంది స్టాఫ్ను కొనసాగిస్తారు. ఆ తర్వాత మాజీ ప్రధాని విజ్ఞప్తి చేస్తే వారిని అలానే కొనసాగించే చాన్స్ ఉంటుంది. సిబ్బందిని తగ్గించొద్దని మన్మోహన్ సింగ్ కోరినప్పటికీ ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదని ఆయన సన్నిహితులు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాజీ ప్రధాని అటల్బిహారీ వాజ్పేయికి 10 సంవత్సరాలు 14 మంది స్టాఫ్ ఇచ్చారని,
మాజీ ప్రధానులు ఐకే గుజ్రాల్, దేవెగౌడాకు కూడా అదే కంటిన్యూ చేశారని మన్మోహన్ సన్నిహితులు చెప్పారు.