నల్గొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీల్లో వసతులు కరువు .. ఎన్ఎంసీ తనిఖీల్లో బయటపడ్డ లోపాలు

 నల్గొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీల్లో వసతులు కరువు .. ఎన్ఎంసీ తనిఖీల్లో బయటపడ్డ లోపాలు
  • పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాక్టికల్స్​వేధిస్తున్న సిబ్బంది కొరత 
  • ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ​ 
  • నల్గొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులు 

నల్గొండ, వెలుగు : నల్గొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీల్లో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఇటీవల నేషనల్ మెడికల్ కమిషన్ తనిఖీల్లో రెండు కాలేజీల్లో లోపాలు బయటపడ్డాయి. ఒకవైపు సిబ్బంది కొరత వేధిస్తుండగా, మరోవైపు కాలేజీల్లో సరైన వసతులు లేకపోవడంతో మెడికల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం ప్రాక్టికల్స్ చేసేందుకు ఎక్విప్ మెంట్ లేకపోవడంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బోధన చేస్తుండడం గమనార్హం. నల్గొండ, సూర్యాపేట మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీకి ముందు ఎన్ఎంసీ బృందం తనిఖీలు చేపట్టింది. కాలేజీల్లో సరైన సదుపాయాలు లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈనెల 18 వరకు కాలేజీల నిర్వహణపై సమాధానం చెప్పాలంటూ ఆదేశించింది. 

వేధిస్తున్న సిబ్బంది కొరత..

నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో  టీచింగ్ స్టాఫ్ కొరత వేధిస్తోంది. ముఖ్యంగా కళాశాలల్లో సరిపడ ప్రొఫెసర్లు లేకపోవడంతో అసిస్టెంట్ ప్రొఫెసర్లే బోధన చేస్తున్నారు. సూర్యాపేట మెడికల్ కాలేజీలో 350 మంది ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉండాలి. కానీ ప్రస్తుతం 150 మంది మాత్రమే ఉన్నారు. ఇందులో 100 మంది రెగ్యులర్ స్టాఫ్ ఉండగా, 50 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారు. ఇక నల్గొండ మెడికల్ కాలేజీలో సైతం 50 మంది ప్రొఫెసర్లకు ప్రస్తుతం 16 మంది మాత్రమే ఉన్నారు. 

మరోవైపు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ల గడువు మార్చి 31తో ముగిసింది. మూడు నెలల నుంచి కాంట్రాక్ట్ రెన్యువల్ చేయకపోవడంతో వారికి కొనసాగిస్తారా.. లేదా..? అనేది సందేహంగా మారింది. నల్గొండ, సూర్యాపేట రెండు మెడికల్ కాలేజీల్లో సుమారు 100 మందికి పైగా కాంట్రాక్ట్ బేసిక్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు.     

నిబంధనలు లేని క్లినికల్ ట్రైనింగ్..

మెడికల్ కాలేజీల్లో సరిపడా వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా స్టూడెంట్స్ క్లినికల్ ట్రైనింగ్ కు అవసరమైన పేషెంట్లు, డిపార్ట్ మెంట్లవారీగా హాస్పిటల్స్ లో కనీస వైద్య సదుపాయాలు లేవు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్​లో సీజనల్ వ్యాధులు, జ్వరాలు, ఆర్థో సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులకు అవసరమైన ల్యాబ్ లేకపోవడం,  ట్రైనింగ్ కోసం డెమో క్లాసులు, లైబ్రరీ, ట్రీట్​మెంట్ చేసేందుకు సరిపడా బెడ్స్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వీటితోపాటు ప్రాక్టికల్స్ కోసం ఎక్యూప్ మెంట్ లేకపోవడంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తోనే ప్రాక్టికల్స్ చేయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉన్నా.. 

సూర్యాపేట, నల్గొండ ఏర్పాటైన మెడికల్ కాలేజీలకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు ఉంది. హైదరాబాద్ తర్వాత సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లోని మెడికల్ కాలేజీలకు మాత్రమే విశాలమైన భవనాలు ఉన్నాయి. నల్గొండ మెడికల్ కాలేజీ 2018లో శాంక్షన్ అవ్వగా, 2019 లో 150 మంది విద్యార్థులతో  తరగతులు ప్రారంభించారు. సొంత భవనం లేకపోవడంతో ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లోనే క్లాసులు నిర్వహించారు. 2022లో కాలేజీ నిర్మాణం కోసం రూ.160 కోట్లతో నల్గొండ ఎల్ఎల్బీసీ లో 42 ఎకరాల స్థలంలో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ ఏడాది జనవరిలో మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం ఉన్న మెడికల్ కాలేజీ దూరంగా ఉండడంతో స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. 

ముఖ్యంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ 7 కిలో మీటర్ల దూరంలో ఉండడంతో సరైన రవాణా సౌకర్యం లేక ఆటోలోనే విద్యార్థులు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక విద్యార్థులకు ప్లే గ్రౌండ్, ఆడిటోరియం, సిబ్బందికి క్వార్టర్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. సూర్యాపేట మెడికల్ కాలేజీ సైతం 2018లో మంజూరు కాగా, 2019 లో  పాలిటెక్నిక్ కాలేజీలో క్లాసులు ప్రారంభించారు. 2023లో రూ.156 కోట్లతో కాలేజీ బిల్డింగ్​ పనులు ప్రారంభించారు. అయితే మెడికల్ కాలేజీకి అనుబంధంగా రెండేళ్ల క్రితం 500 బెడ్స్ కు అప్ గ్రేడ్ చేసినా సరైన బిల్డింగ్ లేకపోవడంతో పేషెంట్లు అవస్థలు పడుతున్నారు. ఇటీవల ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ పక్కనే మాతా శిశు కేంద్రంలో బిల్డింగ్ నిర్మిస్తున్నా ఇంకా రెండేళ్ల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.