విజయానికి ధైర్యమే ఆయుధం. అధైర్యం ఆవహిస్తోందని లేశమాత్రం అనుమానం వచ్చినా సరే, ఎంత మాత్రం ఉపేక్షించవద్దు. దాన్ని మొగ్గలోనే తుంచేయండి. లేకపోతే మొదటికే మోసం అంటాడు చాణక్యుడు.
ధైర్యం ఉన్న మనిషి సాధించలేనిది లేదు. అధైర్యవంతులు ఎందులోనూ ముందడుగు వేయలేరు. చిన్నతనం నుంచే పిల్లలకు ధైర్యం నేర్పాలి. పిరికివారిగా తయారుచేయకూడదు. అదేవిధంగా ప్రతి చిన్నవిషయానికీ పిల్లల్ని భయపెట్టకూడదు. భయానికి లోనైనప్పుడే అధైర్యం వస్తుంది. కొందరికి దేవుడు ధైర్యం. కొందరికి కొందరి మాట ధైర్యం. కొందరికి పుస్తకాలే ధైర్యం. కొందరికి తల్లిదండ్రులు లేదా తోబుట్టువులే ధైర్యం. మరికొందరికి నమ్మకాలే ధైర్యం. ధైర్యంగా జీవించటానికి దేనిని ఆచరించినా నష్టం లేదంటున్నారు పెద్దలు, పండితులు. మనిషికి ధైర్యం ప్రధానం. శ్రీరామచంద్రుడిని పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యాలకు వెళ్లమన్నప్పుడు, ఏ మాత్రం భయపడలేదు. అడవిలో పులులు, సింహాల వంటి క్రూరమృగాలే కాకుండా, మనుషులను చంపి తినే రాక్షసులు ఉంటారని తెలిసి కూడా ధైర్యంగా వనవాసం చేశాడు రాముడు. రాక్షస సంహారం చేశాడు. పాండవులు అరణ్య, అజ్ఞాత వాసాలు చేయవలసి వచ్చినప్పుడు కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. అజ్ఞాతవాసంలో తమ నిజస్వరూపాలు బయట పడతాయేమోనన్న బెరుకు ఏ మాత్రం లేకుండా, ధైర్యంగా సమయస్ఫూర్తితో కాలం గడిపారు. విజయం సాధించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు.
స్వాతంత్య్ర పోరాట సమయంలో దేశభక్తులు నిర్భయంగా పోరాడారు. తుపాకి గుండుకు తన గుండెను చూపి ఆంధ్ర కేసరి అయ్యాడు టంగుటూరి ప్రకాశం పంతులు. సత్యాగ్రహం అనే ఆయుధంతో తాను ముందడుగు వేస్తూ ధైర్యంగా అందరినీ ముందుకు నడిపించాడు గాంధీజీ. విప్లవవీరుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఎంతో ధైర్యంతో తన మన్నెం ప్రజలను కాపాడుకుంటూ, స్వాతంత్య్ర పోరాటం చేశాడు. ఇంతమందీ ముందుకు దూసుకుపోవటానికి ధైర్యమనే ఆయుధమే సహకరించింది.
