ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆలోచనల్లో చాలా మార్పు కనిపిస్తోంది. పదేళ్ల కిందట బీజేపీతో దోస్తానా కటీఫ్ చేసుకున్నాక ఏ పార్టీతోనూ కలవలేదు. ఇన్నాళ్లూ ఒక్క తీరుగా పాలిటిక్స్ నడిపిన పట్నాయక్ ఇప్పుడు డిఫరెంట్డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఎన్డీయేకి దగ్గరవుతున్నారు. సిటిజన్షిప్ సవరణ చట్టానికి బీజేడీ సపోర్ట్ చేయటమే ఈ ఫ్రెండ్షిప్కి లేటెస్ట్ ఉదాహరణ. పట్నాయక్ పాటిస్తున్న ఈ కొత్త పాలసీకి ఎనలిస్టులు కారణాలు వెతుక్కుంటున్నారు.
ఒడిశా లోని అధికార బిజూ జనతా దళ్ (బీజేడీ) ఒకప్పుడు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయేకి మిత్రపక్షమే. 1998 లోక్సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. ఆ స్నేహం పదేళ్లకుపైగా కొనసాగింది. 2008లో కాంధమాల్లో జరిగిన హింసాకాండ ఈ రెండు పార్టీలను వేరు చేసింది. 2014లో మోడీ హవా సాగినప్పుడుకూడా బీజేడీ ప్రెసిడెంట్, సీఎం నవీన్ పట్నాయక్ న్యూట్రల్గానే ఉండిపోయారు. అయితే, కేంద్రం తీసుకునే నిర్ణయాలకు సందర్భాన్ని బట్టి సపోర్ట్ చేసేవారు. అదే తీరులో సిటిజన్షిప్ చట్టానికి సై అన్నారు.
వ్యతిరేకించింది తక్కువే!
2015లో మోదీ సర్కారు రూపొందించిన ‘మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) అమెండ్మెంట్ బిల్లు–2015’కి బీజేడీ మద్దతిచ్చి రాజ్యసభలో పాసయ్యేలా చేసింది. 2017లో ఎన్డీయే ప్రతిపాదించిన రాష్ట్రపతి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్కీ సపోర్ట్ చేసింది. ఆ తర్వాత ఏడాది ఇతర నాన్–ఎన్డీయే పక్షాలు లోక్సభలో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు సైలెంట్గా ఉండిపోయింది. సభలోనే ఉంటే వ్యతిరేకంగానో, అనుకూలంగానో ఓటేయాల్సి ఉంటుంది కాబట్టి, తెలివిగా వాకౌట్ చేసింది.
పెద్ద నోట్ల రద్దు, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) వంటి నిర్ణయాల్ని ముందుగా సమర్థించిన సీఎంలలో నవీన్ పట్నాయక్ ఒకరు. అలా అని ఆయన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారనుకుంటే పొరపాటు. జాతీయ, రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా నడుచుకున్నారు. మహానది నీళ్ల గొడవ, పోలవరం ప్రాజెక్టు పంచాయతీ వంటి అంశాల్లో మోడీ గవర్నమెంట్ని తీవ్రంగా విమర్శించారు. వరికి కనీస మద్దతు ధర పెంచాలని కోరుతూ… గత జనవరిలో రైతులతో ఢిల్లీకి ర్యాలీ కూడా నిర్వహించారు.
ఎన్నికల తర్వాత పూర్తిగా అనుకూలం
ఈ ఏడాది అటు లోక్సభకు, ఇటు ఒడిశా అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. జనరల్ ఎలక్షన్లో ఎన్డీయే పోయినసారి కన్నా భారీ మెజారిటీతో మళ్లీ పవర్లోకి వచ్చింది. ఒడిశాలో బీజేడీ వరుసగా ఐదోసారి అధికారం చేజిక్కించుకుంది. ఇక, అప్పటినుంచి నవీన్ పట్నాయక్ కేంద్రానికి పూర్తిగా ఫ్రెండ్లీగా మారిపోయారు. ట్రిపుల్ తలాక్ బిల్లుకు, ఆర్టికల్–370 రద్దుకు ఓకే అనేశారు. నిన్నగాక మొన్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ)కి ఓపెన్గానే సపోర్ట్ చేశారు. ఆ చట్టం వల్ల మన దేశంలోని ముస్లింలకు ఎలాంటి నష్టం లేదని చెప్పారు నవీన్.
ఒడిశాకు ప్రధాన ఆదాయ వనరు మైనింగ్. కానీ… ఆ సెక్టార్లో ఇప్పుడు పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. మిగతా రెవెన్యూ జనరేషన్ రంగాల్లోనూ రాబడి మందగించింది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. సంక్షేమ పథకాలను కొనసాగించటం సవాల్గా మారింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆదుకోవటం తప్ప మరో మార్గం లేదు. ఫణి తుఫాన్ ప్రభావం నుంచి కోలుకోవటానికీ పెద్దఎత్తున డబ్బులు కావాల్సి వచ్చింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, పాలిటిక్స్ని పక్కనపెట్టి, ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా నవీన్ పట్నాయక్ అడుగులేస్తున్నారు.
‘కిసాన్’ను కలుపుకున్న ‘కాలియా’
రైతులకు ఏటా రూ.10 వేలు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు పట్నాయక్ ప్రభుత్వం ‘కృషక్ అసిస్టెన్స్ ఫర్ లైవ్లీహుడ్ అండ్ ఇన్కం ఆగ్మెంటేషన్’(కాలియా) పథకం పెట్టింది. ఎన్నికల ముందు ప్రకటించిన ఈ స్కీమ్.. బీజేడీకి ఓట్ల వర్షం కురిపించింది. ఆ తర్వాత ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల అంత డబ్బు ఇవ్వటం రాష్ట్ర ప్రభుత్వానికి కష్టంగా మారింది. ఫలితంగా రూ.10 వేలను రూ.4 వేలకు తగ్గించింది. ఆ నష్టాన్ని ‘ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి’ (పీఎం–కిసాన్)తో భర్తీ చేయాలని నిర్ణయించింది. దీంతో ‘కాలియా’, ‘కిసాన్’ కలిసిపోయాయి.