న్యూఢిల్లీ: గత 24 గంటల్లో దేశంలోని 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కేసు కూడా నమోదవలేదని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రాలకు 72 లక్షల ఎన్95 మాస్కులు, 36 లక్షల పీపీఈ కిట్లను పంపామన్నారు. ఇప్పటివరకు నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క కేసు కూడా నమోదవలేదని చెప్పారు. ఢిల్లీలోని మండోలి ఏరియాలో కొవిడ్ కేర్ సెంటర్ అరెంజ్మెంట్స్ను పరిశీలించిన మంత్రి ఆ తర్వాత మాట్లాడారు.
ఐదు జిల్లాల్లోనే ఎక్కువ కేసులు
దేశంలోని మొత్తం కేసుల్లో 64% 15 జిల్లాల్లోనే నమోదయ్యాయని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ 15 జిల్లాల్లోనూ 50% కేసులు ఢిల్లీ, పుణే, ముంబై, అహ్మదాబాద్, చెన్నై (5 జిల్లాలు)ల్లోనే రికార్డయ్యాయంది. ఢిల్లీ, ముంబై మొత్తాన్ని జిల్లాగా తాము లెక్కలోకి తీసుకున్నామని చెప్పింది. ఇందులో ముంబైలో 17%, ఢిల్లీలో 11.3%, అహ్మదాబాద్లో 9.8, చెన్నై 5, పుణేలో 3.4 శాతం కేసులున్నాయంది. ఈ ఐదు జిల్లాల్లో కేసుల పెరుగుదల విపరీతంగా ఉందని చెప్పుకొచ్చింది. రికవరీ రేటులో చెన్నై లాస్ట్లో ఉందని, ఇక్కడ కోలుకున్న వారి శాతం 12.3గా ఉందని వివరించింది. తర్వాతి స్థానంలో ముంబై (15.7 శాతం) ఉందంది. ఢిల్లీలో ఫాస్ట్గా కోలుకుంటున్నారని, ఇక్కడ రికవరీ రేటు 32.3 శాతంగా ఉందని వివరించింది. ఈ ఐదు జిల్లాల్లో మరణాల రేటు అహ్మదాబాద్లో ఎక్కువగా (6.4 శాతం) ఉందని నీతి ఆయోగ్ వెల్లడించింది. కేసుల డబ్లింగ్ రేటు చెన్నైలో 3, ఢిల్లీలో 3.6, పుణేలో 4.7, ముంబైలో 6.4, అహ్మదాబాద్లో 6.1 రోజులుగా ఉందని చెప్పింది. ముంబై విషయానికి వస్తే మహారాష్ట్రలోని 61.3 శాతం కేసులు ఇక్కడే ఉన్నాయి. గుజరాత్లోని కేసుల్లో 71.5 శాతం అహ్మదాబాద్వే.
లాక్డౌన్ ఎల్లకాలం ఉండదు: కేజ్రీవాల్
ఢిల్లీలోని 75 శాతం కేసులు అసింప్టమాటిక్, తక్కువ లక్షణాలున్నవేనని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. లక్షణాలున్న వారికి ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ చేస్తామన్నారు. లాక్డౌన్ ఎల్లకాలం ఉండదని, ఢిల్లీ వదిలి పోవాల్సిన అవసరం లేదని వలస కూలీలకు చెప్పారు.
రాజస్థాన్లో ప్లాస్మాథెరపీ సక్సెస్
రాజస్థాన్లో కరోనా పేషెంట్లకు చేస్తున్న ప్లాస్మా థెరపీ మంచి ఫలితాలు ఇస్తోంది. రాష్ట్ర రాజధాని జైపూర్లోని సవాయ్మాన్సింగ్ (ఎస్ఎంఎస్) ఆస్పత్రిలో ముగ్గురు పేషెంట్లకు ప్లాస్మా థెరపీతో ట్రీట్మెంట్ చేస్తున్నారు. వాళ్లు కోలుకుంటున్నారని, వాళ్ల రక్తం గడ్డ కట్టలేదని ఎస్ఎంఎస్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, కంట్రోలర్ డాక్టర్ సుధీర్ భండారీ తెలిపారు. ఐసీఎంఆర్, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) ప్రొటోకాల్స్ ప్రకారమే ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పారు. పేషెంట్లకు వరుసగా రెండు రోజుల పాటు 200 మిల్లీలీటర్ల ప్లాస్మాను ఎక్కించామన్నారు. మరో ఇద్దరు పేషెంట్లకూ ప్లాస్మా థెరపీ ట్రీట్మెంట్ చేస్తామన్నారు.
