ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ పర్యటన దృష్ట్యా హనుమకొండ, వరంగల్, కాజీపేట ప్రాంతాలను నో ఫ్లై జోన్ ప్రకటించారు పోలీసులు. 2023 జూలై 6 నుంచి 8 వరకు ప్రధాని పర్యటించే ప్రాంతాల్లో గగనతలాన్ని నో ప్లై జోన్ ప్రకటిస్తూ వరంగల్ కమిషనర్ ఏ.వి. రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు.
ఈ ప్రాంతాల్లో డ్రోన్, రిమోట్ కంట్రోల్ తో పనిచేసే మైక్రో లైట్ ఎయిర్ క్రాఫ్ట్, పారాగ్లైడర్ లాంటివి ఎగరవేయడం పూర్తిగా నిషేదించారు. ఎవరైనా ఉత్తర్వులను అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా ట్రై సిటీ పరిధిలో 2023 జూలై 7 నుంచి 8 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.
2023 జూలై 8 శనివారం రోజున ప్రధాని మోడీ వరంగల్ కు రానున్నారు. ఉదయం 9.50కి హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో ఉదయం 10.45కి వరంగల్ కు చేరుకుంటారు. ఉదయం 10.45 నుంచి 11.20 వరకు వరంగల్లో పలు అభివృద్ధి పనుల్లో పాల్గొనడంతో పాటు వివిధ ప్రాజెక్టు పనులకు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు.
ఈ తరువాత ఉదయం 11.30 గంటలకు హన్మకొండ కొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ వేదికగా నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.10 గంటకు తిరిగి హకీంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు.
మోడీ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. 5 లక్షల మంది టార్గెట్ గా జనసమీకరణ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ బండి సంజయ్ పరిశీలించారు.