గ్రామాల్లో విచ్చలవిడి బెల్టు షాపులు

గ్రామాల్లో విచ్చలవిడి బెల్టు షాపులు

పల్లెలు, పట్టణాలనే తేడా లేకుండా మద్యం ఏరులై పారుతున్నా అటువైపు కన్నెత్తి చూడకుండా  ఎక్సైజ్అధికారులు వ్యవవహరిస్తున్నారని ప్రజలంటున్నారు. అన్ని జిల్లాలలో బెల్టు షాపుల దందా కిరాణా దుకాణం  నుంచి మొదలుకొని నివాస గృహాలు, పాన్​ షాపుల వరకు మద్యం అమ్మకాల జోరు సాగుతూనే ఉంది. తెల్లవారు జామునే మద్యం అందిస్తూ బెల్టు దందాను మూడు  ఆరు పూలుగా సాగుతున్నది. గుడుంబా విక్రయాలు మానేసిన వారికి ప్రభుత్వం ఓవై పు స్వయం ఉపాధి మార్గాలతో జీవనోపాధి కల్పిస్తుంటే, మ రో వైపు బెల్టు దుకాణాలు ప్రజలను మత్తులో ముంచుతున్నాయి.  రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల బెల్టు షాపు లు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది.

కొందరైతే వాహనాలను ఉదయం సమయంలో తీసుకువచ్చి అడ్డాకూలీలకు, ఇసు క ట్రాక్టర్ల మీద వెళ్లే కూలీలకు అమ్మకాలు  జరుపుతున్నారు. అన్ని జిల్లాలలో ఈ దందా సంగతి తెలిసినా సంబంధిత శాఖ అధికారులు నిమ్మకు నిరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కొందరు సిబ్బందికి ముడుపులు అందుతుండడంతో ఏదైనా ఫిర్యాదురాగానే బెల్టు షాపుల నిర్వాహకులకు సమాచారం అందించి తనిఖీల విషయాలను చేరవేస్తున్నారు. దీంతో అప్రమత్తం అవుతున్న బెల్టు షాపుల వారు తనిఖీలలో ఏమీ దొరకకుండా జాగ్రత్త పడుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. యువత మాత్రం నిత్యం దీనికి  బానిస ఆయి ఒళ్లు గుల్ల చేసుకుని భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటున్నది. ఇకనైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు దృష్టి సారించాలి.బె ల్ట్ షాప్ నిర్వాహకుల మీద ఉక్కు పాదం మోపాలి.

- కామిడి సతీష్ రెడ్డి,జడలపేట, జయశంకర్ భూపాలపల్లి జిల్లా