బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ ఎమోషనల్ అయ్యారు. టర్కీ, సిరియాలను వణికించిన భూకంపం మృతులకు సంతాపం తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 2001లో గుజరాత్లో వేలాది మంది ప్రాణాలను బలిగొన్న భుజ్ భూకంపాన్ని మోడీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మనం కూడా ఇలాంటి విపత్తులను ఎదుర్కొన్నామన్న మోడీ... ఈ క్లిష్ట సమయంలో టర్కీకి భారత్ అన్ని విధాలా సాయం అందిస్తుందని చెప్పారు.
ఫిబ్రవరి 6న టర్కీ, సిరియాలో 7.8తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం భారీ ప్రాణ, ఆస్తి నష్టం మిగిల్చింది. ఇప్పటి వరకు 5 వేల మందికిపైగా ప్రజలు చనిపోగా, 15 వేల మందికిపైగా గాయపడ్డారు. రెండు దేశాల్లో వేలాది భవనాలు కూలిపోయాయి ఇక 2001లో గుజరాత్లోని కచ్ జిల్లాలోని భుజ్లో వచ్చిన భారీ భూకంపంలో 20,000 మందికి పైగా మరణించారు. 1.5 లక్షల మందికిపైగా గాయపడ్డారు. భూకంపం వల్ల వేలాది మంది నిరాశ్రయులయ్యారు.