తడబడ్డ పాక్..ఇంగ్లాండ్ టార్గెట్ 138 రన్స్

తడబడ్డ పాక్..ఇంగ్లాండ్ టార్గెట్ 138 రన్స్

టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్లో ఇంగ్లాండ్కు పాకిస్తాన్ 138 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ బ్యాట్స్మన్ అంచనాలకు తగ్గట్లు రాణించలేకపోయారు. ఆ జట్టు ఓపెనర్లు తక్కువ స్కోరుకే పెవీలియన్ చేరారు. మహ్మద్ రిజ్వాన్ 15 పరుగులే చేసి 29వ పరుగుల వద్ద సామ్ కర్రన్ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హారిస్ 8 పరుగులే చేసి వెనుదిరిగాడు. దీంతో పాక్ 45 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో కెప్టెన్ బాబర్ ఆజమ్, షాన్ మసూద్ జట్టును ఆదుకున్నారు. మూడో వికెట్ కు 40 పరుగులు జోడించారు. అయితే 32 పరుగులు చేసిన కెప్టెన్ ఆజమ్ ను రషీద్ బుట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన ఇఫ్తికర్ అహ్మద్ డకౌట్ అయ్యాడు. దీంతో పాక్ 85 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.  

షాన్ మసూద్ 38 పరుగులు, షాదాబ్ ఖాన్ 20 పరుగులు చేశారు. వీరిద్దరు ఔటైన తర్వాత..పాక్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరకు పాకిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 137 పరుగులే చేయగలిగింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కర్రన్ 3 వికెట్లు పడగొట్టాడు. అదిల్ రషీద్, క్రిస్ జోర్దాన్ చెరో రెండు వికెట్లు దక్కించుకున్నారు. స్టోక్స్ ఒక వికెట్ తీశాడు.