నీళ్లిడిస్తే ఏడికిపోవాలే? పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్​ నిర్వాసితుల గోస

నీళ్లిడిస్తే  ఏడికిపోవాలే? పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్​ నిర్వాసితుల గోస
  • కంటిమీద కునుకు ఉండట్లేదని ఆవేదన
  • నాలుగు గ్రామాలను వెంటాడుతున్న ముంపు భయం
  • మొండికేస్తే బలవంతంగానైనా తరలించాలని ఆదేశాలు
  • ఈనెల 31న డ్రైరన్​కు ఏర్పాట్లు స్పీడప్​

నాగర్​ కర్నూల్​, వెలుగు :  పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్​ నుంచి ఈనెల చివరి వరకు నీళ్లు ఇచ్చి తీరాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ముంపునకు గురయ్యే నాలుగు గ్రామాల ప్రజలకు కంటిపై  కునుకు లేకుండా పోతోంది. మొదటి ప్యాకేజీలోని నార్లాపూర్​ రిజర్వాయర్ నింపితే సున్నపుతండా, వడ్డెగుడిసెలు, అంజనగిరి, దూల్యానాయక్​తండా ముంపునకు గురవుతాయి. 200 ఇండ్లు రిజర్వాయర్​లో మునుగుతాయి.  ముంపునకు గురయ్యే గ్రామాల్లో కొందరి ఇండ్లకు పరిహారం అందింది. పునరావాసం కోసం స్థల సేకరణ చేయలేదు.  ఇంటి జాగ కేటాయించలేదు.  అల్టర్​నేట్​ స్థలం చూపించకుండా రిజర్వాయర్​లోకి నీళ్లు వదిలితే పిల్లాపాపలతో తట్టాబుట్ట సర్దుకుని ఎక్కడిపోయి బతకాలే అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీ ఎలక్షన్స్​కు ముందే నీళ్లిచ్చామని చెప్పుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న హడావిడితో ముంపు బాధితులు ఆందోళన చెందుతున్నారు. రాత్రికి రాత్రే ముంపు కుటుంబాలను బలవంతంగా తరలిస్తారనే వార్తలు వారిని మరింత కలవరానికి గురి చేస్తున్నాయి.  నిర్వాసితులకు ఆర్అండ్ఆర్​ అమలులో ఆలస్యమైతే  పోలీస్​ ఫోర్స్​తోనైనా ​రిజర్వాయర్​ మధ్య నుంచి ఖాళీ చేయించాలన్న ఆదేశాలు వచ్చాయని సమాచారం.

పరిహారం పేరుతో ఆగం చేసిన్రు.. 

నార్లాపూర్​ రిజర్వాయర్​లో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో అంజనగిరిలో 100 ఇండ్లు, దూల్యా నాయక్​ తండాలో 80 ఇండ్లు,  వడ్డె గుడిసెల కాలనీలో 25 ఇండ్లు, సున్నపుతండాలో 50 ఇండ్లు ఉన్నాయి.   నార్లాపూర్​ వద్ద పాలమూరు కట్ట నిర్మాణం కోసం తవ్విన మట్టిని పోయడానికి 2018లో ఎకరాకు రూ.5.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా 33 ఎకరాలకు నోటిఫికేషన్​ ఇచ్చారు.  బాధిత  రైతులు మాత్రం తమకు రూ.1.70లక్షల చొప్పున  చెల్లించారని వాపోతున్నారు.  ఈ స్థలంలో ముంపునకు గురవుతున్న అంజనగిరి, వడ్డె గుడిసెలు, బోడబండ తండా,  సున్నపుతండా వాసులకు పునరావాసం కింద ఆర్అండ్ఆర్​ కాలనీ నిర్మించి ఇండ్లు కట్టించడానికి  చేసిన ప్రయత్నాలను బాధిత నిర్వాసితులు అంగీకరించలేదు. 

