జాబ్స్ రావట్లే
కొత్త జాబ్స్ ఇస్తామంటున్నవి 7% కంపెనీలే
జాబ్స్ తీసేస్తామన్న 3% శాతం కంపెనీలు
గత 15 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు
న్యూఢిల్లీ: నిరుద్యోగులకు మున్ముందు మరింత గడ్డుకాలం దాపురించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి ఇండియా జాబ్మార్కెట్ను అతలాకుతలం చేసింది. రాబోయే మూడు నెలల్లో కొత్త వారికి జాబ్స్ ఇవ్వడానికి కేవలం ఏడు శాతం ఇండియన్ కంపెనీలు మాత్రమే రెడీగా ఉన్నాయని తాజా స్టడీ వెల్లడించింది. సర్వేలో పాల్గొన్న 813 కంపెనీల్లో 93 శాతం కంపెనీలు జాబ్స్ ఇవ్వలేమని తేల్చిచెప్పాయి. ఇండియాలో జాబ్ మార్కెట్ పరిస్థితి మరీ ఇంత అధ్వానంగా ఉండటం గత 15 ఏళ్లలో ఇదే మొదటిసారి. మ్యాన్పవర్ గ్రూప్ ఎంప్లాయ్మెంట్ ఔట్లుక్ సర్వే ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కేవలం ఏడుశాతం మంది ఎంప్లాయర్లు మాత్రం ఈసారి కొత్త జాబ్స్ వస్తాయని చెప్పారు. మూడు శాతం మంది మాత్రం జాబ్స్ తగ్గుతాయని, 54 శాతం మంది పరిస్థితులు యథాతథంగా ఉండొచ్చని చెప్పారు. ‘‘ఇండియాలో గత 15 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. హైరింగ్ సెంటిమెంట్ ఇంత బలహీనంగా ఉండటం ఇదే మొదటిసారి. మొదటి క్వార్టర్లో జాబ్స్ బాగానే దొరికాయి. గత ఏడాది రెండో క్వార్టర్తో పోలిస్తే ప్రస్తుత క్వార్టర్లో హైరింగ్.. 16 పర్సంటేజ్ పాయింట్లు తగ్గింది’’ అని సర్వే పేర్కొంది.
చిన్న కంపెనీలే కాస్త మేలు
పెద్ద వాటితో పోలిస్తే చిన్న కంపెనీల్లోనే జాబ్స్ ఉంటున్నాయి. మధ్యతరహా కంపెనీలు కూడా జాబ్స్ ఇవ్వడం మానేశాయి. వెస్ట్, సౌత్ రీజియన్లతో పోలిస్తే నార్త్, ఈస్ట్ రీజియన్లలో పరిస్థితి ఇంకా అధ్వానంగా ఉంది. దాదాపు అన్ని సంస్థలూ కొత్తగా జాబ్స్ ఇవ్వడానికి బదులు ప్రస్తుత మార్కెట్ డిమాండ్కు తగ్గట్టు కంపెనీని మార్చడం, ప్రొడక్టివిటీని పెంచడం, ఇందుకు అనుగుణంగా ఉద్యోగులను మార్చడం, సెలవుల్లో ఉన్న ఉద్యోగులను వెనక్కి రప్పించడంపై ఫోకస్ చేస్తున్నాయి. ఉద్యోగుల అవసరం తగ్గించడానికి టెక్నాలజీని పెంచుతున్నాయని మ్యాన్పవర్ గ్రూప్ ఇండియా ఎండీ సందీప్ గులాటీ చెప్పారు. ఫలితంగా కొత్త వారికి జాబ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండటం లేదని వివరించారు. ‘‘కార్పొరేట్లను ఆదుకోవడానికి ప్రభుత్వం కూడా ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్లు ఇస్తున్నది. వీటికి అనుగుణంగా లేబర్ యాక్టులను మార్చుతున్నది. పన్నుల విషయంలో వీటిని ఇబ్బందిపెట్టడం లేదు’’ అని పేర్కొన్నారు. ఇలాంటి మార్పుల ఎఫెక్ట్ ఎలా ఉంటుందో తెలియడానికి కొన్ని నెలలు పడుతుందని గులాటీ అన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉందంటే…
ఎమ్ఎన్సీల పద్ధతి మాత్రం వేరేలా ఉంది. 43 దేశాలలోని 22 మంది ఎంప్లాయర్లు డిసెంబరులోపు హైరింగ్ మొదలుపెడతామని చెప్పారు. 16 దేశాల్లోని కంపెనీలు జాబ్కట్స్ ఉంటాయని వెల్లడించాయి. ఐదు కంపెనీలు మాత్రం తాము ఎలాంటి మార్పులూ ఉండవన్నాయి. అమెరికా, టర్కీ, జపాన్, గ్రీస్లో ఉద్యోగ అవకాశాలు బాగుండే చాన్సులు కనిపిస్తున్నాయి. పనామా, కోస్టారికా, సౌతాఫ్రికా, కొలంబియా, బ్రిటన్లో నిరుద్యోగం పెరుగుతుందని మ్యాన్పర్ అంచనా వేసింది.
కొన్ని నెలలు ఆగాకే నియామకాలు
కాస్త ఊరటనిచ్చే విషయం ఏమిటంటే సర్వేలో పాల్గొన్న వారిలో 44 శాతం మంది ఎంప్లాయర్లు కరోనాకు ముందు ఇచ్చినన్ని జాబ్స్ ఇవ్వడానికి తొమ్మిది నెలల వరకు టైమ్ పడుతుందని చెప్పారు. మిగతా 42 శాతం మంది మాత్రం సాధారణ పరిస్థితులు ఎప్పుడు ఏర్పడుతాయో ఇప్పుడే అంచనాకు రావడం కష్టమని అన్నారు. ప్రస్తుత ఉద్యోగులను తగ్గిస్తారా ? అన్న ప్రశ్నకు 42 శాతం కంపెనీలు బదులిస్తూ జాబ్స్ తీసేయడానికి బదులు పని గంటలను తగ్గిస్తామని చెప్పాయి. మూడు శాతం కంపెనీలు మాత్రం ఎంప్లాయిలను తొలగిస్తామని అన్నాయి.
కొత్త జాబ్స్ ఉండని సెక్టార్స్
మాన్యుఫాక్చరింగ్, మైనింగ్, కన్స్ట్రక్షన్, సర్వీసెస్, హోల్ సేల్, రిటైల్ ట్రేడ్
కొత్త జాబ్స్ ఉండే సెక్టార్స్
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, ట్రాన్స్ పోర్టేషన్
For More News..