హైదరాబాద్, వెలుగు: సిటీలో ఫుట్ఓవర్ బ్రిడ్జిలు(ఎఫ్వోబీలు) నిరుపయోగంగా మారుతున్నాయి. లిఫ్ట్లు, ఎస్కలేటర్లు లేకపోవటం, కొన్నింటికి లిఫ్ట్ ఉన్నా.. అవి పనిచేయకపోవడంతో జనాలు వీటిని వాడటం లేదు. కొన్నిచోట్ల ఫుట్ఓవర్ బ్రిడ్జిలు బస్టాండ్లకి దూరంగా ఉండటం, కొన్నింటిని తాగుబోతులు, బిచ్చగాళ్లు అడ్డాగా మార్చుకోవడంతో వాటి మీదుగా వెళ్లేందుకు జనాలు ఆసక్తి చూపడం లేదు. కొన్ని ఎఫ్ వోబీలకు మెట్లు సరిగ్గా లేక కిందపడతామేమోనని భయంతో వెళ్లేందుకు జనం జంకుతున్నారు.
పాదచారులకు తప్పని తిప్పలు..
పాదచారులకు ఉపయోగపడేలా సిటీలో100 చోట్ల ఎఫ్ వోబీలను నిర్మించాలని 2015లో జీహెచ్ఎంసీకి ప్రభుత్వం ప్రతిపాదించింది. కానీ 52 చోట్ల నిర్మించేందుకు ప్లాన్ వేసిన బల్దియా.. 22 చోట్ల మాత్రమే నిర్మాణాలు చేపట్టింది. అందులో 14 ఎఫ్ వోబీలను అందుబాటులోకి తీసుకురాగా.. మిగిలిన చోట్ల అరకొర పనులు జరుగుతున్నాయి. మెట్రో రైలు నిర్మాణానికి అడ్డు వస్తుండటంతో అంతకముందున్న కొన్ని ఎఫ్వోబీలను తొలగించారు. ప్రస్తుతం సిటీలో 20కి మించి ఫుట్ఓవర్ బ్రిడ్జిలు లేవు. ఈ ఉన్న కొన్నింటిని కూడా సరిగా మెయింటెయిన్ చేయడం లేదు. బేగంపేట పబ్లిక్ స్కూల్ ముందున్న ఎఫ్వోబీకి లిఫ్ట్ ఉన్నా అది పని చేయడం లేదు. మెట్లు ఎక్కి దిగేందుకు జనం ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రోడ్డుపై వెహికల్స్ రద్దీ ఎక్కువగా ఉన్నా రిస్క్ చేసి మరీ రోడ్డు దాటుతున్నారు. మెహిదీపట్నం ఎన్ఎండీసీ దగ్గరున్న ఫుట్ఓవర్ బ్రిడ్జి నిర్వహణ దారుణంగా ఉంది. చెత్త పేరుకుపోవడంతో ఏ మాత్రం క్లీన్గా లేదు. దీంతో అక్కడ ముక్కు మూసుకొని నడవాల్సి వస్తుందని పాదచారులు చెబుతున్నారు.
లిఫ్ట్ పనిచేస్తలే
బేగంపేటలో ఉన్న ఎఫ్వోబీకి లిప్టు ఉన్నా పనిచేస్తలేదు. మెట్లు ఎక్కి దిగితే టైం వేస్ట్ అయితది. కొన్నిసార్లు ఎక్కి దిగే టైమ్లో బస్సు పోతుంటది. అందుకే రిస్క్అయినా రోడ్డు దాటుతున్నా.
- రాజు, బేగంపేట
మెట్లు ఎక్కలేకనే..
లక్డీకపూల్లోని ఫుట్ఓవర్ బ్రిడ్జికి లిఫ్ట్, ఎస్కలేటర్ లేవు. నాకు మోకాళ్ల నొప్పులున్నయ్. మెట్లు ఎక్కి దిగితే ఆయాసం వస్తది. అందుకే పక్కన ఎవరైనా ఉన్నప్పుడు వారి చెయ్యి పట్టుకొని రోడ్డు దాటుతున్నా.
- పుల్లయ్య, వృద్ధుడు, లక్డీకపూల్