
సినీ సంగీత రంగంలో 25 యేళ్ళు పూర్తి చేసుకున్న ఏకైక మహిళా సంగీత దర్శకురాలు ఎంఎం శ్రీలేఖను ఆస్కార్ వరించింది. అవును మీరు చదువుతున్నది నిజమే. కానీ అధి అఫిషియల్ కాదు. ఓ ప్రముఖ రచయిత .. తాను ఇటీవల అందుకున్న ఆస్కార్ పురస్కారాన్ని గురు దక్షిణగా ఆమెకు అందించారు.
ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా ఎనలేని ఖ్యాతిని సంపాదించుకోవడమే కాకుండా.. మార్చి 12న అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ అవార్డ్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ ను అందుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఉత్తమ ఒరిజనల్ సాంగ్ కాటగిరీలో ఈ అవార్డు లభించింది. ఈ పాట రాసిన రచయిత చంద్రబోస్ ఆస్కార్ అవార్డును అందుకోవడం విశేషం. ఈ ఆనంద సమయంలో.. తాను ఈ స్థాయికి రావడానికి సహకారం అందించిన సింగర్ ఎంఎం శ్రీలేఖకు గురుదక్షిణగా ఆస్కార్ ఇచ్చేందుకు నిశ్చయించుకున్నారు. వెంటనే ఆమె ఇంటికి వెళ్లి ఆస్కార్ ను శ్రీలేఖకు అందజేశారు. ఇటీవలే ప్రపంచ యాత్ర మొదలుపెట్టిన శ్రీలేఖకి ఆస్కార్ రావడంతో సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు.
శ్రీలేఖకు ఆస్కార్ ను అందించిన చంద్రబోస్.. ఆమెకు గురుదక్షిణ అందజేసి, అభినందనలు తెలిపారు. ఆస్కార్ తనకే వచ్చినంత ఆనందంగా ఉందని, ఎస్ఎస్ రాజమౌళి అన్న సినిమా, కీరవాణి అన్న సంగీతం, తాను పరిచయం చేసిన చంద్రబోస్ సాహిత్యం ఆస్కార్ వేదిక మీద ఉన్నప్పుడు చెప్పలేనంత సంతోషం కలిగిందని శ్రీలేఖ ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆ ఆస్కార్ తన చేతికి అందడం మరింత ఆనందం కలిగిస్తోందని తెగ సంబరపడ్డారు. ఈ సందర్భంగా మంచు కొండల్లోన చంద్రమా అంటూ.. చంద్రబోస్ ప్రయాణం మొదలు పెట్టిన పాటను వారిద్దరూ పాడుతూ మరింత ఆకర్షణగా నిలిచారు. ఇది తనకు చాలా ప్రౌడ్ మూమెంట్ అని శ్రీలేఖ చెబుతూ సంతోషం వ్యక్తం చేశారు.