బ్రిస్బేన్: పూర్తిగా పేసర్లకు సపోర్ట్ ఇచ్చిన గబ్బా పిచ్పై ఆస్ట్రేలియా బౌలర్లు వరుసగా రెండు రోజు సౌతాఫ్రికా బ్యాటింగ్ను దెబ్బకొట్టారు. దాంతో రెండు రోజు ఆదివారం ముగిసిన తొలి టెస్టులో ఆసీస్ ఆరు వికెట్ల తేడాతో సఫారీలను చిత్తు చేసి మూడు మ్యాచ్ల సిరీస్లో 1–0తో ఆధిక్యం సాధించింది. సఫారీలు ఇచ్చిన 34 రన్స్ టార్గెట్ను ఆసీస్ 7.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేజ్ చేసింది. గ్రాస్తో కూడిన గ్రీన్ వికెట్పై రెండు రోజుల్లో 34 వికెట్లు పడటంతో పిచ్పై విమర్శలు వస్తున్నాయి.
ఓవర్ నైట్ స్కోరు 145/5 తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 218 పరుగుల వద్ద ఆలౌటైంది. 66 రన్స్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కించుకుంది. ట్రావిస్ హెడ్ (92) టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ (36), అలెక్స్ కారీ (22) ఫర్వాలేదనిపించారు. సఫారీ బౌలర్లలో కగిసో రబాడ నాలుగు, మార్కో జాన్సెన్ మూడు వికెట్లతో సత్తా చాటారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ కు వచ్చిన సౌతాఫ్రికా.. కమిన్స్ (5/42) దెబ్బకు 37.4 ఓవర్లలో 99 పరుగులకే కుప్పకూలి ఆసీస్కు చిన్న టార్గెట్ను ఇచ్చింది.
స్టార్క్, స్కాట్ బోలాండ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఖయా జోండో (36), టెంబా బవూమ (29) మాత్రమే రాణించారు. 34 రన్స్ ఛేజింగ్లో సఫారీ బౌలర్ కగిసో రబాడ ( 4/13) సైతం ఆసీస్ను వణికించాడు. అతని దెబ్బకు ఖవాజా (2), వార్నర్ (3), స్మిత్ (6), హెడ్ (0) బ్యాట్లెత్తారు. అయితే, ఎక్స్ ట్రాల రూపంలోనే 19 రన్స్ రాగా.. ఎనిమిదో ఓవర్లో బౌండ్రీ కొట్టిన లబుషేన్ (5 నాటౌట్) లాంఛనం పూర్తి చేశాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మెల్బోర్న్లో ఆ నెల 26న మొదలవుతుంది.