- ప్రత్యర్థుల సోషల్ మీడియా అకౌంట్స్లోకి లీడర్ల చొరబాటు
- ఫిషింగ్ మెసేజ్లతో హ్యాకింగ్.. ఫేక్ కంటెంట్ పోస్ట్
- గెలుపు ఓటములను ప్రభావితం చేసేలా కల్పిత కథనాలు
- ప్రత్యేకంగా ‘అఫెన్సివ్ గ్రూప్స్’ ఏర్పాటు.. కోట్లకు కోట్లు ఖర్చు
హైదరాబాద్, వెలుగు: ఎన్నికల్లో ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు పార్టీలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నాయి. ఫీల్డ్లోనే కాదు.. ఆన్లైన్ వేదికగా దాడులకు దిగుతున్నాయి. ఎదుటి పార్టీ ప్రతిష్టను, ఎదుటి లీడర్ క్యారెక్టర్ను దెబ్బతీసేందుకు సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టి ట్రోల్ చేస్తున్నాయి. ఏకంగా ప్రత్యర్థుల ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా అకౌంట్లను హ్యాక్ చేసి, ఆ అకౌంట్లలోనే ఫేక్ కంటెంట్ను, కల్పిత సర్వేలను పోస్టు చేస్తున్నాయి. జనం నమ్మేలా ఈ పోస్టులకు స్పెషల్ ఎఫెక్ట్స్ ఇస్తున్నాయి.
ఇట్ల రాష్ట్రంలో పలువురు లీడర్లు సైబర్ దాడుల బారినపడ్డారు. కొందరు నేతలు పోలీసులకు ఫిర్యాదులు కూడా చేసినట్లు తెలిసింది. సోషల్ మీడియా ద్వారా ప్రత్యర్థులను దెబ్బతీసేందుకు కొన్ని పార్టీలు ప్రత్యేకంగా ‘అఫెన్సివ్ గ్రూప్’లను ఏర్పాటు చేసుకున్నాయి. ఇందు కోసం ఆ గ్రూప్స్కు కోట్లకు కోట్లు చెల్లిస్తున్నాయి.
మొదట ఫిషింగ్ మెసేజ్లు పంపి..
ప్రత్యర్థి సోషల్ మీడియా అకౌంట్ను హ్యాక్ చేసేందుకు మొదట ఫిషింగ్ మెసేజ్లు పంపుతా రు. ఆ మెసేజ్లో ఏముందో తెలుసుకునేందుకు ప్రత్యర్థి ఓపెన్ చేస్తే.. ఆ వెంటనే ఆ వ్యక్తి సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్ అవుతుంది. దీంతో వ్యక్తిగత, సున్నిత వివరాలన్నీ ఎదుటివాళ్ల చేతుల్లోకి వెళ్తాయి. ఇట్ల ప్రత్యర్థుల సోషల్ మీడియా అకౌంట్లలోకి చొరబడి, ఆ అకౌంట్లలోనే తప్పుడు పోస్టులు పెట్టడం కొన్నిరోజులుగా రాష్ట్రంలో సాగుతున్నది.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఈ బెడద పెరగడంతో బాధిత నేతలు బుగులు పడ్తున్నారు. తమ గురించి తమ సోషల్ మీడియా అకౌంట్లలోనే చెడుగా ప్రజల్లోకి వెళ్తే గెలుపోటములపై ప్రభావం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. దీని నుంచి తప్పించుకునేందుకు కొందరు నేతలు సైబర్ నిపుణులను సంప్రదిస్తున్నారు.
ఒక్క అకౌంట్ హ్యాకింగ్కు రూ.3 లక్షలు
ప్రత్యర్థికి చెందిన ఏదైనా ఒక సోషల్ మీడియా అకౌంట్ను (ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా వంటి వాటిలో ఏదో ఒకటి) హ్యాక్ చేసేందుకు హ్యాకర్లకు రూ.2 లక్షల నుంచి 3లక్షల దాకా లీడర్లు చెల్లిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతున్నది. పనిని బట్టి అంతకన్నా ఎక్కువ మొత్తమూ చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. హ్యాకర్ల ద్వారా ప్రత్యర్థి అకౌంట్లోకి చొరబడి.. ఆ తర్వాత ఆ అకౌంట్లో ఫేక్ కంటెంట్ను పోస్ట్ చేసే పనిని తమ సోషల్ మీడియా వింగ్కు లీడర్లు అప్పగిస్తున్నారు.
