- స్పామ్ కాల్స్కు పర్మిషన్ తప్పనిసరి చేయాలె
- యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ తేవాలె
- టెల్కోలకు సూచించిన ట్రాయ్
న్యూఢిల్లీ: కస్టమర్లను విసుగెత్తించే ప్రమోషనల్, స్పామ్ కాల్స్కు, మెసేజ్లను అడ్డుకట్టవేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) టెల్కోలను ఆదేశించింది. కస్టమర్ అనుమతి ఉంటేనే ఇట్లాంటి కాల్స్ వచ్చేలా చేయాలని, ఇందుకోసం యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫామ్ ‘డిజిటల్ కన్సెంట్ అక్విజిషన్’ (డీసీఏ) తీసుకురావాలని స్పష్టం చేసింది. ఇందుకోసం రెండు నెలల గడువు ఇచ్చింది. మొదటి దశలో కాల్స్కు అనుమతి ఇస్తూ సబ్స్క్రయిబర్లు మాత్రమే రిజిస్టర్ చేసుకుంటారు. రెండో దశలో ఇదే పనిని బిజినెస్ సంస్థలు చేయాల్సి ఉంటుంది. కాల్స్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాలని కస్టమర్ను ఇవి కోరాల్సి ఉంటుందని ట్రాయ్ తెలిపింది.
ప్రమోషనల్ మెసేజ్లు పంపాలంటూ కస్టమర్ పర్మిషన్ ఇచ్చే విధానం ఏదీ ప్రస్తుతం అందుబాటులో లేదు. డిజిటల్ కన్సెంట్ అక్విజిషన్ విధానాన్ని ఇప్పటికిప్పుడు తీసుకురావడం సాధ్యం కాదు కాబట్టే రెండు నెలల సమయం ఇచ్చామని, టెలికం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్స్ 2018 ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేశామని సంస్థ విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. కొత్త విధానం ప్రకారం, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, బీమా కంపెనీలు, వ్యాపార సంస్థలు, ట్రేడింగ్ సంస్థలు, రియల్ ఎస్టేట్ కంపెనీలు వంటివి ఇక నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నాకే కస్టమర్కు కాల్స్ చేయాలి.
యూనిఫైడ్ డిజిటల్ ప్లాట్ఫారమ్ లేకపోవడం వల్ల టెలికాం ఆపరేటర్లు స్పామ్కాల్స్ను అడ్డుకోలేకపోతున్నారని ట్రాయ్ వర్గాలు తెలిపాయి. కస్టమర్ అనుమతి వివరాలను డిజిటల్ లెడ్జర్ ప్లాట్ఫారమ్లోకి పంపిస్తారు. ఈ డేటా టెల్కో ఆపరేటర్లందరికీ అందుబాటులో ఉంటుంది. అనుమతి మెసేజ్లు పంపడానికి ‘127’తో మొదలయ్యే కోడ్ను ఉపయోగించాలని రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వీఐలను కోరింది. అనుమతి కోరేటప్పుడే ఏ సంస్థ కాల్ చేయాలనుకుంటుందనే వివరాలను స్పష్టంగా తెలియజేయాలి. అనుమతి పొందిన వెబ్సైట్లు, యాప్ లింక్స్, నంబర్లు మాత్రమే కస్టమర్ను సంప్రదించగలుగుతాయి.