- ఏర్పాట్లు మొదలు పెట్టిన అధికారులు
- ఓటర్ జాబితాల సవరణ ప్రక్రియ షురూ
- కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం
మెదక్, వెలుగు : రానున్న లోకసభ ఎన్నికలకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా అధికార యంత్రాంగం సన్నాహాలు షురూ చేసింది. రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ బుధవారం లోకసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కలెక్టర్లు, ఆర్డీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి.. ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. మెదక్ లోకసభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా అధికారులు ఓటర్లు, పోలింగ్ స్టేషన్ల వివరాలను సిద్ధం చేశారు. ఎన్నికలను పకడ్భందీగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
మెదక్ లోక్ సభ నియోజకవర్గానికి ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా మెదక్ కలెక్టర్ వ్యవహరించనున్నారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్లుగా వ్యవహరించిన అధికారులు లోక్సభ ఎన్నికల్లో ఆయా సెగ్మెంట్ల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ (ఏ.ఆర్.ఓ.)గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.
17,62,591 ఓటర్లు
మెదక్ లోక్ సభ నియోజకవర్గంలో మొత్తం,17,62,591 మంది ఓట్లర్లు ఉన్నారు. ఇందులో 8,75,046 మంది పురుషులు , 8,87,182 మంది మహిళలు , 76 మంది ఇతరులు ఉండగా .. 157 మంది సర్వీస్ ఓటర్లు, 8 మంది ఎన్ ఆర్ ఐ లున్నారు. లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 2,112 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. 2024 జనవరి 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండిన వారు కొత్తగా ఓటరుగా నమోదు అయ్యేందుకు అవకాశం ఉంది.
ఈ మేరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదయ్యేలా చూసేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఓటరు లిస్ట్లో మార్పులు, చేర్పులు, అడ్రస్ మార్పిడికి అవకాశం కల్పించారు. కొత్త ఓటర్ల నమోదు, మార్పులు చేర్పుల కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించి.. జనవరి 6న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ జాబితా ప్రకటించి అభ్యంతరాలను తీసుకుంటారు. ఫిబ్రవరి 8న ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు.
అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ఓటర్లు, పోలింగ్ స్టేషన్లు
సెగ్మెంట్ మొత్తంఓటర్లు పోలింగ్ స్టేషన్లు
పటాన్చెరు 3,97,312 405
సంగారెడ్డి 2,38,336 281
నర్సాపూర్ 2,21,277 305
మెదక్ 2,16,843 274
దుబ్బాక 1,94,664 253
సిద్దిపేట 2,28,523 273
గజ్వేల్ 2,65,636 321