మణిపూర్ నగ్నంగా మహిళల ఊరేగింపు, పొలాల్లో అత్యాచారం

మణిపూర్ నగ్నంగా మహిళల ఊరేగింపు, పొలాల్లో అత్యాచారం

మణిపూర్ రావణకాష్టంగా రగులుతూనే ఉంది. రిజర్వేషన్ల అంశంలో తలెత్తిన వివాదం.. ఆ తర్వాత విధ్వంసానికి దారి తీసింది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న అంతర్ యుద్ధంలో.. ఓ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను.. ప్రత్యర్ధులు తీవ్రంగా కొట్టి.. నడిరోడ్డుపై నగ్నంగా ఊరేగించటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. రెండు జాతుల మధ్య జరుగుతున్న పోరాటానికి ఇది పరాకాష్టగా చెప్పొచ్చు. 2023, మే 4వ తేదీ జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఒకరిని పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తోంది.

వీడియోలో కనిపించిన మహిళల చుట్టూ కొందరు మగాళ్లు వాళ్లను తాకుతూ.. కొడుతూ తీసుకెళ్లటం స్పష్టంగా కనిపిస్తుంది. ఊరి చివర పొలంలో ఈ ఇద్దరు మహిళలపై అత్యాచారం జరిగినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. మణిపూర్ రాజధాని ఇంఫాల్ కు కేవలం 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్ పోష్కి జిల్లాలో మే 4వ తేదీన ఈ ఘటన జరిగినట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు చెబుతున్నారు. ఈ ఘటనపై నాంగ్ పాక్ సెక్ మై పోలీస్ స్టేషన్ లో కేసు కూడా నమోదైనట్లు పోలీసులు చెబుతున్నారు. మహిళలను నగ్నంగా ఊరేగించింది ఎవరు.. ఎందుకు ఈ దారుణానికి పాల్పడ్డారు అనేది పోలీసులు చెప్పటం లేదు. గుర్తు తెలియని వ్యక్తులు ఇద్దరు మహిళలను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసినట్లు చెబుతున్నారు పోలీసులు. వీడియోలో మాత్రం అందుకు భిన్నంగా కనిపించటం విశేషం. మణిపూర్ రాష్ట్రంలో రెండు తెగల మధ్య కొన్నాళ్లుగా దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి.

కొందరు మగాళ్లు ఓ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి రావటం దేశ వ్యాప్తంగా కలకలం రేపుతోంది. మణిపూర్ లో జరుగుతున్న ఆందోళనలకు ఇది సాక్ష్యంగా సోషల్ మీడియా దుమ్మెత్తిపోస్తుంది.ఇండిజినియస్ ట్రైబల్ లీడర్స్ ఫోరం తలపెట్టిన భారీ ర్యాలీకి కొన్ని గంటల ముందు ఈ వీడియోను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు కొందరు వ్యక్తులు. గిరిజనుల అకృత్యాలకు ఇది పరాకాష్ఠ అంటూ కామెంట్లు చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ రాజకీయ నేతలు, సామాజిక వేత్తలు, గిరిజన నాయకులు పోస్టులు పెడుతున్నారు. మహిళలను నగ్నంగా ఊరేగించటానికి కారణం అయిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని దేశవ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయి.