- సుమారు 200కు పైగా ఇంజక్షన్లు సీజ్
- గురువారం మరో 3 కేసుల్లో ఐదుగురిని అదుపులోకితీసుకున్న పోలీసులు
కరోనా పేషెంట్స్ ట్రీట్మెంట్ కు వాడే రెమ్డిసివివర్ ఇంజక్షన్ల బ్లాక్ మార్కెట్పై గ్రేటర్ పోలీసులు ఫోకస్ చేస్తున్నారు. మెడికల్ షాప్ ఓనర్స్, సేల్స్ రిప్రంజటేటీవ్స్ నెట్ వర్క్తో ఇల్లీగల్ దందా నడుస్తున్నట్లు గుర్తించారు. నెల రోజుల వ్యవధిలో 60 మందికిపైగా బ్లాక్లో అమ్ముతున్న వారిని అరెస్ట్ చేశారు. సుమారు 200కు పైగా రెమ్డిసివివర్ ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. -తాజాగా రెమ్డిసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ చేస్తున్న మెడికల్ షాప్ నిర్వాహకుడిని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుడి దగ్గరి నుంచి 4 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. కాచిగూడలోని నింబోలి అడ్డాకు చెందిన బి.శ్రీహరి(39) స్థానికంగా సుమ ఫార్మసీ పేరుతో మెడికల్ షాప్ రన్ చేస్తున్నాడు. రెమ్డిసివర్ను బ్లాక్ మార్కెట్ చేసేందుకు స్కెచ్ వేశాడు. సప్లయర్ వినయ్ తో కలిసి శ్రీహరి ఇంజక్షన్లను కొన్నాడు. వాటిని రూ.30 వేలకు ఒక్కటి చొప్పున అమ్ముతున్నాడు. గురువారం కాచిగూడలోని టీఎక్స్ హాస్పిటల్ సమీపంలో ఇంజక్షన్లను బ్లాక్లో ఓ కస్టమర్కు అమ్ముతున్న శ్రీహరిని ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంజక్షన్స్ సప్లయ్ చేసిన వినయ్ కోసం సెర్చ్ చేస్తున్నారు.
కరోనా పేషెంట్ల నుంచి ఇంజక్షన్లను కొట్టేసి ..
కరోనా పేషెంట్ల నుంచి దొంగిలించిన ఇంజక్షన్లను బ్లాక్లో అమ్ముతున్న ప్రైవేటు హాస్పిటల్ నర్సింగ్ స్టాఫ్తో పాటు మరో వ్యక్తిని ఎస్వోటీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. నిందితుల దగ్గరి నుంచి 3 డోసుల ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన కాకుమని దిలీప్(29) వనస్థలిపురంలోని ప్రగ్యా హాస్పిటల్ లో నర్సింగ్ వర్క్ చేస్తున్నాడు. కరోనా పేషెంట్ బంధువులు కొని తీసుకొచ్చిన రెమ్డిసివివర్ ఇంజక్షన్లను దిలీప్ చోరీ చేసేవాడు. ట్రీట్మెంట్ తీసుకుంటూ పేషెంట్ చనిపోతే మిగిలిన రెమ్డిసివిర్ ఇంజక్షన్లను దిలీప్ కొట్టేసేవాడు. తర్వాత కొత్తపేటలోని సాయి సంజీవని హాస్పిటల్లో ల్యాబ్ టెక్నిషీయన్గా పనిచేస్తున్న వలమల్ల మధు(22)తో కలిసి బ్లాక్లో అమ్మేవాడు. బ్లాక్ మార్కెట్ ఏజెంట్ ప్రదీప్ బుధవారం రాత్రి దిలీప్ కి కాల్ చేశాడు. అర్జెంట్గా 3 డోసుల రెమ్డిసివివర్ ఇంజక్షన్లు కావాలని చెప్పాడు. ముగ్గురు కలిసి ఒక్కో డోస్ రూ.30 వేలకు అమ్మేందుకు స్కెచ్ వేశారు. గురువారం నాగోల్ మెట్రోస్టేషన్ వద్ద ఏజెంట్ ప్రదీప్ కోసం వెయిట్ చేస్తున్న దిలీప్, మధును మల్కాజిగిరి ఎస్ వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న ఏజెంట్ ప్రదీప్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. జవహర్నగర్ పరిధిలోని బాలాజీనగర్లో ఉండే అంబులెన్స్ డ్రైవర్ పబ్బాజి సాయికిరణ్(28), గూడెం బాబురెడ్డి బ్లాక్లో రెమ్డెసివివర్ ఇంజక్షన్లు అమ్ముతుండగా గురువారం రాత్రి కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. 5 ఇంజక్షన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఒక్కో ఇంజక్షన్ రూ.30 వేలకు ..