కొందరు లీడర్లు సొంతంగానే ఈ తరహా అఫెన్సివ్ గ్రూపులను నియమించుకున్నట్టు తెలుస్తున్నది. ఇది ఒక యాంగిల్ అయితే.. ఇలాంటి ఎటాక్లు జరిగినప్పుడు వాటిని వెంటనే తిప్పికొట్టే సెటప్లనూ కొన్ని పార్టీలు ఏర్పాటు చేసున్నట్లు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో లీడర్లపై ఈ తరహా సైబర్ ఎటాక్స్ జరగడం మొదటిసారని తెలుస్తున్నది. తమ సోషల్ మీడియాలో నిత్యం తప్పుడు పోస్టులు వస్తుండటంతో అసలేం జరుగుతున్నదో అర్థంకాక కొందరు లీడర్లు.. సైబర్ ఎక్స్పర్ట్స్ను కలుస్తున్నారు. అప్పుడుగానీ వాళ్లకు హ్యాకింగ్ విషయం బోధపడటం లేదు. ఈ అటాక్స్ ఎవరు చేశారో.. ఎక్కడి నుంచి చేశారో.. అనేది తెలియనంతా పకడ్బందీగా హ్యాకింగ్ దాడులు జరుగుతున్నాయి.
ఏం చేస్తదీ గ్రూప్
మామూలుగా అయితే సోషల్ మీడియాలో సొంత పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలపై క్యాంపెయిన్ చేయడంతో పాటు.. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేయడం, కౌంటర్లు ఇవ్వడం కోసం లీడర్లు సొంతంగా సోషల్ మీడియా వింగ్స్ను ఏర్పాటు చేసుకుంటాయి. కొన్ని రాజకీయ పార్టీలైతే కార్పొరేట్ స్థాయిలో ఆఫీసులను తీసుకొని వీటి కోసం స్పెషల్ వార్ రూమ్లను ఏర్పాటు చేశాయి.
అందులో పనిచేసేవాళ్లకు లక్షల్లో జీతాలు చెల్లిస్తున్నాయి. అయితే.. ఈ మధ్య ప్రత్యర్థిని దెబ్బతీయడమే లక్ష్యంగా అఫెన్సివ్ గ్రూప్స్ను కూడా లీడర్లు, పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ గ్రూప్స్లోని సభ్యులు తమ పార్టీకి, వ్యక్తికి ప్రచారం చేయడంతోపాటు.. ప్రత్యేకంగా ప్రత్యర్థి పార్టీల అకౌంట్ల మీద కన్నేసి ఉంచుతాయి. ప్రత్యర్థులకు ఫిషింగ్ మెసేజ్లు పంపి వారి అకౌంట్లలోకి చొరబడతాయి. ఆ తర్వాత వారిపై నిఘా పెడ్తాయి. ప్రత్యర్థి ఏం చేస్తున్నది అనునిత్యం ఫాలో అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో హనీ ట్రాప్నూ విసురుతుంటాయి.
ఆ లీడర్లపై ఫేక్ కంటెంట్ను తయారు చేసి, వారి అకౌంట్లలోనే పోస్ట్ చేస్తుంటాయి. వారి ప్రతిష్ఠను దెబ్బ తీసేలా కామెంట్లు, పోస్టులు పెడుతుంటాయి. వారికి నష్టం కలిగించే వైరల్ వీడియోలు, కంటెంట్ను వదులుతుంటాయి. అంతేకాదు.. ఇద్దరు లీడర్లు మాట్లాడుకున్నట్టో, లేదా ఊర్లో జనాలు మాట్లాడుకున్నట్టో కొన్ని ఫేక్ కాల్స్ను క్రియేట్ చేసి పోస్ట్ చేస్తుంటాయి. దాంతోపాటు.. ఫేక్ సర్వే రిపోర్టులనూ అఫెన్సివ్ గ్రూప్లు వదులుతుంటాయి. తద్వారా జనాల్లో ఓ రకమైన అభిప్రాయం క్రియేట్ అయ్యేలా చేస్తాయి.