
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మార్చి10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఎమ్మెల్సీ కవిత చేయబోయే దీక్షకు విపక్ష నేతలు మద్దతు తెలపనున్నారు. కవితకు మద్దతుగా దేశంలోని 16 పార్టీలకు చెందిన ప్రతినిధులు, 29 రాష్ట్రాల నుంచి మహిళల హక్కుల కోసం పోరాడే సంఘాలు నేతలు ఈ రోజు జంతర్ మంతర్కు చేరుకోనున్నారు. కవిత దీక్షకు హాజరై బీఆర్ఎస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, ఆకలిదళ్, టీఎంసీ, జేడీయూ, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ, సిపిఎం, డీఎంకే, ఎన్సీపీ, శివసేన, ఆప్, ఆర్ఎల్డి, జేఎమ్ఎమ్ పార్టీల నుండి ప్రతినిధులు తమ సంఘీభావం తెలపనున్నారు. కాగా మధ్యాహ్నం 1 గంటకు ఎమ్మెల్సీ కవిత ఇవాళ ఢిల్లీలో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు.
11న విచారణకు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరవుతారా లేదా అన్న అంశంపై సందిగ్థతకు తెరపడింది. ఈ నెల 11న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణకు హాజరుకానుంది. ఈ నెల 9న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ అధికారులకు ఎమ్మెల్సీ కవితకు నోటీసులు పంపారు. అయితే ముందస్తు కార్యక్రమాలు ఉన్నందున ఈ నెల 9న రాలేనని ఈడీకి సమాచారం ఇచ్చారు. 15వ తేదీ విచారణకు వస్తానని ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఈ లేఖపై ఈడీ స్పందించకపోవడంతో 11వ తేదీన అయినా విచారణకు హాజరవుతానని ఈడీ జాయింట్ డైరెక్టర్కు మరో లేఖ పంపారు. దీనికి స్పందించిన ఈడీ అధికారులు..11న విచారణకు హాజరయ్యేందుకు అనుమతిచ్చారు.