మహారాష్ట్రలో బస్ జర్నీ ఫ్రీ
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులు, ప్రజలు సొంత ప్రాంతాలకు వెళ్లేందుకు బస్సులను నేటి నుంచి ఫ్రీగా నడుపుతామని మహారాష్ట్ర సర్కారు ప్రకటించింది. కంటెయిన్మెంట్ జోన్లలోని వాళ్లకు ఈ రూల్స్ వర్తించవంది. సొంతంగా బండ్లున్న వాళ్లు వెళ్లాలనుకుంటే సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చే పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేసి అనుమతి పొందాలని చెప్పింది.
తమిళనాడులో షాపులు ఓపెన్
తమిళనాడు సర్కారు కొన్ని షాపులు తెరుచుకోవడానికి అనుమతిచ్చింది. సోమవారంనుంచి ఏయే షాపులు ఓపెన్ చేసుకోవచ్చో లిస్టు ప్రకటించింది. ఇందులో టీ షాపులు, బేకరీలు, హోటళ్లు, గ్రోసరీ స్టోర్లు, కన్స్ట్రక్షన్ మెటీరియల్ షాపులు, ఐ వేర్, మొబైల్ ఫోన్, నగల షాపులు, కంప్యూటర్ ఐటమ్స్ అమ్మే దుకాణాలు సహా ఇంకొన్ని ఉన్నాయి.
కేరళలో ‘సండే లాక్డౌన్’
రాష్ట్రంలో ఆదివారాల్లో పూర్తి లాక్డౌన్ను అమలు చేయనున్నట్టు కేరళ సర్కారు ప్రకటించింది. ఈ మేరకు శనివారం రాత్రి ఆదేశాలు జారీ చేసింది. కేవలం హాస్పిటళ్లు, ల్యాబ్లు, మీడియాకు మాత్రం అనుమతి ఉంటుందని చెప్పింది. తాజాగా అబుదాబి, దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా తేలడం.. మరోవైపు లక్షలాది మంది సొంత రాష్ట్రం వస్తామని రిజిస్టర్ చేసుకోవడంతో కేసులు పెరుగుతాయని ఆందోళన నెలకొంది.
అహ్మదాబాద్లో 334 మంది సూపర్ స్ప్రెడర్లు
గుజరాత్లోని అహ్మదాబాద్లో ఇప్పటివరకు 334 మంది సూపర్ స్ప్రెడర్లను కనుగొన్నట్టు అధికారులు వెల్లడించారు. దీంతో అక్కడ నిత్యావసర సరుకులతో పాటు అన్ని షాపులను ఈ నెల 15 వరకు మూసేయాల్సిందిగా ఆదివారం ఆదేశాలిచ్చారు. ఏప్రిల్ 20 నుంచే అహ్మదాబాద్లో సూపర్ స్ప్రెడర్లను కనుగొనే టెస్టులు మొదలయ్యాయని, ఇప్పటివరకు 3,817 మందికి టెస్టులు చేయగా 334 మందికి నిర్ధారణ అయిందని చెప్పారు. ఇంకో 14 వేల మంది సూపర్ స్ప్రెడర్స్ అని అనుమానం ఉందని, వాళ్లకు మరో 3 రోజుల్లో టెస్టులు చేస్తామని అధికారులు తెలిపారు.
ఐదుగురు పైలట్లకు కరోనా
ఇటీవల చైనా వెళ్లొచ్చిన ఐదుగురు ఎయిర్ ఇండియా సిబ్బందికి వైరస్ సోకింది. చైనా నుంచి కార్గోతో వచ్చిన సిబ్బందికి తిరిగొచ్చాక జరిగిన టెస్టుల్లో పాజిటివ్ తేలింది. వాళ్లందరిలో కరోనా లక్షణాలు కనిపించలేదని తెలిసింది. ఫ్లైట్లు నడుపుతున్న పైలట్లకు పకడ్బందీగా పీపీఈ కిట్లు వేసుకోవాలని ఆదేశాలున్నాయి. తాజాగా ఇద్దరు ఎయిర్ ఇండియా ఇంజనీర్లకు కూడా కరోనా సోకింది. ఈ నెల 7 వాళ్లకు టెస్టులు చేయగా ఆదివారం రిజల్ట్ వచ్చింది.