హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా, గడువులోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి. సుదర్శన్రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల జాబితాలో నో మ్యాపింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని, అభ్యంతరాలు, క్లెయిమ్లను సత్వరం పరిష్కరించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు ఓటర్ల ఇళ్లకు వెళ్లి అవసరమైన నోటీసులు అందించాలని సీఈఓ సూచించారు. హియరింగ్ కోసం తగినంత మంది సిబ్బందిని, ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. “అర్హత ఉన్న ఒక్క ఓటరునూ జాబితా నుంచి పోవద్దు.. అదే సమయంలో ఒక్క అనర్హుడికీ చోటు దక్కొద్దు” అని స్పష్టం చేశారు. ఫారం-6, 6ఏ, 7, 8 దరఖాస్తుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు.