గతంలో ఎకరాకు  రూ.1.70లక్షల పరిహారం ఇచ్చి తమను ఆగం చేశారని,  ఏ సౌలతుల్లేని అడవి మధ్య ఉండలేమని, కొల్లాపూర్​ ఈదమ్మ గుడి దగ్గరలో ఇండ్లు కట్టించి ఇవ్వాలన్న  నిర్వాసితుల డిమాండ్​ను  పక్కకు పడేశారు. ఇప్పుడు ఎక్కడ స్థలం చూపించకుండా అర్ధంతరంగా వెళ్లిపోమంటే ఎక్కడిపోయి బతకాలని వాపోతున్నారు. అంజనగిరికి చెందిన కొన్ని కుటుంబాలు ఎల్లూరు రిజర్వాయర్​ దగ్గరలోని పటేల్​ కంపెనీకి చెందిన స్థలంలో ఇండ్లు కట్టుకున్నారు.

వేగంగా పనులు..

పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్ట్​లోని మొదటి మూడు ప్యాకేజీల కింద అంజనగిరి రిజర్వాయర్, సర్జ్​పూల్​, పంప్​హౌజ్​,  ఓపెన్​ కెనాల్​ పనులు జరుగుతున్నాయి.  ప్రభుత్వం విధించిన ఆగస్టు చివరి గడువులోగా కనీసం ఒకటి లేదా రెండు పంపులను స్టార్ట్​ చేసేందుకు కాంట్రాక్ట్​ ఏజెన్సీలు వేగంగా పనులు చేస్తున్నాయి. 400 కేవీ సబ్​ స్టేషన్, రిజర్వాయర్, ఓపెన్​ మెయిన్​ కెనాల్, హెడ్​ రెగ్యులేటర్​ పనులు పెండింగ్​లో ఉన్నా నీళ్లు బయటకు దుంకించాలనే పట్టుదలతో ఉన్నారు.  ప్రాజెక్టులోని ఫస్ట్​ లిఫ్ట్​ నార్లాపూర్​లో కనీసం గంట సేపైనా ఒక పంప్​ నడిపించేందుకు ఇంజినీర్లు, కాంట్రాక్టర్లు కుస్తీ పడ్తున్నారు. మే 6న నార్లాపూర్​కు వచ్చిన సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్​ వర్క్​ కంప్లీట్​ చేయాలని ఏజెన్సీలకు  టార్గెట్​ ఫిక్స్​ చేశారు.

31న డ్రైరన్​..

ఈనెల 21న నార్లాపూర్​ విజిట్​కు వచ్చిన స్మితా సబర్వాల్​ పాలమూరు స్కీంలో ఫస్ట్​ పంపును ఈ నెల 31న డ్రై రన్ నిర్వహించి, సెప్టెంబర్ 15వరకు రెండో  పంపు డ్రై రన్  నిర్వహించాలని ఆదేశించారు. డ్రై రన్​ పూర్తయ్యే మొదటి పంపు ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతో తాము రిజర్వాయర్​లో మునిగి చావడానికైనా సిద్ధంగా ఉన్నామని  నిర్వాసితులు తెగేసి చెప్తున్నారు. వడ్డె గుడిసెల్లో 50 ఇండ్లు ఉంటే 7 ఇండ్లకు మాత్రమే రూ.12.50 లక్షల పరిహారం చెల్లించారు. ఎన్యుమరేషన్​ పూర్తిచేసి మిగిలిన ఇండ్లకు ఇస్తామని ఇంతవరకు ఇటువైపు రాలేదని వాపోతున్నారు. నిర్వాసితుల గోడుపై  రెవెన్యూ, ఇరిగేషన్​ ఆఫీసర్లు నోరు విప్పడం లేదు.

ఉన్న భూమి పోయింది..

ఉన్న ఎకరా భూమి పోయింది. ఓట్లప్పుడు ఎన్నో మాటలు చెప్పిన్రు. .ఇప్పుడు అడిగితే కసురుకుంటున్నరు. మా పరిస్థితిని పట్టించుకునేవారే లేరు..  మమ్మల్ని చంపితే సర్కార్​కు మా బాధ ఉండదు. 
- మహేశ్వరి, వడ్డె గుడిసెలు 

బతకడానికి పట్నం పోతున్నరు

మా భూముల్ల వడ్లు, పల్లీలు పండించి బతికినం. ఇప్పుడు ఉప్పు, పప్పు పుడ్తలేదు. 8 ఏండ్ల నుంచి మాది ఇదే కష్టం. బతకడానికి పిల్లలు పట్నం పోయిండ్రు. నీళ్లు వస్తే అందరం మునిగి సస్తం.           

‌‌‌‌ - బుజ్జి, దూల్యానాయక్​ తండా