లండన్‌‌‌‌లో ఇండియన్ సంతతి ఫ్యామిలీ సూసైడ్!

లండన్‌‌‌‌లో ఇండియన్ సంతతి ఫ్యామిలీ సూసైడ్!

ఫ్లాట్ లో కొడుకు, భార్య డెడ్ బాడీలు

పోలీసులు రాకకుముందే  కత్తితో పొడుచుకున్న భర్త

లండన్: లండన్ లో నివసిస్తున్న భారత సంతతి ఫ్యామిలీ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తమిళ ఫ్యామిలీకి చెందిన కుహరాజ్ సీతాంపరనాథన్ (42), పూర్ణ కామేశ్వరీ శివరాజ్ (36) భార్యాభర్తలు. వీరి కొడుకు కైలాశ్ కుహరాజ్ (3). మలేషియాకు చెందిన వీరు 2015లో పెళ్లి చేసుకొని, ఆ తర్వాత లండన్ వెళ్లారు. వీరి నుంచి ఫోన్ కాల్స్ కు రెస్పాన్స్ లేదని ఆదివారం వాళ్ల కుటుంబ సభ్యులు లండన్ పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు సోమవారం ఫ్లాట్ కు వెళ్లగా, లోపలి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. లాక్ చేసి బయటకు వెళ్లి ఉంటారేమోనని తిరిగి వెళ్లిపోయారు. రెండుమూడు సార్లు వెళ్లినా, ఎవరూ లేకపోవడంతో.. చివరికి మంగళవారం అర్ధరాత్రి ఒంటిగంటకు డోర్ పగులగొట్టారు. లోపలికి వెళ్లి చూడగా కుహరాజ్ రక్తపు మడుగులో కనిపించాడు. పోలీసులు వచ్చే కంటే ముందే అతడు కత్తితో పొడుచుకున్నట్టు అనుమానిస్తున్నారు. అతణ్ని కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, స్పాట్ లోనే చనిపోయాడు. ఇంట్లో వెతకగా కామేశ్వరీ, కైలాశ్ మృతదేహాలు కనిపించాయి. ఇంట్లోని కుక్క పిల్ల కూడా చనిపోయి ఉంది. ‘‘కామేశ్వరీ, కైలాశ్ కొన్ని రోజుల ముందే చనిపోయినట్లు క్రైమ్ సీన్ ను బట్టి తెలుస్తోంది. కుహరాజ్ వారిద్దరినీ చంపి, సూసైడ్ చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నాం. మర్డర్–సూసైడ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం” అని పోలీసులు తెలిపారు. వీరు డాగ్ ను తీసుకొని బయటకు వెళ్లే వారని.. అయితే సెప్టెంబర్ 21 నుంచి కామేశ్వరీ, కైలాశ్ బయట కనిపించలేదని పక్కనున్న ఫ్లాట్ల వాళ్లు చెప్పారు. భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుండేవని చెప్పారు.