
- క్లస్టర్ పరిధిలోకి మహబూబ్నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాల్టీలు
- విద్య, వైద్యం, ఉపాధి కల్పనకు అవకాశాలు
- శివారు ప్రాంతాల చుట్టూ గ్రీన్ బెల్ట్ ఏర్పాటుకు చర్యలు
మహబూబ్నగర్, వెలుగు:పాలమూరు క్లస్టర్కు అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు కేంద్ర సర్కారుకు రూ. వెయ్యి కోట్లతో ప్రపోజల్స్ పంపించారు. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాల్టీలు, పాలమూరు కార్పొరేషన్ను కలుపుకొని మహబూబ్నగర్ క్లస్టర్గా ఏర్పాటు కానుంది. క్లస్టర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద క్లస్టర్గా గుర్తించి, అర్బన్ చాలెంజ్ ఫండ్స్(యూసీఎఫ్)ను మంజూరు చేయాలని ఇటీవల ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి కేంద్ర హౌసింగ్, అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోహర్ లాల్ కట్టర్ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి రిపోర్టును అందజేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించగా.. త్వరలో యూసీఎఫ్ కింద నిధులు మంజూరయ్యే అవకాశాలున్నాయి.
కేంద్రానికి ప్రైమరీ రిపోర్ట్..
మహబూబ్నగర్ కార్పొరేషన్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాల్టీలను కలుపుతూ క్లస్టర్ ఏర్పాటుకు సంబంధించిన ప్రిలిమినరీ రిపోర్టు కేంద్రానికి పంపించారు. జాతీయ రహదారులు ఎక్కడి నుంచి ఎక్కడికి విస్తరించి ఉన్నాయి, నీటి వనరులు ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, రైల్వే లైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, మున్సిపల్ బౌండరీలు ఎంత వరకు ఉన్నాయి, జల మార్గాలు ఎక్కడెక్కడ ఉన్నాయనే దానిపై రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ రిపోర్టు అందజేసింది. వీటితో పాటు సాగు భూములు, బంజర్ భూములు, ఓపెన్ ల్యాండ్స్, వృక్ష సంపద వివరాలను మ్యాపుల ద్వారా వివరించారు.
రూ.978.48 కోట్లతో ప్రపోజల్స్..
క్లస్టర్లో అభివృద్ధి పనుల కోసం యూపీఎఫ్ కింద రూ.978.48 కోట్లు మంజూరు చేయాలని కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. నిధులు మంజూరైతే బస్ ర్యాపిడ్ ట్రాన్సిస్ట్ సిస్టం అమలు చేస్తారు. ఎలక్ట్రిక్ బస్సులు, ఈ- రిక్షాలు, క్లస్టర్ పరిధిలో చివరి కిలోమీటరు వరకు రవాణా వ్యవస్థను మెరుగుపరచనున్నారు. పట్టణాలు, నగరాల్లో సిటీ బస్సు సర్వీసు నెట్వర్క్ను అభివృద్ధి చేస్తారు. ఫ్యూచర్లో రైల్వేతో అనుసంధానం చేసే కార్యక్రమాలు చేపడతారు. దీంతో రవాణా వ్యవస్థ మెరుగు పడుతుంది.
రోడ్ల పక్కన సేఫ్టీ ఫుట్పాత్లు, సైకిల్ ట్రాక్లను నిర్మిస్తారు. రోడ్లకు ఇరు వైపులా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపడతారు. పట్టణాలు, నగరాల్లో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు ప్రతి మండలానికి రోడ్డు కనెక్టివిటీని మెరుగు పర్చడంతో పాటు ఆయా మండలాల నుంచి మరో మార్గం గుండా వాహనాలు వెళ్లేలా రోడ్లను డెవలప్ చేస్తారు. రద్దీగా ఉండే జంక్షన్లను విస్తరించడంతో పాటు ప్రతి జంక్షన్ వద్ద హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేస్తారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా సిగ్నల్స్ అందుబాటులోకి తెస్తారు.
అమృత్ 2.0 కింద తాగునీటి సంపులు, తాగునీటి పైపులైన్లు, పంప్ హౌస్, సిబ్బందికి క్వార్టర్స్, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేస్తారు. విద్య, వైద్యం, ఉపాధి, సంస్కృతికం, క్రీడలు, కమ్యూనిటీ సెంటర్లు, ఆడిటోరియాలు, హెల్త్ సెంటర్లు, లైబ్రరీలు, పార్కులు, నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. యువతకు స్వయం ఉపాధి కల్పించేలా స్టార్టప్ ఇంక్యుబేషన్ హబ్లను ఏర్పాటు చేస్తారు. క్రీడా మైదానాలు, ఫంక్షన్ హాల్స్ను నిర్మిస్తారు. గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేసి ఉద్యానవనాలు, తోటలు, అడవుల అభివృద్ధితో పర్యావరణాన్ని మెరుగు పరుస్తారు.
కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల సహకారంతో..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పాలూమరు క్లస్టర్ను ఏర్పాటు చేస్తాం. క్లస్టర్ ఏర్పాటైతే ఈ ప్రాంతం చాలా డెవలప్ అవుతుంది. క్లస్టర్లోని పాలమూరు, జడ్చర్ల, భూత్పూర్ ప్రాంతాల్లో విద్య, వైద్య సదుపాయాలు మెరుగుపడతాయి. కంపెనీలు రావడం వల్ల యువతకు ఉపాధి దొరుకుతుంది. గ్రామాల నుంచి మండలాలకు, మండలాల నుంచి పట్టణాలు, నగరానికి రోడ్ల కనెక్టివిటీ పెరిగి, రవాణా వ్యవస్థ మెరుగు పడుతుంది.- యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే, మహబూబ్నగర్
రోడ్డు నెట్వర్క్ కిలోమీటర్లలో..
మహబూబ్నగర్ : 797.67
భూత్పూర్ : 141.5
జడ్చర్ల 133.52
2011 లెక్కల ప్రకారం జనాభా..
మహబూబ్నగర్ : 2,17,143
భూత్పూర్ : 12,917
జడ్చర్ల : 52,128