
హైదరాబాద్, వెలుగు: ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ (ఇచా)తో కలిసి పేయింగ్ గెస్ట్, కో-లివింగ్ బుకింగ్ సర్వీస్ ప్లాట్ఫారమ్ పీజీఓ తమ హాస్టళ్లలో మీటరింగ్ సొల్యూషన్ "బిజ్లీ బడ్డీ"ని ప్రారంభించినట్లు వెల్లడించింది. రేడియస్ సినర్జీస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ (ఆర్ఎస్ఐపీఎల్) మీటర్లను సరఫరా చేస్తుంది. ఇందుకోసం ఇవి ఒక ఎంఓయూపై సంతకం చేశాయి. హైదరాబాద్ హాస్టల్స్, పేయింగ్ గెస్ట్ (పీజీ)లలో బిజ్లీ బడ్డీని అమర్చుతారు. ఈ ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ మీటర్ల కారణంగా హాస్టల్ యూజర్లు తక్కువగా కరెంటును వాడుతారని, బిల్స్ తక్కువగా వస్తాయని ఈ మూడు సంస్థలు ప్రకటించాయి. హైదరాబాద్ హాస్టళ్లలో దాదాపు రెండు లక్షల మీటర్లు బిగించాలని, ఫలితంగా నెలకు 7 మిలియన్ యూనిట్ల కరెంటును ఆదా చేయవచ్చని ఇచా జనరల్ సెక్రటరీ తాతా కరుణాకర్ చెప్పారు. సాధారణ మీటర్లతో పోలిస్తే బిజ్లీ బడ్డీ ద్వారా 15 శాతం వరకు కరెంటు ఆదా అవుతుందని తెలిపారు. ఇప్పటికే 2 లక్షల మీటర్లను ఇన్స్టాల్ చేశామని, మరో రెండు లక్షల మీటర్లను త్వరలో ఇన్స్టాల్ చేస్తామని వివరించారు.