
- ప్రైవేట్ కోచ్ ట్రైనింగ్లో వరల్డ్ టాప్ బాక్సర్లు
- 10 ఏళ్లుగా రాణిస్తున్న జిల్లా ప్లేయర్స్
నిజామాబాద్, వెలుగు:బాక్సింగ్కు కేరాఫ్ అడ్రస్గా మారిన నిజామాబాద్ జిల్లాలో ట్రైనింగ్కు కనీస సౌకర్యాలు లేవు. అరకొరవసతులతో ప్రైవేట్ కోచ్ల శిక్షణలో జిల్లా క్రీడాకారులు
సత్ఫలితాలు సాధిస్తున్నారు. 20 రోజుల కింద జిల్లాకు చెందిన ఫ్లేయర్ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్గా నిలిచిన విషయం తెలిసిందే.. ఆమె స్ఫూర్తితోనైనా జిల్లాలో బాక్సింగ్ అకాడమీ వస్తుందని క్రీడాకారులు ఆశపడుతున్నారు.
రాణిస్తున్న జిల్లా బాక్సర్లు..
జిల్లా నుంచి 10 నుంచి 100 మందికి పైగా బాక్సింగ్ క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తున్నారు. జిల్లాలో బాక్సింగ్ శిక్షణకు లేకున్నా.. కలెక్టర్ గ్రౌండ్లోనే శిక్షణ పొందుతున్నారు. ప్రాథమికంగా శిక్షణ పొందే క్రీడాకారులు ఉపయోగించే గ్లౌజ్లు, హెడ్ కిట్స్ రూ.3 నుంచి రూ.10 వేల వరకు ఉంటాయి. చాలా మంది క్రీడాకారులు అవిలేకుండానే శిక్షణ తీసుకుంటున్నారు. స్పోర్ట్స్ అథారిటీలో బాక్సింగ్ కోచ్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. స్థానిక సీనియర్ క్రీడాకారుడు సంసముద్దీన్ జిల్లాలో 20 ఏళ్లుగా శిక్షణ ఇస్తున్నారు. ఈయన శిక్షణలో ఓనమాలుదిద్దిన నిఖత్ జరీన్ భారత కీర్తి పతాకాన్ని విశ్వ క్రీడా వేదికపై ఎగురేసింది. సంసముద్దీన్ శిక్షణ ఇచ్చిన వారిలో 10 మందికి పైగా అంతర్జాతీయ బాక్సర్లు, 30 మందికి పైగా జాతీయ స్థాయి బాక్సర్లు ఉన్నారు.
వసతులు లేకున్నా రాణిస్తున్నరు
నిఖత్ జరీన్ సాధించిన విజయంతో జిల్లాకు బాక్సింగ్ అకాడమీ మంజూరు చేయాలి. బాక్సింగ్ క్రీడాంశంలో జిల్లా క్రీడాకారులు వసతులు లేకున్నా ప్రతిభ చాటుతున్నారు. ప్రపంచ స్థాయి పోటీల్లోనూ పతకాలు సాధించారు. అకాడమీ ఏర్పాటు చేస్తే దేశం పేరు నిలబెట్టే దిగ్గజాలు ఇందూరు గడ్డ నుంచి పుట్టుకొస్తరు.
-సంసముద్దీన్, ప్రైవేట్ కోచ్
అకాడమీ ఏర్పాటు చేయాలి
20 ఏళ్లుగా కోచ్, వసతులు లేకున్నా సీనియర్ఫ్లేయర్ శిక్షణలో క్రీడాకారులు రాణిస్తున్నారు. బాక్సింగ్లో ఇండియాకే తలమానికంగా ఉన్న జిల్లాలో అకాడమీ ఏర్పాటు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఖరీదైన బాక్సింగ్ కిట్స్ అందుబాటులోకి తేవాలి.