- మక్కల ధర 20 రోజుల్లో900 తగ్గింది
- ఎమ్మెస్పీ రూ.1,962 కాగా 1,800లోపే అడుగుతున్నరు
- మార్కెట్కు పంట వస్తుండడంతో ధర తగ్గిస్తున్న వ్యాపారులు
- సర్కారు కొనుగోళ్లు లేక నష్టపోతున్న రైతులు
హైదరాబాద్, వెలుగు: మొక్కజొన్న రైతుల కష్టం దళారుల పాలవుతోంది. పంట మార్కెట్కు తీసుకొచ్చే టైమ్లో ధరలను అమాంతంగా తగ్గించేశారు. ఇప్పటికే అకాల వర్షాలకు పంట దెబ్బతిని ఇబ్బందుల్లో ఉన్న రైతులకు ఇది మరింత నిరాశను కలిగిస్తున్నది. గత నెల వరకు వ్యాపారులు క్వింటాల్ మక్కలకు రూ.2600 వరకు ధర చెల్లించి కొనుగోలు చేశారు. కేవలం 20 రోజుల్లోనే రూ.900 వరకు తగ్గించి ఇప్పుడు క్వింటాల్కు రూ.1700 నుంచి రూ.1800 మాత్రమే చెల్లిస్తామంటున్నరు. కనీసం మద్దతు ధర రూ.1962 కూడా పెట్టట్లేదు. సర్కారు మక్కలు కొనుగోలు చేయకపోవడం.. వ్యాపారుల దోపిడీకి వరంగా మారింది. దీంతో తక్కువ ధరకు అమ్ముకోలేక, సరైన ధర రాక రైతులు గోస పడుతున్నరు.
డిమాండ్ ఉందని మక్కలు ఎక్కువేసిన్రు..
రెండేండ్లుగా మార్కెట్లో మక్కలకు డిమాండ్ ఉండడంతో యాసంగిలో రాష్ట్రంలో 6 లక్షల 48 వేల 446 ఎకరాల్లోనే మక్కజొన్న వేశారు. ఎకరానికి యావరేజీగా 26.80 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ లెక్కలేసింది. దీని ప్రకారం ఈ సీజన్లో 17లక్షల 37వేల 835 టన్నుల దిగుబడి వస్తుందని అంచనాలు ఉన్నాయి. గత నెల 17 నుంచి కురిసిన అకాల వర్షాలు మక్క రైతులను దెబ్బతీశాయి. పంట నేలవాలి.. ఆ తరువాత కొట్టిన ఎండలకు ఎండిపోవడంతో దిగుబడులు భారీగా పడిపోయాయి.
దళారుల కుమ్మక్కుతో నష్టపోతున్న రైతులు
సర్కారు మక్కల కొనుగోళ్లు చేపట్టకపోవడంతో మార్కెట్లో దళారులు, వ్యాపారులు మద్దతు ధరకంటే తక్కువకు అడుగుతున్నరు. క్వింటాల్ రూ.1700లకు మించి ధర పెట్టడం లేదు. దీంతో మద్దతు ధర కంటే రూ.260 నుంచి రూ.300లకు పైగా రైతులు నష్టపోతున్నరు. కరోనా టైమ్లో మక్కలను మద్దతు ధరతో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన సర్కారు ఆ తరువాత చేతులెత్తేసింది. మక్క రైతులు నష్టపోకుండా మార్క్ఫెడ్ ద్వారా సర్కారు కొనుగోళ్లు చేపట్టాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆ దిశగా మార్క్ఫెడ్ ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నరు. మక్క కొనుగోళ్లపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని.. ప్రభుత్వం ఆదేశిస్తే కొనుగోలు చేసేం దుకు ఏర్పాట్లు చేస్తామని మార్క్ఫెడ్ అధికారులు అంటున్నారు.
వారంలో రూ.500 తగ్గించిన్రు
యాసంగిలో అకాల వర్షాలు వడగండ్లతో నష్టపోయాం. మక్క కోత మిషన్, కూలీల ఖర్చు రెండు రెట్లు పెరిగింది. మరోవైపు రోజురోజుకు మక్కల ధర తగ్గిస్తూ పోతున్నరు. వ్యాపారులు వారం రోజుల్లోనే రూ.500 వరకు ధరలను తగ్గించిన్రు. సర్కారు వెంటనే మక్కల కొనుగోళ్లు చేపట్టాలి.
-
బొంతు రాంబాబు, రైతు సంఘం నేత, ఖమ్మంజిల్లా
సర్కారు మక్కలు కొనాలి
దళారులకు అమ్ముకుని నష్టపోతున్నం. ప్రభుత్వ పరంగా మక్క కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి. మార్కెట్లో మద్దతు ధర ఇస్తలేరు. క్వింటాల్కు మూడు వందల వరకు నష్టపోయే పరిస్థితి ఉంది.
-
కనకయ్య, రైతు, వరంగల్ జిల్లా