- ఎమెర్జెన్సీగా అవసరమవుతాయని.. పొదుపుపై ఫోకస్!
- బ్యాంకుల్లో పెరిగిన డిపాజిట్లు
- పబ్లిక్ వద్ద 16 శాతం పెరిగిన క్యాష్
- రూరల్, అర్బన్ ప్రాంతాల్లో తగ్గిన వినియోగం
బిజినెస్డెస్క్ వెలుగు: ప్రజలు ఖర్చులు తగ్గించేశారు. ఎమెర్జెన్సీ ఉంటుందేమోననే ఆలోచనతో తమ క్యాష్ నిల్వలను పెంచుకుంటున్నారు. బ్యాంకుల్లో డిపాజిట్లు పెరుగుతున్నాయి. కిందటేడాది మార్చి నుంచి ఈ ఏడాది ఏప్రిల్ మధ్య కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. పబ్లిక్ దగ్గరున్న కరెన్సీ విలువ 16 శాతం పెరిగి రూ. 4 లక్షల కోట్లకు చేరుకుంది. ఇంతలా ప్రజల దగ్గర క్యాష్ ఉండడం ఇదే మొదటి సారి. ఇదే టైమ్లో బ్యాంకుల్లో డిపాజిట్లు రూ. 20 లక్షల కోట్లు పెరిగాయి. కరోనా కేసులు పెరుగుతుండడంతో అత్యవసరంగా డబ్బులు అవసరం ఉంటాయనే ఆలోచనలో కన్జూమర్లు ఉన్నారని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. తమ ఖర్చులను తగ్గించుకొని, పొదుపు చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా హెల్త్కు సంబంధించిన ఖర్చుల కోసం డబ్బులు కేటాయిస్తున్నారని అభిప్రాయపడ్డారు. కిందటేడాది మార్చి నుంచే కన్జూమర్లు అనవసర ఖర్చులను తగ్గించేశారని, ఎసెన్షియల్ ప్రొడక్ట్లను మాత్రమే కొనడానికి ఇష్టపడుతున్నారని గోద్రేజ్ అప్లియెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది పేర్కొన్నారు. ‘డబ్బులు పొదుపు చేయాలనే ఆలోచనలో కన్జూమర్లు ఉన్నారు. ఒక్కసారి కరోనా కేసులు తగ్గుముఖం పడితే ప్రజలు తమ ఖర్చులు పెంచుతారు’ అని చెప్పారు.
హెల్త్ ముఖ్యం..
బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థల్లో డిపాజిట్లు పెరుగుతున్నాయి. ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ల నుంచి విత్డ్రాలు పెరిగాయని, డిపాజిట్లు పెరగడానికి ఇదొక కారణమని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడం లేదని, తమ ఇన్వెస్ట్మెంట్లను తీసుకొచ్చి ఫైనాన్షియల్ సంస్థల్లో డిపాజిట్ చేస్తున్నారని పేర్కొన్నారు. హెల్త్, వెల్నెస్పై కన్జూమర్లు ఎక్కువగా ఫోకస్ పెట్టారని మింటెల్ రిపోర్ట్స్ ఇండియా కంటెంట్ హెడ్ నిధి సిన్హా తెలిపారు. ‘46 % మంది కన్జూమర్లు హెల్త్ కేర్పై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. హెల్త్కేర్పై ఖర్చులు పెంచితే ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ ఉంటుందని 70 % మంది కన్జూమర్లు భావిస్తున్నారు. 51 % మంది కన్జూమర్లు ఎసెన్షియల్స్ కోసం ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ను వెతుకుతున్నారు. 52 % మంది కన్జూమర్లు హెల్తీ ఫుడ్స్పై డిస్కౌంట్స్ కోసం చూస్తున్నారు. దీన్ని బట్టి హెల్త్కు కన్జూమర్లు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారని తెలుస్తోంది’ అని తెలిపారు. డబ్బులు తక్కువగా ఉన్నవాళ్లు ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో అనవసర ఖర్చులను చేయలేకపోతున్నారు. డబ్బులున్నవాళ్లు నెగెటివ్ సెంటిమెంట్ వలన ఖర్చులు తగ్గించేశారు.
కొనుగోళ్లు పడిపోయాయి..
రూరల్, అర్బన్ ప్రాంతాలలో ప్రజల ఖర్చులు తగ్గి, సేవింగ్స్ పెరుగుతున్నాయి. సాధారణంగా తన దగ్గర ఆరు నెలలకు సరిపడే క్యాష్ ఉంటుందని, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో దీనికి ఐదు రెట్లు క్యాష్ను మెయింటైన్ చేస్తున్నానని ఆటోమోటివ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ కంపెనీ జాటో డైనమిక్స్ ప్రెసిడెంట్ రవి భాటియా అన్నారు. అత్యవసరం కాని ప్రొడక్ట్ల కొనుగోళ్లు లాక్డౌన్తో తగ్గాయని మారుతి సుజుకీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. రిస్ట్రిక్షన్లు తొలగిపోతే ఈ ప్రొడక్ట్లకు డిమాండ్ పెరుగుతుందని అంచనావేశారు. కరోనా సెకండ్ వేవ్ తగ్గితే ఆటో సెక్టార్లో పెంటప్ డిమాండ్ను చూస్తామని చెప్పారు. ప్రజలు సొంత వెహికల్పై ఎక్కువ దృష్టిపెడతారని, దీంతో కార్లకు డిమాండ్ క్రియేట్ అవుతుందని పేర్కొన్నారు. కిందటి నెలలో రూరల్ ఏరియాలలో కంపెనీ సేల్స్ తగ్గాయని చెప్పారు. రిటైల్ స్టోర్లు క్లోజవ్వడంతో ఏప్రిల్ చివరి రెండు వారాల్లో అమ్మకాలు పడిపోయాయని అన్నారు. కరోనా సంక్షోభం వలన క్యాష్ను నిల్వ చేసుకోవాలనే ఆలోచనలో రూరల్ ఏరియాల్లోని కన్జూమర్లు ఉన్నారు. కొనుగోళ్లు తగ్గిపోవడంతో డీలర్షిప్లు పనిచేయడం లేదని మహీంద్రా ఫైనాన్స్ ఎండీ రమేష్ అయ్యర్ అన్నారు. ఆగస్ట్ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఖర్చులు పెరగొచ్చని అభిప్రాయపడ్డారు.