
- వెల్లడించిన నార్త్ కొరియా అధికారిక మీడియా
సియోల్: నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చనిపోయాడంటూ మూడు వారాలుగా వస్తున్న వార్తలకు తెరపడింది. ఆయన కోమాలోకి వెళ్లారని, చనిపోయారని వచ్చిన వార్తలన్నీ అపోహలని తేలుస్తూ దాదాపు మూడు వారాల తర్వాత కిమ్ ప్రజల ముందుకు వచ్చారని ఉత్తర కొరియా అధికారిక మీడియా కేసీఎన్ఏ ప్రకటించింది. ప్యాంగ్యాంగ్ దగ్గర్లో కట్టిన ఎరువుల కంపెనీ ఓపెనింగ్కు కిమ్ తన చెల్లెలు కిమ్ యో జోంగ్తో కలిసి వచ్చారని చెప్పింది. ఆ కార్యక్రమానికి అధికారిక మీడియాను మాత్రమే అనుమతించారని, ఇండిపెండెంట్ మీడియాకి పర్మిషన్ లేదని పేర్కొంది. ఈ మేరకు కేసీఎన్ఏ కొన్ని ఫొటోలను రిలీజ్ చేసింది. అయితే ఆ ఫొటోలను, కిమ్ బయటికి వచ్చాడనే వార్తను ఇంటర్నేషనల్ మీడియా ఒప్పుకోలేదు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కిమ్కు ఆపరేషన్ చేసిన తర్వాత ఆయన కోమాలోకి వెళ్లిపోయారని వార్తలు వచ్చాయి. అందుకే కిమ్ తన తాత 108వ జయంతికి కూడా రాలేకపోయాడని పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆయన చనిపోయాడని వార్తలు చెక్కర్లు కొట్టాయి.