- ప్రభుత్వానికి లోబడే గవర్నర్ పని చెయ్యాలని ప్రస్తావన
- హోలీ సెలవుల తర్వాత విచారించనున్న కోర్టు!
న్యూఢిల్లీ, వెలుగు: గవర్నర్ తమిళిసైపై రాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అసెంబ్లీ ఆమోదించిన 10 బిల్లులను ఆమె అడ్డుకుంటున్నారని, వాటిని ఆమోదించడం లేదంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరిట గురువారం 194 పేజీల పిటిషన్ను ఫైల్ చేసింది. గవర్నర్ సెక్రటరీ, కేంద్ర లా సెక్రటరీని ప్రతివాదులుగా చేర్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం పిటిషన్ను ఫైల్ చేస్తున్నట్లు తెలిపింది. ‘‘ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదు. ఆర్టికల్163 ప్రకారం సీఎం నేతృత్వంలోని మంత్రి మండలి, రాష్ట్ర సర్కారు సలహాలు, సూచనలకు లోబడే గవర్నర్ పనిచేయాల్సి ఉంటుంది’’ అని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.
సెప్టెంబర్లో 7, ఫిబ్రవరిలో 3 బిల్లులు..
అసెంబ్లీ 8వ సెషన్లోని 4, 5 సమావేశాల్లో మొత్తం 10 బిల్లులను ఆమోదించినట్టు పిటిషన్లో రాష్ట్ర సర్కారు వివరించింది. 2022 సెప్టెంబర్ 12న 7 బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలుపగా.. 13వ తేదీన గవర్నర్ ఆమోదానికి పంపినట్లు పేర్కొంది. ఈ ఏడాది ఫిబ్రవరి 10, 11వ తేదీల్లో మూడు బిల్లులపై చర్చ నిర్వహించి 12న అసెంబ్లీ ఓకే చెప్పిందని, ఆ మర్నాడే గవర్నర్ వద్దకు ఫైళ్లను పంపించామని తెలిపింది. కానీ, గవర్నర్ మాత్రం సరైన వివరాలేవీ చెప్పకుండా, ఆ బిల్లులను ఆమోదించకుండా పెండింగ్లో పెట్టారని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది. బిల్లుల్లో ఏవైనా తప్పులుంటే ప్రభుత్వానికి సూచనలు చేయాలని, తద్వారా అసెంబ్లీలో దానిపై చర్చించి బిల్లుల్లో సవరణలపై పున:పరిశీలించడానికి వీలుంటుందని తెలిపింది. గవర్నర్ తమిళిసై మాత్రం ఆ విషయాలేవీ ప్రభుత్వానికి చెప్పడం లేదని, కారణాల్లేకుండా బిల్లులను పెండింగ్లో పెడుతున్నారని ఆక్షేపించింది. సంబంధిత మంత్రులు గవర్నర్ను కలిసి వివరణ ఇచ్చినా.. చేస్తామని చెప్పారే తప్ప ఆమోదించలేదని ప్రభుత్వం పేర్కొంది. బిల్లుల పెండింగ్, ఆమోదం, గవర్నర్ అధికారాలకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల కాపీని పిటిషన్కు జత చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్ అధికారాలపై రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్స్ను వివరించింది. ‘‘రాజ్యాంగం, చట్టం ప్రకారం గవర్నర్ తన విధులను నిర్వర్తించేలా రాజ్యాంగంలో తప్పనిసరి చేయాలి. ప్రభుత్వానికి లోబడి పనిచేసేలా క్లాజులు, ప్రొవిజన్లలో పలు మార్పులు చేయాలి. గవర్నర్ను ఎన్నుకుంటే సీఎంకు సమాంతర వ్యవస్థగా గవర్నర్ వ్యవస్థ మారే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రెసిడెంట్ ద్వారానే గవర్నర్లను నామినేట్ చేయించాలి’’ అని ఆర్టికల్ 130పై కొన్నేండ్ల కింద చర్చ జరిగిందని పిటిషన్లో ప్రభుత్వం తెలిపింది. హోలీ నేపథ్యంలో సుప్రీంకోర్టుకు శుక్రవారం నుంచి సెలవులు ప్రకటించారు. ఈ నెల 11న కోర్టు తెరుచుకోనుంది. దీంతో హోలీ సెలవుల తర్వాతే రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్పై విచారణ జరిగే అవకాశం ఉంది.
అంతా సెట్ అయిందనుకుంటుండగానే..!
కొన్నాళ్లుగా రాష్ట్రంలో రాజ్భవన్కు, ప్రగతిభవన్కు మధ్య గ్యాప్ పెరిగింది. గవర్నర్కు ప్రభుత్వం నుంచి ప్రొటోకాల్ దక్కకపోవడం, ఆమె నిర్వహించే ప్రోగ్రామ్లకు ప్రభుత్వ పెద్దలు హాజరుకాకపోవడం వంటివి చర్చకు దారితీశాయి. అసెంబ్లీ సమావేశాలు కూడా గవర్నర్ స్పీచ్ లేకుండానే ప్రభుత్వం చేపట్టింది. ఇటీవల రిపబ్లిక్ డే వేడుకలను నామమాత్రంగా నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నించగా.. హైకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. బడ్జెట్ ఫైల్కు గవర్నర్ ఓకే చెప్పడం లేదంటూ గత నెల రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ వేసి.. చివరికి గవర్నర్ స్పీచ్తోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని చెప్పాల్సి వచ్చింది. దీంతో అంతా సెట్ రైట్ అయిందనుకుంటుండగానే.. ఇప్పుడు గవర్నర్పై సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లడం గమనార్హం.
గవర్నర్ ఆమోదించడం లేదని సర్కారు తెలిపిన బిల్లులివే..!
- ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ బిల్లు
- తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లు
- తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ సవరణ బిల్లు
- తెలంగాణ యూనివర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు
- ద యూనివర్సిటీస్ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు
- తెలంగాణ మోటార్ వెహికల్ ట్యాక్సేషన్ చట్ట సవరణ బిల్లు
- తెలంగాణ స్టేట్ ప్రైవేట్ యూనివర్సిటీస్(ఎస్టాబ్లిష్మెంట్ అండ్ రెగ్యులేషన్) అమెండ్మెంట్ బిల్లు
- ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్అగ్రికల్చర్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్లు
- తెలంగాణ పంచాయతీ రాజ్ చట్ట సవరణ తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ-2