రాని పనిలో వేలు పెట్టొద్దు : చంద్రయాన్-2పై పాక్ వక్రబుద్ధి

రాని పనిలో వేలు పెట్టొద్దు : చంద్రయాన్-2పై పాక్ వక్రబుద్ధి

పాకిస్తాన్ మరోసారి తన వక్రబుద్ధిని చూపించింది. భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రయాన్-2 ప్రయోగంపై పాక్ అక్కసు వెల్లగక్కింది. రాని పనిలో వేలు పెట్టి ఓడిపోయారంటూ పాక్ సైన్స్ శాఖ మంత్రి ఫవాద్ హుస్సేన్ ట్విట్టర్ వేదికగా వివాదాస్పద కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ కాగా.. దేశవ్యాప్తంగా ఫవాద్ పై దుమ్మెత్తి పోస్తున్నారు నెటిజన్లు.

‘రాని పనిలో వేలు పెట్టొద్దు.. డియర్‌ ఎండియా (Dear “Endia” )’ అని మన దేశాన్ని ఎగతాలి చేశారు. ఈ ట్వీట్‌ కు 8,800లకుపైగా కామెంట్లు వచ్చాయి. పలువురు భారత నెటిజన్లు ఫవాద్‌ తీరుపై సీరియస్ అయ్యారు . ‘చంద్రాయాన్‌-2లో కితకితలు పెట్టే అంశమేమిటంటే.. అది రాత్రంతా ఫవాద్‌ను మేల్కొనే చేసింది’ అని ఒక నెటిజన్‌ కామెంట్‌ చేశారు. పలువురు పాకిస్థానీ నెటిజన్లు కూడా ఫవాద్‌ తీరును తప్పుబట్టారు. భారత్‌ కనీసం ప్రయత్నమన్నా చేసిందని, అలాంటి ప్రయత్నాన్ని కించపరచడం పాకిస్థాన్‌ పేరును చెడగొట్టడమే అవుతుందని పలువురు నెటిజన్లు సూచించారు.

అయినా, ఫవాద్‌ ఏమాత్రం వెనుకకు తగ్గలేదు. ఆ తర్వాత కూడా ఇస్రోపై, భారత్‌ పై అక్కసు వెళ్లగక్కుతూ ట్వీట్లు పెట్టారు. చంద్రాయన్‌-2 వైఫల్యానికి తానే కారణమైనట్టు ఇండియన్‌ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారని, చంద్రాయన్‌ బొమ్మ మూన్‌ పైన కాకుండా ముంబైలో ల్యాండ్‌ అయిందని ఎద్దేవా వ్యాఖ్యలు చేశారు. మోడీ శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ మీద ప్రసంగాలు చేస్తున్నారని, ఆయన నిజానికి పొలిటిషియన్‌ కాకుండా ఆస్ట్రో నాట్‌ లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నిరుపేద దేశానికి చెందిన రూ. 900 కోట్లు వృథా చేయడంపై లోక్‌ సభలో మోడీని  ప్రతిపక్షాలు నిలదీయాలని రెచ్చగొట్టే కామెంట్స్ చేశారు ఫవాద్‌.

చంద్రయాన్-2 చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు సవ్యంగా సాగిన విక్రమ ల్యాండర్‌ పయనం.. అక్కడ కుదుపునకు లోనై.. ల్యాండర్‌ నుంచి ఇస్రో గ్రౌండ్‌ సెంటర్‌కు సిగ్నల్స్‌ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వరుస ట్వీట్లు చేశారు ఫవాద్‌.