- పలు చోట్ల పాత వాళ్లకు వ్యతిరేకంగా కార్యక్రమాలు
- నియోజకవర్గాల్లో జోరుగా పర్యటనలు..
- ఫౌండేషన్ల పేరిట సేవలు
నల్గొండ, వెలుగు : ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్లో కొత్త నాయకత్వం తెరపైకి వస్తోంది. హైకమాండ్ అవకాశం ఇస్తే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు లీడర్లు ఇంట్రస్ట్ చూపుతున్నారు. పలు చోట్ల పాత వాళ్లకు పోటీగా కొత్త లీడర్లు పుట్టుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఆరేడు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. జనరల్ సీట్లతో పాటు, ఎస్సీ, ఎస్టీ నియోజక వర్గాల్లోనూ లీడర్లు పోటీకి సై అంటున్నారు. ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. పార్టీ కార్యక్రమాలతో ప్రజలను ఆకట్టుకోవడమే గాక, తమ సొంత ఇమేజ్ను పెంచుకునేందుకు ఫౌండేషన్ల పేరిట సేవలు అందిస్తున్నారు. తమ ఉనికి కోసం రూలింగ్ పార్టీ లీడర్లకు దీటుగా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ఇన్చార్జులు లేక ఖాళీగా కనిపించిన నియోజకవర్గాల్లో ప్రస్తుతం నేతల రాకతో సందడి నెలకొంది. పార్టీ పిలుపు మేరకు నియోజకవర్గాల్లో జరుగుతున్న రచ్చబండ కార్యక్రమాల్లో కొత్త, పాత తరం నేతలు పాల్గొంటుండడంతో కేడర్లో జోష్ మొదలైంది.
ఏడు నియోకజకవర్గాల్లో హాట్హాట్
ఉమ్మడి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పాలిటిక్స్ హాట్హాట్గా మారాయి. పలు చోట్ల సీనియర్లతో సయోధ్య కుదరనప్పటికీ హైకమాండ్పై నమ్మకంతో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. సూర్యాపేట, తుంగతుర్తి, ఆలేరు, నకిరేకల్, దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో కొత్త తరం నేతల హడావుడి కనిపిస్తోంది. పాత వాళ్లకు బదులు ఈ సారి తమకే అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే క్లియర్ వేకెన్సీలు ఉన్న చోట తమకు సీటు ఖాయమని కొత్త లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, సీనియర్ల ఉన్న చోట టెన్షన్ పడుతున్నారు. దీనికోసం పైస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు జిల్లా అగ్రనేతల్లోనే ఓ వర్గంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు.
పాత లీడర్లు వర్సెస్ కొత్త లీడర్లు
సూర్యాపేటలో ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో పటేల్ రమేశ్రెడ్డి ఉన్నారు. రేవంత్రెడ్డి అనుచరుడిగా ముద్రపడ్డ ఈయన ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయన్నది వేచి చూడాలి. రేవంత్తో పాటే కాంగ్రెస్లో చేరిన ఈయనకు సీనియర్ లీడర్ దామోదర్రెడ్డి నుంచి గట్టి పోటీ ఉంది. తుంగతుర్తిలో అద్దంకి దయాకర్తో పాటు కొత్తగా వడ్డేపల్లి రవి పేరు వినిపిస్తోంది. దామోదర్రెడ్డి సపోర్ట్తో రవి త్వరలో కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలో నేనావత్ కిషన్నాయక్ తెరపైకి వచ్చారు. లాస్ట్ టైం ఎన్నికల్లోనే టికెట్ ఆశించారు. మాజీ ఎమ్మెల్యే బాలునాయక్కు టికెట్ ఇవ్వడంతో ఆయనకు చాన్స్ మిస్సైంది. ఆయన ప్రస్తుతం పార్టీ నేషనల్ ఎస్టీ కోఆర్డినేటర్గా, కర్నాట్పల్లి ఎంపీటీసీగా కొనసాగుతుండగా, ఆయన భార్య ప్రవళ్లిక యువజన కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా, మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు.
హైకమాండ్పైనే భారం
యాదాద్రి జిల్లా ఆలేరులో మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్ ప్లేస్ను బీర్ల అయిలయ్య రీప్లేస్ చేశారు. యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ సర్పంచ్గా, మండల అధ్యక్షుడిగా పనిచేసిన ఈయన 2019 ఎంపీ ఎన్నికల నుంచి ఆలేరు ఇన్చార్జ్గా ఉన్నారు. బీర్ల ఫౌండేషన్ పేరుతో నియోజకవర్గ ప్రజలకు సేవలందిస్తున్నారు. ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా బీసీలకే దక్కుతోంది. కాబట్టి కుర్మ సామాజికవర్గానికి చెందిన అయిలయ్య ఆలేరుపై ఆశ పెట్టుకున్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో పీసీసీ కార్యదర్శి కొండేటి మల్లయ్య రేసులో ఉండగా, కొత్తగా రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన భూపతిగళ్ల మహిపాల్ పేరు తెరపైకి వచ్చింది. మిర్యాలగూడలో ఎమ్మెల్యే భాస్కర్రావు పార్టీ మారాక బత్తుల లక్ష్మారెడ్డి కీలకంగా మారారు. బీఎల్ఆర్ ఫౌండేషన్ పేరుతో సేవలందిస్తున్న ఆయన గత మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేశారు. గత ఎన్నికల్లోనే టికెట్ ఆశించారు. కానీ హైకమాండ్ బీసీ నేత ఆర్.కృష్ణయ్యకు అవకాశం ఇచ్చింది. ఈసారి బీఎల్ఆర్ మిర్యాలగూడ టికెట్ కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
కీలకం కానున్న జానారెడ్డి సన్స్
కాంగ్రెస్ సీనియర్ నేత కె.జానారెడ్డి కుమారులు వచ్చే ఎన్నికల్లో కీలకంగా మారనున్నారు. రఘువీర్రెడ్డి, జయవీర్రెడ్డి మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలపైన ఫోకస్ పెట్టారు. జయవీర్రెడ్డి సాగర్లోనే మకాం పెట్టి కేజేఆర్ ఫౌండేషన్ పేరుతో అందుబాటులో ఉంటూ పార్టీ ప్రోగ్రామ్స్లో పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో జానారెడ్డి నిర్ణయం మేరకు ఈ రెండు చోట్ల సీట్ల సర్దుబాటు జరుగుతుందని పార్టీ సీనియర్లు చెపుతున్నారు. '
కోమటిరెడ్డి కోటరీలో కొత్త టీమ్
వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ట్రై చేస్తున్న లీడర్లలో కొందరు ముఖ్యులు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోటరీలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. బత్తుల లక్ష్మారెడ్డి, బీర్ల అయిలయ్య, పటేల్ రమేశ్రెడ్డి, మహిపాల్, కిషన్నాయక్ వంటి లీడర్లు కోమటిరెడ్డి వర్గంగానే పనిచేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సోమవారం కోమటిరెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పటేల్ రమేశ్రెడ్డి, బీర్ల అయిలయ్య ప్రతక్ష్యం కావడం పార్టీ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇక బత్తుల లక్ష్మారెడ్డి తన ఫౌండేషన్ తరఫున కోమటిరెడ్డి బొమ్మతో పెద్ద పోస్టరే రీలీజ్ చేశారు. వీళ్లలో కొందరికి పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఆశీస్సులు కూడా ఉన్నాయని పార్టీ సీనియర్ లీడర్
ఒకరు చెప్పారు.