పోడు భూముల సర్వే సరిగా జరగట్లేదు : ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి

పోడు భూముల సర్వే సరిగా జరగట్లేదు : ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి

అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం

మెదక్, వెలుగు : ‘పోడు భూముల సర్వే సరిగా జరగట్లేదు. పోడు గ్రామాల ఎంపిక ఏ తీరుగా చేసిన్రు? ఎవరు చేసిన్రు? పోడు భూములు ఉన్న చాలా గ్రామాలను ఎందుకు స్కిప్​ చేసిన్రు? ట్రెంచ్​ బయట భూములను ఎట్లా స్వాధీనం చేసుకుంటరు?’ అని ఫారెస్ట్ ఆఫీసర్లపై మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మెదక్ జడ్పీ జనరల్ ​బాడీ మీటింగ్ చైర్ ​పర్సన్​ హేమలత అధ్యక్షతన కలెక్టరేట్​లో జరిగింది. అటవీ శాఖపై సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యే పద్మాదేవేందర్​రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పోడు భూముల సర్వే ఎంతవరకు వచ్చిందని ప్రశ్నించారు. మెదక్ నియోజకవర్గంలోని మెదక్, హవేలీఘనపూర్, చిన్నశంకరంపేట మండలాల్లోని పోడు భూములు ఉన్న 18 గ్రామాలు సర్వే లిస్ట్​లో ఎందుకు లేవని అడిగారు. ఆయా చోట్ల 60 ఏండ్లకు పైగా పేద రైతులు పోడు భూములు కాస్తు చేసుకుంటుండగా, ఆ ఊర్లను పోడు జాబితాలో చేర్చకపోగా, ఫారెస్ట్​ ఆఫీసర్లు ట్రెంచ్​ బయట ఉన్న భూముల స్వాధీనానికి ప్రయత్నించడం, అక్కడ మొక్కలు నాటే ప్రయత్నాలు చేయడమేంటని నిలదీశారు. ఫారెస్ట్​ - రెవెన్యూ డిపార్ట్​మెంట్ల మధ్య వివాదంగా ఉన్న భూముల సమస్యను ఎలా పరిష్కరిస్తారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా శివ్వంపేట ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ ఫారెస్ట్​ ఆఫీసర్లు పోడు గ్రామ సభల    సమాచారం గ్రామ, మండల కమిటీ సభ్యులకు చెప్పడం లేదన్నారు. దీనిపై మెదక్ ఫారెస్ట్​ రేంజ్​ఆఫీసర్​ మనోజ్ ​కుమార్ ​మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి జిల్లాలో 62 గ్రామ పంచాయతీలలో పోడు సర్వేకు పర్మిషన్​ వచ్చిందని తెలిపారు. ఏవైనా గ్రామాలు మిగిలిపోయి ఉంటే సెకండ్ ఫేజ్​లో సర్వే చేస్తామన్నారు. త్వరలో జిల్లా స్థాయి కమిటీ మీటింగ్​ నిర్వహించి పోడు పట్టాలకు అర్హులను ఎంపిక చేస్తామని చెప్పారు. జాయింట్​ సర్వే నిర్వహించి భూవివాదాలు పరిష్కరిస్తామని తెలిపారు. 

స్కానింగ్ ​సెంటర్​కు పర్మిషన్​ ఎట్లిచ్చిన్రు..

నర్సాపూర్​ లో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఎదురుగా ప్రైవేట్​ స్కానింగ్​ సెంటర్​ కు పర్మిషన్​ ఎలా ఇచ్చారని జడ్పీటీసీ బబ్యానాయక్​ అధికారులను ప్రశ్నించారు. ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులను స్కానింగ్​ కోసం అక్కడికే పంపుతుండగా, వేలల్లో ఫీజు గుంజుతున్నారని ఆరోపించారు. యాక్సిడెంట్​లో గాయపడిన వారు ఆసుపత్రికి వస్తే కనీసం డ్రెస్సింగ్​ కూడా చేయకుండా సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రికి రెఫర్​ చేస్తున్నారని అన్నారు. ఆసుపత్రిలో కాంట్రాక్ట్​ ఉద్యోగాల భర్తీ సమాచారం హాస్పిటల్​ అడ్వైజరీ కమిటీ మెంబర్​ అయిన జడ్పీటీసీకి ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు. దీనిపై డీసీహెచ్​డాక్టర్​చంద్రశేఖర్​స్పందిస్తూ ఇక నుంచి సమాచారం ఇస్తామని, యాక్సిడెంట్ బాధితులకు మెరుగైన వైద్యం అందించేలా చూస్తామన్నారు. ని జాంపేట జడ్పీటీసీ పంజా విజయ్​కుమార్ మాట్లాడుతూ మెదక్ ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్​ చేయించుకునే పేషెంట్లకు డబ్బులు రావడం లేదని తెలిపారు.  పరికరాలు లేకుండా ఈఎన్​టీ డాక్టర్​ రోగులకు ఎలా సేవలందిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై హాస్పిటల్​ సూపరింటెండెంట్​ డాక్టర్​ చంద్రశేఖర్​ స్పందిస్తూ డయాలసిస్​ పేషెంట్లకు డబ్బులు డీఆర్డీఏ నుంచి రావాల్సి ఉందన్నారు. ఈఎన్​టీ పరికరాలకోసం ఆర్డర్ పెట్టామని, టెండర్​ దశలో ఉన్నట్టు తెలిపారు. 