సింహము కుందేలు కథ అందరికీ తెలిసిందే. అడవికి రాజు సింహం. తన పరిపాలనలో ఉన్న ప్రాణులను రోజుకొకటి చొప్పున ఆహారంగా స్వీకరించేది. ఒక రోజు కుందేలు వంతు వచ్చింది. ఏ విధంగానైనా తన ప్రాణాలు కాపాడుకోవాలనుకుంది. కుందేలు అతి స్వల్ప ప్రాణి. అయితేనేం ధైర్యాన్ని ఆయుధంగా వాడుకుంది. సింహంతో ముచ్చట్లు పలికి, బావిలో మరో సింహం ఉందని, అదే అడవికి రాజునని విర్రవీగుతోందని పలికింది. సింహానికి కోపం వచ్చింది. ఆ సింహం ఎక్కడుందో చూపమంది. సింహాన్ని బావి దగ్గరకు తీసుకువచ్చింది. అది లోపలకు తొంగి చూస్తూ, గట్టిగా గర్జించింది. లోపల నుంచి కూడా అదే శబ్దం వచ్చింది. లోపల మరో సింహం ఉందని భావించింది. ఆలోచన లేకుండా వెంటనే బావిలో ఉన్న సింహాన్ని సంహరించటానికి బావిలోకి దూకింది. అంతే అది చచ్చిపోయింది. అలా కుందేలు తన ప్రాణాలను కాపాడుకోవటమే కాకుండా, తన తోటి జంతువుల ప్రాణాలు కూడా రక్షించింది. ఇంతటి ఘనకార్యం సాధించడానికి అల్పప్రాణి అయిన కుందేలు ధైర్యమనే పెద్ద ఆయుధాన్ని ఉపయోగించిందని మనకు పంచతంత్రం చెబుతోంది.
ధైర్యే సాహసే లక్ష్మీ అని మనకు మన పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా అష్టలక్ష్ముల గురించి చెప్పినప్పుడు ధైర్యలక్ష్మి పేరు కూడా చెబుతారు. ధైర్యంగా ఉండటమే మనకు సంపద.
ఉత్తానపాద మహారాజుకి ఇద్దరు భార్యలు.. సునీతి, సురుచి. పెద్ద భార్య కొడుకు ధృవుడు. ఒకనాడు ధృవుడు తండ్రి ఒడిలో కూర్చోబోతాడు. ‘నీకు నీ తండ్రి ఒడిలో కూర్చునే అర్హత లేదు. తపస్సు చేసి ఆ అర్హత సంపాదించుకో’ అని కఠినంగా చెబుతుంది సురుచి. వెంటనే ధృవుడు ధైర్యంగా అడవులకు బయలుదేరతాడు. తల్లి సునీతి భయపడుతుంది. తల్లికి ధైర్యం చెప్పి అడవులకు పోయి కఠోర తపస్సు చేస్తాడు ధృవుడు. తండ్రి ఒడిలో కూర్చోవటమే కాకుండా, ఆకాశంలో నక్షత్రంగా మారి, ధృవస్థానాన్ని సంపాదించుకున్నాడు. ధైర్యమే ధృవుడిని నక్షత్ర స్థాయికి చేర్చింది.
ధైర్యాన్ని విడిచిపెట్టకుండా పోరాటం చేసినవారంతా సత్ఫలితాలను పొందారు.
టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఒకసారి ఒక కేసు వాదిస్తున్న సమయంలో, వారి శ్రీమతి గతించిన వార్త వచ్చింది. పంతులు ఏ మాత్రం ధైర్యాన్ని విడిచిపెట్ట కుండా, కుంగిపోకుండా కేసును పూర్తిగా వాదించి, అప్పుడు కోర్టు నుంచి బయటకు వచ్చారు. అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఒంటి మీద పెద్ద వ్రణం (రాచపుండు) వచ్చింది. శస్త్రచికిత్స చేసి ఆ వ్రణాన్ని తొలగించాలి. అందుకోసం మత్తు ఇవ్వాలని వైద్యులు చెప్పారు. పటేల్ మొక్కవోని ధైర్యంతో, ‘నాకు మత్తు ఇవ్వకుండానే శస్త్రచికిత్స నిర్వహించండి’ అని పలికాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన చూపిన ధైర్యానికే ఆయనను ఉక్కుమనిషి అంటారు. మహాభారతం లో... కర్ణుడి కవచకుండలాలను ఇంద్రుడు కోరాడు. అవి తన శరీరానికి రక్షణగా ఉంటాయని తెలిసినప్పటికీ కర్ణుడు ఏ మాత్రం బెదరకుండా ఎంతో ధైర్యంగా తన శరీరం మీది కవచకుండలాలను దానంగా అందజేశాడు.
- డా. వైజయంతి పురాణపండ
ఫోన్: 80085 51232