
- కలెక్టరేట్ల కన్నా ఇంటిగ్రేటెడ్ గురుకులాలకు తక్కువ వ్యయం
- రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కలెక్టరేట్ల కన్నా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు తక్కువ ఖర్చుపెడుతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇంజినీరింగ్ డిజైన్ల ఆధారంగా రేట్ల షెడ్యూల్ను దృష్టిలో ఉంచుకుని అన్ని అంచనాలు అత్యంత పారదర్శకంగా తయారు చేశామని శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటిగ్రేటెడ్ గురుకులాల అంచనా వ్యయం భారీగా పెంచారని మీడియాలో వచ్చిన వార్తలకు ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
గత బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కలెక్టరేట్ల నిర్మాణానికి రేట్ల కన్నా ప్రస్తుత యంగ్ ఇండియా రెసిడెన్షియల్స్ సూళ్లకు నిర్ణయించిన రేట్లు తక్కువగా ఉన్నాయని తెలిపింది. సిద్దిపేట కలెక్టరేట్ కి చదరపు అడుగుకు రూ.4,058, సిరిసిల్ల కలెక్టరేట్ కి చదరపు అడుగుకు రూ.4,990, ములుగు కలెక్టరేట్ కు రూ.3,994, వరంగల్ ఈస్ట్ కలెక్టరేట్ కు రూ.4,875 గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించిందని వివరించింది. అత్యాధునిక మౌలిక వసతులతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణానికి చదరపు అడుగుకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.3,730 మాత్రమే అని పేర్కొంది.