న్యూఢిల్లీ: కరోనా మేనేజ్మెంట్ ప్రోటోకాల్స్ను నిర్లక్ష్యం చేయడంపై ప్రజలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్ హెచ్చరించారు. దసరా, దీపావళి పండుగలు రానున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ మతం లేదా దేవుడు పండుగలను తప్పకుండా జరుపుకోవాలని చెప్పలేదన్నారు. పండుగల కోసం ప్రాణాలను రిస్క్లో పెట్టొద్దన్నారు.
ప్రజలు తమ ఇళ్ల వద్దే ఉండి పండుగలను కుటుంబాలతో సెలబ్రేట్ చేసుకోవాలన్నారు. ‘మీ విశ్వాసాలు లేదా మతంపై నమ్మకాలను నిరూపించడానికి పెద్ద సంఖ్యలో భారీగా అందరూ ఒకేచోట గుమిగూడాల్సిన అవసరం లేదు. నిర్లక్ష్యం చేస్తే మనం పెద్ద ప్రమాదంలో పడతాం. కృష్ణ భగవానుడు మన లక్ష్యాలపైనే దృష్టి పెట్టాలని చెప్పాడు. మనందరి గోల్ వైరస్ను అంతమొందించి మానవ జాతిని కాపాడటమే. ఇదే మన మతం. ఇదే మొత్తం ప్రపంచ మతం’ అని హర్ష వర్దన్ చెప్పారు.