మహేశ్​ హత్య కేసులో ఐదుగురు కుటుంబసభ్యుల అరెస్ట్

మహేశ్​ హత్య కేసులో  ఐదుగురు కుటుంబసభ్యుల అరెస్ట్

జైపూర్, వెలుగు : మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలోని గంగపుత్ర కాలనీలో మూడు రోజుల కింద జరిగిన ముష్కె మహేశ్​హత్య (27) కేసులో పోలీసులు నిందితులను అరెస్ట్​ చేశారు. ఈ వివరాలను జైపూర్ ఏసీపీ ఆఫీసులో ఏసీపీ నరేందర్ తెలియజేశారు. ఇందారం గ్రామానికి చెందిన పెద్దపల్లి కనకయ్య పెద్ద కూతురు శ్రుతి, అదే పంచాయతీ పరిధిలోని నజీరుపల్లికి చెందిన ముష్కె మహేశ్​ ప్రేమించుకున్నారు.

మహేశ్ ​ప్రవర్తన నచ్చకపోవడంతో శ్రుతి రెండేండ్ల నుంచి మాట్లాడడం మానేసింది. తర్వాత శ్రుతి తల్లిదండ్రులు ఆమెకు పెండ్లి చేసి పంపించారు. ఇది భరించలేని మహేశ్ ​ఏడాది కింద శ్రుతితో చనువుగా ఉన్న వీడియోలను తన ఫేస్​బుక్, ఇన్​స్టాగ్రామ్​లో షేర్ ​చేశాడు. ఈ అవమానం భరించలేక శ్రుతి భర్త సూసైడ్ ​చేసుకున్నాడు. దీంతో మహేశ్​పై పీఎస్​లో కేసు పెట్టినా వేధింపులు ఆపలేదు. శ్రుతి తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ఉంటున్నా తీరు మార్చుకోలేదు. ఇదంతా భరించలేని శ్రుతి కుటుంబం మహేశ్​ను చంపాలని నిర్ణయించుకుంది. పది రోజుల కింద ఓ కత్తిని కొని అదును కోసం వేచి చూశారు.

ఈ నెల25న మహేశ్..​శ్రుతి ఇంటి ఎదుట నుంచి బండిపై వెళ్తూ హారన్ ​కొట్టాడు. మళ్లీ తిరిగి వస్తాడని ఆ కుటుంబం ఇంటి ముందే కాపు కాసింది. అనుకున్నట్టు రాగానే శ్రుతి తండ్రి పెద్దపల్లి కనకయ్య, భార్య పద్మ, కొడుకు సాయి, కూతురు శ్రుతి మహేశ్​ను పట్టుకుని కత్తితో పొడిచారు. తలపై సిమెంట్ ఇటుకతో మోది చంపారు. మరో కూతురు శ్వేత సాయంతో అక్కడి నుంచి పరారయ్యారు. గురువారం ఉదయం ఐదుగురు నిందితులు పెద్దపల్లి జిల్లా మంథని నుంచి ఇందారం వస్తున్నారని తెలుసుకున్న పోలీసులు షెట్​పల్లి ఎక్స్ రోడ్డు వద్ద పట్టుకున్నారు. ఒక సెల్ ఫోన్, కత్తి స్వాధీనం చేసుకుని రిమాండుకు తరలించారు. శ్రీరాంపూర్ సీఐ రాజు, ఎస్సై, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.