- పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే డీజిల్, పెట్రోల్ పోయొద్దు
- ఈ నెల 25 నుంచి ఢిల్లీలో కొత్త రూల్
న్యూఢిల్లీ: ఢిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించేందుకు ఆప్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పొల్యూషన్ అండర్ కంట్రోల్(పీయూసీ) సర్టిఫికేట్చూపిస్తేనే ఫ్యూయల్ వేయాలని ఆదేశించింది. అన్ని బంకులకు ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టంచేసింది. అక్టోబర్ 25 నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తుందని పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. వింటర్ సీజన్ను దృష్టిలో పెట్టుకుని, ఢిల్లీ వాసులకు స్వచ్ఛమైన గాలి ఇవ్వాలనే ఉద్దేశంతో పర్యావరణ, రవాణ, ట్రాఫిక్ అధికారులతో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. త్వరలోనే విధివిధానాలను ఖరారు చేస్తామన్నారు.
సరి–బేసి సంఖ్యల విధానం అమలుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి చెప్పారు. కిందటేడాదిలాగే వెహికల్ పొల్యూషన్, డస్ట్ పొల్యూషన్, చెత్తను బహిరంగంగా కాల్చడం వంటి ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. క్రాకర్స్పైనా నిషేధం కొనసాగుతుందన్నారు. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘పర్యావరణ్ మిత్రాస్’ సాయం తీసుకుంటున్నామని వివరించారు. పొల్యూషన్ కు కారణాలపై అధ్యయనం ప్రారంభించామని, అక్టోబర్ 20 తర్వాత ప్రతీ ఏరియా నుంచి రిపోర్టులు తీసుకుంటామని తెలిపారు.
ఢిల్లీలో 13 హాట్స్పాట్లు ఉన్నాయని, వాటి ఆధారంగానే పనిచేస్తున్నామని వివరించారు. వార్ రూంను మరింత మెరుగుపరుస్తున్నామని, గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (జీఆర్ఏపీ) శనివారం నుంచే అమలు చేస్తున్నట్టు తెలిపారు. జీఆర్ఏపీ అమలు, పర్యవేక్షణను వార్రూంతో లింక్ చేస్తామని, దీంతో ఇక్కడి నుంచే ప్రతిదీ తెలుసుకోవచ్చన్నారు.