- రూల్స్ పాటించని మెడికల్ కాలేజీలపై వేటేస్తున్న ఎన్ఎంసీ
- దేశవ్యాప్తంగా ఇప్పటికే 40 కాలేజీలపై చర్యలు
- మన స్టేట్లో మెడిసిటీ కాలేజీ పర్మిషన్ రద్దు
- సీట్లు తగ్గుతాయని పేరెంట్స్, స్టూడెంట్స్లో ఆందోళన
హైదరాబాద్, వెలుగు : నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పెట్టిన నిబంధనలు పాటించని వైద్య, విద్య కాలేజీలపై అండర్ గ్రాడ్యుయేట్స్ మెడికల్ ఎడ్యుకేషన్ బోర్డు కొరడా ఝులిపిస్తున్నది. టీచింగ్ ఫ్యాకల్టీ కొరత ఉన్నా, ఆన్లైన్ అటెండెన్స్ సిస్టమ్ లేకపోయినా, ఓపీ, ఐపీ తక్కువగా ఉన్నా, సౌలతులు లేకపోయినా సీట్లలో కోత పెడుతున్నది. 15రోజుల్లో దేశవ్యాప్తంగా 40 కాలేజీలపై బోర్డు వేటు వేసింది. మన రాష్ట్రంలోని మెడిసిటీ కాలేజీ పర్మిషన్ కూడా రద్దు చేసింది. దేశవ్యాప్తంగా సుమారు మరో వంద కాలేజీల పర్మిషన్ రద్దయ్యే చాన్స్ ఉన్నట్టు బోర్డు అధికారులు లీకులు ఇస్తున్నారు.
ఆందోళనలో స్టూడెంట్స్, పేరెంట్స్
దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య పెరుగుతుండటంతో తమ పిల్లలను మెడిసిన్ చదివించేందుకు పేరెంట్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈసారి దేశవ్యాప్తంగా 20.87 లక్షల మంది నీట్కు అప్లై చేశారు. నిరుడు కంటే రెండున్నర లక్షల మంది పెరిగారు. మన రాష్ట్రంలో నిరుడు 61వేల మంది నీట్ రాయగా, ఈసారి 70 వేల మంది రాశారు. వీరంతా రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీల పర్మిషన్లు రద్దవుతుండడంతో స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు సీటు వస్తుందో రాదో అని భయపడుతున్నారు.
పోయిన ఏడాదే స్టూడెంట్స్కు తిప్పలు
నిరుడు అకడమిక్ ఇయర్ మధ్యలో మన రాష్ట్రంలోని 3 కాలేజీల పర్మిషన్ను ఎన్ఎంసీ రద్దు చేసింది. దీంతో సుమారు 450 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్, వంద మందికిపైగా పీజీ స్టూడెంట్ల భవిష్యత్ గందరగోళంగా మారింది. కోర్టు కేసులు, ఆందోళన తర్వాత వారిని వేర్వేరు ప్రైవేటు కాలేజీల్లో సర్దుబాట్లు చేశారు.
ఘోస్ట్ ఫ్యాకల్టీతో తిప్పలు
మన రాష్ట్రంలో 55 మెడికల్ కాలేజీలుండగా, ఇందు లో మెడిసిటీ పర్మిషన్ రద్దు అయింది. మిగిలిన 54లో సగం ప్రైవేటు కాలేజీలే ఉన్నాయి. ఇందులో ఒక నాలు గైదు మినహా, అన్ని కాలేజీలు పేషెంట్లు లేక ఇబ్బంది పడుతున్నాయి. ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ప్రతి రోజూ కనీసం 400 మంది ఔట్ పేషెంట్లు ఉండాలి. చాలా టీచింగ్ హాస్పిటల్స్కు ఇందులో సగం ఓపీ కూడా నమోదవడం లేదు. దీంతో సమీప గ్రామాలకు బస్సులు పంపించి ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తామని ప్రచారం చేస్తూ పేషెంట్లను రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కొన్ని కాలేజీలు పూర్తి స్థాయిలో ఫ్యాకల్టీని నియమించకుండా ఘోస్ట్ ఫ్యాకల్టీని మెయింటెయిన్ చేస్తున్నాయి. పొద్దున ఒకసారి వచ్చి థంబ్ వేసి వెళ్లడం తప్పితే, వీళ్లు స్టూడెంట్స్కు పాఠాలు చెప్పరు. పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వరు. అన్ని మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ హాస్పిటల్స్లో కెమెరాలు ఏర్పాటు చేయాలని, ఆన్లైన్ అటెండెన్స్ సిస్టమ్ పెట్టాలని యూజీఎంఈ బోర్డు రూల్ పెట్టింది.
మెరుగైన విద్య కోసమే..
మెడికల్ ఎడ్యుకేషన్లో క్వాలిటీని పెంచే దిశగా ఎన్ ఎంసీ చర్యలు తీసుకుంటున్నది. ఇప్పుడు చేస్తున్న ఇన్స్పెక్షన్స్లో ఆన్లైన్ బయోమెట్రిక్ అటెండెన్స్, సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్పై దృష్టిపెట్టింది. ఇవి లేకపోతే పర్మిషన్ క్యాన్సిల్ చేస్తున్నది. ఘోస్ట్ ఫ్యాకల్టీకి చెక్ పెట్టేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నది. సీసీ కెమెరాల ఫీడ్ను ఎన్ఎంసీ ఆన్లైన్లోనే మానిటర్ చేస్తున్నది. ఎక్కడైనా తేడా అనిపిస్తే ఫిజికల్ ఇన్స్పెక్షన్స్కు టీమ్స్ను పంపిస్తున్నది. అడ్మిషన్ల తర్వాత కాలేజీల పర్మిషన్లు రద్దవడం ఉండకపోవచ్చు. - డాక్టర్ రమేశ్ రెడ్డి, డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్