
- ఇప్పటికే కార్లు, దుస్తులు, ఇన్సూరెన్స్ కంపెనీలు రేట్లు తగ్గించాయి
- 22 నుంచి జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు ప్రజలకు అందాలి
- సంస్కరణలతో వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుంది: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
- 400 వస్తువుల రేట్లు తగ్గుతయ్.. ప్రజలకు ఏదో ఒకరూపంలో లాభమని వెల్లడి
న్యూఢిల్లీ: జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలు ప్రజలకు కచ్చితంగా అందాలని, ఈ విషయాన్ని స్వయంగా పరిశీలిస్తానని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, పరిశ్రమలు ఇప్పటికే సానుకూలంగా స్పందించాయని, కార్ల తయారీదారులు, ప్రభుత్వ బీమా సంస్థలు, షూ, దుస్తుల బ్రాండ్లు ఇప్పటికే ధరలు తగ్గించాయని, మిగిలినవారు కూడా త్వరలో తగ్గిస్తారని తెలిపారు. కొత్త జీఎస్టీ సంస్కరణలు ఈ నెల 22న అంటే నవరాత్రి మొదటి రోజు నుంచి అమలులోకి రానున్నాయి. సబ్బులు, షాంపూలు, కార్లు, ట్రాక్టర్లు, ఏసీలు వంటి సుమారు 400 వస్తువుల ధరలు దిగిరానున్నాయి. వ్యక్తిగత ఆరోగ్య, జీవిత బీమా ప్రీమియంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. సిగరెట్స్, ఆల్కహాల్ వంటి సిన్ గూడ్స్, అల్ట్రా లగ్జరీ వస్తువుల కోసం 40 శాతం ప్రత్యేక స్లాబ్ను ఏర్పాటు చేశారు. జీఎస్టీ తగ్గింపును “ప్రజల కోసం తీసుకున్న సంస్కరణ”గా నిర్మల అభివర్ణించారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఏదో ఒక రూపంలో లాభపడతారని, వినియోగం పెరిగి, ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుందని అన్నారు. ద్రవ్యోల్బణం ఇప్పటికే నియంత్రణలో ఉందని, తాజా సంస్కరణలతో వినియోగం పెరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కొత్త జీఎస్టీ ఇలా..
5 శాతం: సాధారణ వినియోగ వస్తువులన్నీ ఈ స్లాబ్ కిందకు వస్తాయి. బ్రెడ్, పాలు, పనీర్పై జీఎస్టీ మినహాయింపు ఉంది.
18శాతం: సిన్ గూడ్స్, అల్ట్రా లగ్జరీ వస్తువులు మినహా మిగిలిన అన్ని వస్తువులకు వర్తిస్తుంది.
12శాతం, 28శాతం: ఈ స్లాబ్లు ఉండవు.
జీఎస్టీని 2017లో ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. అప్పుడు “ఒక దేశం, ఒక పన్ను” విధానానికి అనుగుణంగా దీనిని తెచ్చింది. అయితే తాజాగా తీసుకొచ్చిన జీఎస్టీ సంస్కరణలు చాలా ముఖ్యమని, సాధారణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని వీటిని తెచ్చామని అని నిర్మల పేర్కొన్నారు. రోజువారీ వాడే వస్తువులపై పన్ను తగ్గించామని అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి బడ్జెట్లో ఆదాయపు పన్ను రాయితీలను కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. రూ.12 లక్షల ఆదాయం వరకు పన్ను మినహాయింపు దొరుకుతోంది. ఇన్కమ్ ట్యాక్స్ సంస్కరణలతో ప్రజల చేతిలో డబ్బు పెరిగితే, తాజా జీఎస్టీ తగ్గింపుల వలన వినియోగం మరింత పెరుగుతుందని నిర్మల అభిప్రాయపడ్డారు. “రూ.100తో ఒక వస్తువు కొనేవారు, ఇప్పుడు అదే రూ.100తో ఒకటి కంటే ఎక్కువ వస్తువులు కొనగలుగుతారు” అని ఉదాహరణ ఇచ్చారు.
ఒకే రకమైన వస్తువుపై ఒకే జీఎస్టీ
జీఎస్టీ రేట్ల తగ్గింపు వల్ల నెలవారీ ఇంటి రేషన్, వైద్య ఖర్చులు తగ్గుతాయి. అలాగే, కారు అప్గ్రేడ్ చేయడం, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ వంటి వస్తువులు కొనడం సులభమవుతుంది. ఈ సంస్కరణలు రేట్ల తగ్గింపులకే పరిమితం కాలేదని, వ్యాపారాలు ముఖ్యంగా చిన్న, మధ్య తరగతి సంస్థలు సులభంగా బిజినెస్ చేసుకోవడంపై దృష్టి పెట్టాయని నిర్మల తెలిపారు. నిబంధనలు సులభతరం చేయడం, వేగవంతమైన రీఫండ్లు, 3 రోజుల్లో రిజిస్ట్రేషన్ వంటి అంశాలు ఈ ప్యాకేజీలో ఉన్నాయి. కొత్త విధానంలో 90శాతం రీఫండ్లు నిర్ణీత కాలంలో ప్రాసెస్ అవుతాయి. ఉత్పత్తుల క్లాసిఫికేషన్లో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు, ఒకే తరహా వస్తువులను ఒకే పన్ను శ్రేణిలోకి తీసుకురావడం జరిగింది. ఉదాహరణకు, ఉప్పు, మసాలా కలిపిన పాప్కార్న్, ప్యాక్ అయినా, లూజ్ అయినా 5శాతం జీఎస్టీ వర్తిస్తుంది. గతంలో ప్యాక్ చేసిన సాల్టెడ్ పాప్కార్న్పై 12శాతం, కారమెల్ పాప్కార్న్పై 18శాతం పన్ను పడేది. అలాగే, క్రీమ్ బన్స్పై జీఎస్టీ 18శాతం నుంచి 5శాతానికి తగ్గించారు. గతంలో బన్, క్రీమ్పై వేర్వేరుగా 5శాతం ఉండగా, క్రీమ్ బన్పై 18శాతం పడేది. జీఎస్టీ 2.0 లో ఈ గందరగోళాన్ని తొలగించారు.