న్యూఢిల్లీ: మొండి బకాయిల తగ్గుదల, వడ్డీ ఆదాయం మెరుగుపడటం వంటి కారణాలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) లాభం జూన్ క్వార్టర్లో నాలుగు రెట్లు పెరిగి రూ.1,255 కోట్లకు చేరుకుంది. గత ఏడాది జూన్ క్వార్టర్లో ఇది రూ.308 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్లో మొత్తం ఆదాయం రూ.21,294 కోట్ల నుంచి రూ.28,579 కోట్లకు పెరిగిందని పీఎన్బీ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది. పీఎన్బీ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ కుమార్ గోయెల్ మాట్లాడుతూ బ్యాంక్ గత 12 క్వార్టర్లలో అత్యధిక క్వార్టర్లీ లాభాలను సాధించామని తెలిపారు. పీఎన్బీ నికర వడ్డీ ఆదాయం 26 శాతం పెరిగి రూ. 9,504 కోట్లకు చేరుకుంది. ఇది బ్యాంకుకు ఎన్నడూ లేనంతగా ఎక్కువ కావడం విశేషం.
ఎన్పీఏలు వార్షికంగా 11.2 శాతం నుండి జూన్ 2023 నాటికి స్థూల అడ్వాన్సుల్లో 7.73 శాతానికి తగ్గాయి. నికర ఎన్పీఏలు కూడా అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 4.26 శాతం నుంచి 1.98 శాతానికి తగ్గాయి. మొండిబాకీల కేటాయింపులు రూ.4,814 కోట్ల నుంచి రూ.4,814 కోట్లకు తగ్గాయి. ప్రొవిజనింగ్ కవరేజ్ రేషియో 83.04 శాతం నుండి 89.83 శాతానికి పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.22 వేల కోట్ల రికవరీని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్వార్టర్లో బ్యాంకు ఎన్పీఏల నుంచి రూ.5,417 కోట్లు రికవరీ చేశామని ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 12,000 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం తెలిపింది. ఇందులో రూ.7,000 కోట్లు టైర్-1 నుంచి, మిగిలిన రూ.5,000 కోట్లు టైర్-2 బాండ్ల నుంచి సమీకరించనున్నారు. తాజా క్వార్టర్లో బ్యాంక్ రూ. 3,090 కోట్లను బాసెల్ 3 కంప్లైంట్ టైర్ 2 బాండ్ల ద్వారా సేకరించింది.