
పాకిస్తాన్ ఉగ్రవాద దాడుల విషయంలో అంతర్జాతీయంగా పలు దేశాల నుండి వస్తున్న ఒత్తిడిపై ఎట్టకేలకు పాక్ స్పందించింది. పాక్ లోని ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హెచ్చరిక జారీ చేశారు. ఉగ్రవాద సంస్థలు పాక్ భూభాగం నుండి దాడులు చేయడాన్ని తాము అనుమతించేది లేదని ఇమ్రాన్ ఖాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇండో పాక్ దేశాల మధ్య కాల్పులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా అమెరికా, బ్రిటన్ తోపాటు పలు దేశాలు పాక్ ఉగ్ర దాడులను నివారించాలని ఒత్తిడి తీసుకువచ్చాయి. పాక్ లోని పలు ఉగ్రవాద సంస్థలు కశ్మీర్ లో భారత భద్రతా బలగాలపై తరచూ దాడులకు పాల్పడుతున్నాయి. దీంతో పాక్ సర్కారు మిలిటెంట్లకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టింది. మిలిటెంట్లకు శిక్షణ ఇస్తున్న 182 స్కూళ్లను సీజ్ చేసి వాటిపై నిషేధం విధించింది. దీంతోపాటు పాక్ పోలీసులు 120 మంది మిలిటెంట్లను అదుపులోకి తీసుకున్నారు. పాక్ గతంలోనూ ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఇలాంటి చర్యలు తీసుకున్నా ఉగ్ర దాడులు మాత్రం ఆగలేదు. శాంతిని కోరుకుంటున్నామంటూ చెబుతున్న…పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పాక్ దేశంలో ఎలాంటి ఉగ్రవాద సంస్థల నిర్వహణను అనుమతించేది లేదని ప్రకటించారు.