జులై 17, 18న బెంగళూరులో విపక్షాల సమావేశాలు…

జులై 17, 18న బెంగళూరులో విపక్షాల సమావేశాలు…

బెంగళూరులో సోమవారం (జులై 17న) ప్రతిపక్షాల మీటింగ్‌‌‌‌కు జరగనుంది. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని కట్టడి చేయడానికి ప్రతిపక్షాలు ఐక్యంగా ముందుకు సాగుతున్న సమయంలో ఈ భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే రెండుసార్లు ప్రతిపక్షాలు భేటీ అయ్యాయి. అందులో భాగంగా సోమవారం (జులై 17న), మంగళవారం (జులై 18న) బెంగళూరులో మరోసారి సమావేశం కావాలని ప్రతిపక్ష పార్టీలు నిర్ణయించాయి. 

సోమ, మంగళవారాల్లో కాంగ్రెస్‌ సహా 24 ప్రతిపక్ష పార్టీలు బెంగళూరులో సమావేశం కానున్నాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్‌ అధినాయకురాలు సోనియాగాంధీ ఆధ్వర్యంలో జరిగే భేటీలో రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నారు. 

బీహార్, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రులు నితీశ్‌కుమార్, స్టాలిన్, మమతాబెనర్జీ కూడా సమావేశంలో పాల్గొననున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపు కోసం ప్రతిపక్షాలు ఏకం కావడంతో.. బీజేపీ కూడా తన స్పీడ్ పెంచింది. ఎన్‌డీఏ పక్ష మీటింగ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా మంగళవారం(జులై 18వ తేదీన) ఎన్‌డీఏ పక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఎన్‌డీఏ పక్ష సమావేశానికి జనసేన పార్టీని కూడా ఆహ్వానించింది.


ప్రతిపక్షాల మొదటి సమావేశం జూన్‌ 23న బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ పట్నాలో ప్రతిపక్షాల మొదటి సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. సోమవారం (జులై 17న) జరిగే సమావేశంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే పాల్గొంటుండగా.. నితీశ్‌కుమార్‌ (జేడీయూ), మమతా బెనర్జీ (టీఎంసీ), ఎంకే.స్టాలిన్‌ (డీఎంకే), హేమంత్‌సోరెన్‌ (జేఎంఎం), ఉద్ధవ్‌ఠాక్రే (ఎస్‌ఎస్‌–యుబీటీ), శరద్‌పవార్‌ (ఎన్‌సీపీ), డి.రాజా(సీపీఐ), లాలూప్రసాద్‌ యాదవ్‌ (ఆర్‌జేడీ), అఖిలేశ్‌యాదవ్‌ (ఎస్‌పీ), సీతారాం ఏచూరి (సీపీఐఎం), ఒమర్‌ అబ్దుల్లా (ఎన్‌సీపీ), మెహబూబా ముఫ్తీ (పీడీపీ), దీపాంకర్‌ భట్టాచార్య (సీపీఐఎంఎల్‌) పాల్గొంటారు.

ALSO READ :గుంతల రోడ్లపై వరినాట్లు

ప్రతిపక్షాల భేటీకి హాజరైతం : ఆప్​

బెంగళూరులో జరిగే ప్రతిపక్షాల మీటింగ్‌‌‌‌కు హాజరవుతామని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. ఢిల్లీలో అధికారుల బదిలీలకు సంబంధించిన ఆర్డినెన్స్‌‌కు వ్యతిరేకంగా తాము చేస్తున్న పోరాటానికి మద్దతిస్తామని కాంగ్రెస్ చెప్పిన తర్వాత ఈ ప్రకటన చేసింది.  ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్‌‌‌‌ అర్వింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్‌‌ తర్వాత ఆ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా క్లారిటీ ఇచ్చారు. 

ఢిల్లీలో యంత్రాంగంపై పెత్తనం కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను పార్లమెంట్‌లో వ్యతిరేకిస్తామని కాంగ్రెస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్రంలోని బీజేపీ ప్రయత్నాలు సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని తెలిపింది. మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లును తిరస్కరిస్తామని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన ఆప్‌.. బెంగళూరులో జరిగే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి తాము కూడా హాజరవుతామని ఆ పార్టీ నేత రాఘవ్‌ చద్దా తెలిపారు. ఆదివారం జరిగిన ఆప్‌ పీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.