కరెంట్ ఆఫీసర్ల తీరు సరిగా లేదు

కరెంట్​డిపార్ట్​మెంట్ ఆఫీసర్ల తీరు సరిగా లేదని పెద్దశంకరంపేట ఎంపీపీ శ్రీనివాస్ ఆరోపించారు. ఏఈ మండల జనరల్​బాడీ మీటింగ్​ కు రావడం లేదని, డీఈకి ఎన్ని సార్లు ఫోన్​ చేసినా రెస్పాన్స్​ ఇవ్వడం లేదన్నారు. దీంతో విద్యుత్​ సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. మన ఊరు, మన బడి పథకం కింద పనులు చేపట్టే కాంట్రాక్టర్లకు ఎస్టిమేషన్​ కాపీలు ఇవ్వకపోవడం సమస్యగా ఉందన్నారు. సామగ్రికి సంబంధించి ఏఈలు చెబుతున్నడ రేట్లు ఒకరకంగా ఉంటుండగా, బిల్​ రికార్డు చేసే టైంలో ఎస్టిమేషన్​ లో మరో రకంగా ఉండటంతో నష్టం వస్తోందన్నారు. దీనిపై స్పందించిన అడిషనల్​ కలెక్టర్​ ప్రతిమాసింగ్​ అందరికీ ఎస్టిమేషన్​ కాపీలు అందించాలని ఆదేశించారు. సమావేశంలో నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్​ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్​ చంద్రగౌడ్​ పాల్గొన్నారు. 

అర్హులకు పింఛన్లు వస్తలేవు

వివిధ గ్రామాల్లో అర్హులైన వారికి ఆసరా పింఛన్లు ఎందుకు రావడం లేదని డీఆర్డీఓ శ్రీనివాస్​ను ఎమ్మెల్యే ప్రశ్నించారు. సదరం సర్టిఫికెట్ల విషయంలో సమస్య ఉన్నా పట్టించుకోవడం లేదని ఆయనపై అసహనం వ్యక్తం చేశారు. నిజాంపేట మండలంలో 98 మంది పేర్లు రోల్​ బ్యాక్​లో ఉన్నాయని జడ్పీటీసీ విజయ్​ కుమార్ చెప్పారు. కౌడిపల్లి ఎంపీపీ రాజు మాట్లాడుతూ తమ మండలంలోని కొన్నిగ్రామాల్లో పింఛన్లు పొందుతున్న వ్యక్తులు చనిపోగా,  అదే పేరున్న వారి పింఛన్లు క్యాన్సిల్​ చేశారని, ఈ విషయం ఆఫీసర్లకు తెలిపినా పట్టించుకోవడం లేదన్నారు. ఎంపీడీఓ, పీడీ స్థాయిలో రోల్​ బ్యాక్​లో ఉన్న వాటి లిస్ట్​ పంపాలని, ఈ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి అర్హులకు పింఛన్లు మంజూరయ్యేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు. 

స్కూళ్లలో వాష్​రూమ్​ల సమస్య..

కొల్చారం మండలం రంగంపేట హైస్కూల్​లో 700 మందికి పైగా స్టూడెంట్స్​ ఉండగా వాష్​ రూమ్​లు కొన్నే ఉండటంతో ఇబ్బంది కలుగుతోందని ఎంపీపీ మంజుల తెలిపారు. కొల్చారంలో ఒకే ప్రాంగణంలో నాలుగు స్కూళ్లు ఉన్నాయని, ఇక్కడ కూడా తగినన్ని వాష్​ రూమ్​లు లేవని, నీటి సౌకర్యం లేక విద్యార్థులు తిప్పలు పడుతున్నారని చెప్పారు. కొల్చారం జడ్పీటీసీ మేఘమాల మాట్లాడుతూ కొల్చారం పీహెచ్​సీలో 8 మంది ఏఎన్ఏలకుగాను నలుగురు, ఇద్దరు స్టాఫ్​ నర్సులకు ఒక్కరు మాత్రమే ఉన్నారని, దీంతో వైద్యసేవలకు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. కొల్చారంలో వెటర్నరీ హాస్పిటల్​ లో చాలా ఏళ్లుగా డాక్టర్​ లేకపోవడం సమస్యగా ఉందన్నారు.