
వనపర్తి టౌన్, వెలుగు: వివిధ కారణాలతో మధ్యలో బడి మానేసిన వారికి తెలంగాణ ఓపెన్ స్కూల్ వరం అని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఓపెన్ స్కూల్ జాయింట్ డైరెక్టర్ ఎం.సోమిరెడ్డి కోరారు. శుక్రవారం ఆయన వనపర్తి జిల్లాలో పర్యటించారు. కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన మీటింగ్ లో ఆయన మాట్లాడారు. జిల్లాలో మధ్యలో చదువు మానేసిన వారిని గుర్తించి ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ లో చేర్పించాల్సిన బాధ్యత విద్యా శాఖ అధికారులపై ఉందన్నారు. డీఆర్డీవో, సెర్ప్ ద్వారా మహిళా సంఘాల్లో చదువురాని వారిని గుర్తించి అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని సూచించారు.
దేశంలోని ప్రతి మహిళకు చదువు చెప్పాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉల్లాస్ పథకాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు. 15 ఏండ్లు పై బడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడం, వారికి అవసరమైన నైపుణ్యాలను నేర్పించడమే ఈ పథకం ఉద్దేశమని తెలిపారు. డీఈవో అబ్ధుల్ ఘని, డీఆర్డీవో ఉమాదేవి, డీపీఎం ప్రభాకర్, డీడబ్ల్యూవో సుధారాణి, స్టేట్ గర్ల్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నితిన్, అడల్ట్ ఎడ్యుకేషన్ ఏపీవో రాజేంద్రప్రసాద్, టాస్ కో ఆర్డినేటర్ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.