ఇరాన్లో కుప్పలు తెప్పలుగా శవాలు.. ఇజ్రాయెల్ మిస్సైల్స్ దాడిలో 60 మంది సజీవ దహనం

ఇరాన్లో కుప్పలు తెప్పలుగా శవాలు.. ఇజ్రాయెల్ మిస్సైల్స్ దాడిలో 60 మంది సజీవ దహనం

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆర్మీ క్యాంపులు, అణు స్థావరాలే టార్గెట్ గా మొదలైన వార్.. చివరికి సమాన్య ప్రజలను మట్టుబెట్టే వరకు వచ్చేసింది. ఆదివారం (జూన్ 15) రెండు దేశాలు మిస్సైల్స్ తో ఒకదానిపై మరొకటి దాడికి దిగాయి. తెల్లవారుఝామున ఇజ్రాయెల్ చేసిన అటాక్ లో ఇరాన్ తీవ్రంగా నష్టపోయింది. మిస్సైల్స్ ధాటికి ఏకంగా 60 మంది సాధారణ పౌరులు చనిపోయారు. 

టెహ్రాన్ పై జరిపిన ఈ దాడిలో న్యూక్లియర్ కేంద్రాలు, ఇరాన్ డిఫెన్స్ కేంద్రాలే లక్ష్యంగా దాడి చేసినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించాయి. డిఫెన్స్ మినిస్ట్రీ హెడ్ క్వార్టర్స్, SPND న్యూక్లియర్ కేంద్రంపై దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది.

టెహ్రాన్ లోని శహ్రాన్ ఆయిల్ రిఫైనరీ కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడితో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి కేంద్రం అయిన దక్షిణ పార్స్ కేంద్రం వద్ద ఉత్పత్తిని నిలిపివేసినట్లు తెలిపింది. దాడిలో రిఫైనరీ పూర్తిగా ధ్వంసం అయినట్లు ప్రకటన వెలువరించింది. 

ఇజ్రాయెల్ మిస్సైల్స్ టెహ్రాన్ లోని ఇళ్లపై పడటంతో దాదాపు 60 మంది చనిపోగా అందులో 29 మంది చిన్నారులు ఉన్నట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ మిస్సైల్స్ తో ఇజ్రాయెల్ దాడికి దిగింది. ఇరాన్ దాడిలో గెలీలి ప్రాంతంలో కొంతమంది ప్రజలు చనిపోయినట్లు ఇజ్రాయెల్ అత్యవసర సమావేశంలో వెల్లడించింది. గత రెండు రోజులుగా జరుగుతున్న దాడులలో ఇరాన్ లో మొత్తం 78 మంది చనిపోయినట్లు ఐక్యరాజ్య సమితి రాయభారి ప్రకటించారు. 

ఆపరేషన్ ‘రైజింగ్ లయన్’ పేరుతో యుద్ధం మొదలు పెట్టిన ఇజ్రాయెల్.. ఇరాన్ లోని మొత్తం 150 స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రకటించింది. మిలిటరీ క్యాంపులు, అణు ఉత్పత్తి కేంద్రాలు ఇందులో కీలకం. ఇరాన్ లో భారీ ఎత్తున వైమానిక దాడులు జరపాలని, అణ ఉత్పత్తి కేంద్రాలను ధ్వంసం చేయాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇప్పటికే ఆదేశించారు. ఈ దాడులలో ఇప్పటికే నటాన్జ్, ఇస్ఫహన్ స్థావరాలపై జరిపిన దాడుల్లో టాప్ మిలిటరీ కమాండర్లతో పాటు 9 మంది న్యూక్లియర్ సైంటిస్టులు హతమయ్యారు. 

ఇజ్రాయెల్ దాడులను ఇరాన్ తిప్పికొడుతోంది. ఇజ్రాయెల్ ను టార్గెట్ చేస్తూ 200 బాలిస్టిక్ మిస్సైల్స్, డ్రోన్స్ ను ప్రయోగించింది. అయితే అమెరికా డిఫెన్స్ సిస్టమ్ సహకారంతో చాలావరకు నిర్వీర్యం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయినప్పటికీ ఈ దాడిలో ముగ్గురు చనిపోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. 

ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేస్తున్న క్రమంలో అమెరికాతో జరపాల్సిన న్యూక్లియర్ చర్చలను ఆపేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఒకవైపు ఇజ్రాయెల్ అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించి దాడులు చేస్తుంటే.. చర్చలు జరపడంతో ప్రయోజనం ఏముందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాచి అన్నారు. ఒకవైపు అమెరికా ఇజ్రాయెల్ దాడులను సమర్థిస్తూ శాంతి చర్చలు అని చెప్పటం మీనింగ్ లెస్ అని ఇరాన్ అధికార ప్రతినిధి చెప్పారు.