అభివృద్ధి కోసం అంతా ఒక్కటై..పార్టీలకతీతంగా పని చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు

 అభివృద్ధి కోసం అంతా ఒక్కటై..పార్టీలకతీతంగా పని చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు
  • గత నెల ఒక బైపాస్​ మంజూరు, మరో బైపాస్​కు ప్రపోజల్
  • తాజాగా జడ్చర్లకు జవహర్​ నవోదయ విద్యాలయ

మహబూబ్​నగర్, వెలుగు:పొలిటికల్​ పార్టీల లీడర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరాలు ఉంటాయి. ఒకరు కౌంటర్​ ఇస్తే.. మరొకరు ఘాటు విమర్శలు చేస్తూ కౌంటర్​ అటాక్​కు దిగడం కామన్​గా చూస్తుంటాం. ఎంపీ ఒక పార్టీ, ఎమెల్యేలు మరో పార్టీ వారైతే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ డెవలప్​మెంట్​ను గాలికి వదిలేస్తారు.

కానీ, పాలమూరు ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్​ రెడ్డి, జనంపల్లి అనిరుధ్​ రెడ్డి కొత్త ట్రెండ్​కు బీజం వేస్తున్నారు. దశాబ్దాలుగా వెనుకబడిన జిల్లా అభివృద్ధికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. విద్య, వైద్యం, రవాణా, పట్టణ, నగర ఆధునీకరణ కోసం పని చేస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, రాష్ట్రం నుంచి రావాల్సిన అనుమతులపై దృష్టి పెడుతూ ఫ్రెండ్లీ పాలిటిక్స్​కు తెరలేపారు.

కలిసి వెళ్లి అనుమతులు సాధించుకొని..

మహబూబ్​నగర్​ పార్లమెంట్​లోని పాలమూరు, జడ్చర్ల నియోజవర్గాల్లో  డెవలప్​మెంట్​ పనుల కోసం ఎంపీ, ఎమ్మెల్యేలు ఏకతాటిపైకి వస్తున్నారు. ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్​ రెడ్డి తమ నియోజవర్గాల అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. ఆ తరువాత ఎంపీని కలిసి వాటిని అందజేసి, జిల్లాకు జరిగే ప్రయోజనం గురించి వివరిస్తున్నారు. ఎంపీ వాటిని పరిశీలించి సంబంధిత కేంద్ర మంత్రులకు పంపిస్తున్నారు. ఆ తరువాత ముగ్గురు కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అవుతున్నారు. డెవలప్​మెంట్​ పనులతో జరిగే ప్రయోజనాలను ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులకు వివరిస్తుండగా, ఎంపీ ఒత్తిడి తెస్తున్నారు.

పలు అభివృద్ధి పనులు మంజూరు..

నెలన్నర కింద పాలమూరుకు కేంద్రం నుంచి పలు అనుమతులు లభించాయి. ట్రాఫిక్​ సమస్యకు చెక్​ పెట్టే అప్పన్నపల్లి ఫ్లై ఓవర్​ నుంచి హన్వాడ మండలాన్ని కలుపుతూ వెళ్లే చించోలి హైవేకు లింక్​ చేయనున్నారు. ఈ ఫ్లై ఓవర్​ మంజూరు కోసం కొద్ది నెలల కింద కేంద్ర మంత్రి నితిన్​ గడ్కరీని ఎంపీ, పాలమూరు ఎమ్మెల్యే కలిశారు. గత నెల ఈ ఫ్లై ఓవర్​ను మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే ఎన్​హెచ్​-44, ఎన్​హెచ్​-167ను కలుపుతూ జడ్చర్ల మీదుగా బైపాస్​ కోసం ఎంపీతో కలిసి ఎమ్మెల్యేలు యెన్నం, అనిరుధ్​ రెడ్డి ఇటీవల గడ్కరినీ కలిశారు. పాలమూరు కార్పొరేషన్, జడ్చర్ల, భూత్పూర్​ను క్లస్టర్​గా ఏర్పాటు చేసేందుకు రూ.వెయ్యి కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ నిధులు మంజూరు కావాల్సి ఉంది. కృష్ణా–-వికారాబాద్​ రైల్వే కోసం సర్వే చేయాల్సి ఉండగా.. నిధులు రాకపోవడంతో పెండింగ్​లో పెట్టారు. కొద్ది రోజుల కింద ఎంపీ ఈ నిధులను మంజూరు చేయించడంతో సర్వే పనులు పూర్తయ్యాయి.

జడ్చర్లకు నవోదయ విద్యాలయ..

మూడు రోజుల కింద కేంద్ర ప్రభుత్వం జడ్చర్లకు జవహర్​ నవోదయ విద్యాలయాన్ని మంజూరు చేసింది. ఈ విద్యాలయాన్ని మహబూబ్​నగర్​లో ఏర్పాటు చేయాల్సి ఉండగా, స్థలం అందుబాటులో లేకపోవడంతో జడ్చర్ల నియోజకవర్గానికి కేటాయించారు. బాలానగర్​ మండలం పెద్దాయపల్లి వద్ద సర్వే నంబరు 40, 42లలో 20 ఎకరాల భూమిని కేటాయించారు.

ఈ అకడమిక్​ ఇయర్​ నుంచే క్లాసులు ప్రారంభించాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో మహబూబ్​నగర్​లోని పాత​డీఆర్డీవో ఆఫీస్​ కాంప్లెక్స్​లోని దుర్గాబాయ్​ మహిళా శిశు వికాస్​ కేంద్రంలో తాత్కాలికంగా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో పెద్దాయపల్లి వద్ద స్కూల్​ బిల్డింగ్  పనులు ప్రారంభించనున్నారు.

 

మరిన్ని వార్తలు