ఎకానమీకి ప్యాకేజింగ్​ కీలకం .. డబ్ల్యూపీఓ గ్లోబల్​ అంబాసిడర్​ చక్రవర్తి

ఎకానమీకి ప్యాకేజింగ్​ కీలకం .. డబ్ల్యూపీఓ గ్లోబల్​ అంబాసిడర్​ చక్రవర్తి

హైదరాబాద్​, వెలుగు : ప్యాకేజింగ్ రంగంలో ఇన్నోవేషన్లపై సీఐఐ నిర్వహించిన ప్యాకాన్​ సందర్భంగా వరల్డ్​ ప్యాకేజింగ్​ ఆర్గనైజేషన్​ గ్లోబల్​ అంబాసిడర్, ఎకోబ్లిస్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​ సీఈఓ ఏవీపీఎస్​ చక్రవర్తి ‘వెలుగు’తో మాట్లాడారు. ఈ రంగానికి సంబంధించిన పలు విషయాలు చెప్పారు.  ఇవన్నీ ఆయన మాటల్లోనే. ప్యాకేజింగ్ అనేది దేశ ఆర్థిక వృద్ధిలో అంతర్భాగం. ఆర్థిక వ్యవస్థ వృద్ధికి సూచిక.  ప్రతి దేశ ప్రగతికి సంకేతం. టాబ్లెట్‌‌‌‌‌‌‌‌, టూత్ బ్రష్ , మస్కిటో కాయిల్ వంటి ప్రతి వస్తువుకూ నాణ్యమైన ప్యాకేజింగ్​ అవసరం. ఈ–కామర్స్​ వంటి కంపెనీలు భారీగా వృద్ధి సాధిస్తున్నాయి కాబట్టి ప్యాకేజింగ్​ ఇండస్ట్రీ కూడా దూసుకెళ్తోంది. ఏటా 14 శాతం వరకు గ్రోత్​ సాధిస్తోంది. 

చాలా రంగాల కంటే ఇది అధికంగా ఉపాధిని కల్పిస్తోంది. ఎందుకంటే ప్రతి వస్తువునూ ప్యాకేజీతో ఇవ్వాలి కాబట్టే ఎక్కువ మంది ఉద్యోగులు అవసరం.  ప్రపంచవ్యాప్తంగా తయారవుతున్న ఆహారంలో 40 శాతం వేస్ట్ అవుతున్నదని స్టడీలు చెబుతున్నాయి. వేస్టేజీని తగ్గించడానికి అన్ని కంపెనీలూ ప్యాకేజింగ్​కోసం లేటెస్ట్​ టెక్నాలజీలను వాడుతున్నాయి. పచ్చళ్లు, స్వీట్లు, బిర్యానీల వంటివి త్వరగా పాడవుతాయి. వీటిని ప్యాక్​ చేయడానికి లేటెస్ట్​టెక్నాలజీలను వాడటం వల్ల చాలా రోజులు నిల్వ ఉంటున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్​ నుంచి నిత్యం వందలాది బిర్యానీలు గల్ఫ్​దేశాలకు ప్రత్యేక ప్యాక్స్​లో వెళ్తాయి. పచ్చళ్లూ అమెరికా వంటి దేశాలకు వెళ్తున్నాయి. భారతదేశం వృద్ధి  ఆశాజనకంగా ఉంది. భారతదేశం కొన్ని విభాగాలలో 14 శాతం వృద్ధి సాధిస్తోంది.  ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా, ఈ– కామర్స్ వంటి రంగాల్లో రెండంకెల వృద్ధి ఉంది.    నాన్​వెజ్​ ఊరగాయలు/ తెలంగాణ సంప్రదాయ వంటలు కూడా విదేశాలకు వెళ్తున్నందున భారతదేశానికి ప్రయోజనం చేకూరుతుంది.  

ప్యాకేజింగ్ పరిశ్రమలో,  ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలో మహిళలు ఎంతో ఎదుగుతున్నారు.  మా రంగానికి ఫార్మా కీలకం.  వ్యాక్సిన్‌‌‌‌‌‌‌‌కి ప్రత్యేక ప్యాకేజింగ్ అవసరం. భవిష్యత్తులో ‘పర్సనలైజ్డ్​ మెడిసిన్స్​’ వస్తాయి. వీటికి స్పెషల్​ప్యాక్స్​ అవసరం.  ప్రపంచవ్యాప్తంగా ప్యాకేజింగ్ పరిశ్రమ సైజ్​ ట్రిలియన్ డాలర్లు ఉంది. భారతదేశం వాటా 70 నుండి 75 బిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. అసంఘటిత రంగంలోనూ పెద్ద ఎత్తున పరిశ్రమలు ఉన్నాయి.  తెలంగాణాలో ఫిల్మ్ మాన్యుఫాక్చరింగ్ కూడా మొదలైంది. ప్రతి ఒక్కరూ రీసైక్లింగ్,  వ్యర్థాల గురించి మాట్లాడతారు కానీ రేడియేషన్‌‌‌‌‌‌‌‌ను విడుదల చేసే ల్యాప్‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌లు, ఛార్జర్‌‌‌‌‌‌‌‌ల వంటి ఈ–వేస్ట్‌‌‌‌‌‌‌‌ సమస్యను పట్టించుకోవడం లేదు. మనదేశంలో ప్యాకేజింగ్ మెటీరియల్​ను పెద్ద ఎత్తున రీసైకిల్​ చేస్తున్నారు.  రీసైక్లింగ్ విషయంలో తెలంగాణ 
మొదటిస్థానంలో ఉంది.

ALSO READ: సోనియా సభ జరగకుండా మోదీ, కేసీఆర్‍ కుట్ర చేస్తున్రు : రేవంత్‍రెడ్డి 

ప్యాకాన్​ నిర్వహించిన సీఐఐ

 ప్యాకేజింగ్​ ఇన్నోవేషన్స్​ గురించి తెలియజేయడానికి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ‘ టీఎస్​ ప్యాకాన్​2023’ పేరుతో సెమినార్​ను నిర్వహించింది.  ఈ కార్యక్రమం మూడో ఎడిషన్‌‌‌‌‌‌‌‌ను ఐఏఎస్​ డాక్టర్ రజత్ కుమార్ ప్రారంభించారు. ప్రతి వ్యక్తి పర్యావరణానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పర్యావరణ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక్కటే ఏమీ చేయలేదని, అందరి సహకారం తప్పనిసరి అన్నారు. కాలుష్యం నియంత్రణకు చట్టాలు ఉన్నా అమలులో కొన్ని సమస్యలు ఉన్నాయని వివరించారు. మరో ఐఏఎస్​ వాణీ ప్రసాద్ మాట్లాడుతూ అన్ని కంపెనీలూ పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్​ టెక్నాలజీలను తీసుకురావాలని పిలుపునిచ్చారు. 

ప్యాకేజింగ్ మెటీరియల్‌‌‌‌‌‌‌‌లను తిరిగి ఉపయోగించుకునేలా చూడాలని అన్నారు.  సీఐఐ తెలంగాణ ఛైర్మన్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్యాకేజింగ్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. టెక్నాలజీలు,  సస్టెయినబిలిటీ కార్యక్రమాలు, వినియోగదారులకు అనువైన విధానాలను తీసుకురావడం వల్ల పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు.  ఈ సమావేశానికి ప్యాకేజింగ్ పరిశ్రమ నిపుణులు, పరిశోధకులు, డిజైనర్లు, విక్రయదారులు, పాలసీ మేకర్లు, కంపెనీల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.