
ఇస్లామాబాద్: తోషాఖానా కేసు, మహిళా జడ్జిని బెదిరించిన కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు రెండు నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీ అయ్యాయి. ఈ రెండు కేసుల్లో ఇమ్రాన్ విచారణకు హాజరుకాలేదు. గత ఏడాది వజీరాబాద్లో ఇమ్రాన్ ఖాన్పై హత్యాయత్నం జరిగింది. కొంతమంది దుండగులు కాల్పులు జరపడంతో ఇమ్రాన్ గాయపడ్డారు. ఆ ఘటన నుంచి కోలుకుంటున్నారు.
తోషాఖానా కేసు, మహిళా జడ్జిని బెదిరించిన కేసులో సోమవారం ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంది. కోర్టుకు హాజరుకాకపోవడంతో ఇమ్రాన్కు కోర్టు అరెస్టు వారంట్లు జారీ చేసింది. తోషాఖానా కేసులో ఈ నెల 18న, బెదిరింపు కేసులో ఇదే నెల 21న ఆయనను కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను జడ్జీలు ఆదేశించారు.