కె.భాస్కర్ రావు(39) నాచారంలో మెడికల్ షాప్ నిర్వహిస్తున్నాడు. యాదాద్రి జిల్లా ఆలేరుకు చెందిన కె. అంజన్ కుమార్(29) మెడికల్ రిప్రంజటేటీవ్ గా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ కలిసి రెమ్డిసివివర్ ను బ్లాక్ లో అమ్ముతున్నారు. ఇందుకోసం అంజన్ కుమార్ కోఠి నుంచి రెండు డోసుల ఇంజక్షన్స్ తీసుకొచ్చాడు. ఒక్కో ఇంజెక్షన్ను రూ.30 వేలకు అమ్మాలనుకున్నాడు. బోడుప్పల్లోని మెడిలైఫ్ మెడికల్ స్టోర్ వద్ద ఇంజెక్షన్ కలెక్ట్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంజెక్షన్ బ్లాక్మార్కెట్పై ఎస్ఓటీ పోలీసులు నిఘా పెట్టారు. అంజన్కుమార్తో పాటు మెడికల్ షాప్ ఓనర్ భాస్కర్ రావును మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. రెండు డోసుల ఇంజక్షన్స్ స్వాధీనం చేసుకున్నారు. రూ.3,500 విలువ చేసే రెమ్డిసివిర్ ఇంజక్షను డిమాండ్ ను బట్టి ఒక్కోటి రూ.30 వేల నుంచి రూ.45 వేల వరకు సిటీలో ఇల్లీగల్గా సేల్ చేస్తున్నట్లు గుర్తించామని సీపీ అంజనీకుమార్ తెలిపారు. మెడికల్ రిప్రజెంటేటీవ్స్,మెడికల్ షాప్ ఓనర్స్తో కలిసి చైన్సిస్టమ్తో బ్లాక్ మార్కెట్ దందా చేస్తున్నట్లు ఆధారాలు సేకరించామన్నారు.
బ్లాక్లో ఆక్సిజన్ సిలిండర్లు..
ఆక్సిజన్ సిలిండర్స్ను బ్లాక్లో అమ్ముతున్న వ్యక్తిని వెస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. 19 ఆక్సిజన్ సిలిండర్స్ను స్వాధీనం చేసుకున్నారు. గోల్కొండలోని ధన్కోటకు చెందిన అబ్దుల్ కరీమ్(32) అత్తాపూర్లో అయేషా ఎంటర్ ప్రైజెస్ను నిర్వహిస్తున్నాడు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ హాస్పిటల్స్కి ఆక్సిజన్ సిలిండర్స్ సప్లయ్ చేస్తున్నాడు. కరోనాతో ఆక్సిజన్ కు డిమాండ్ పెరుగడంతో సిలిండర్స్ బ్లాక్లో అమ్మేందుకు స్కెచ్ వేశాడు. 19 సిలిండర్లలో 7 క్యూబిక్ మీటర్స్ ఆక్సిజన్ రీఫిల్ చేయించాడు. హోమ్ ఐసోలేషన్లో ఉన్న కరోనా పేషెంట్స్, ప్రైవేట్ హాస్పిటల్స్కి ఎక్కువ రేటుకి అమ్ముతున్నాడు. దీని గురించి సమాచారం అందుకున్న వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గోల్కొండలోని కరీం ఇంట్లో దాచిన 19 సిలిండర్స్ను సీజ్ చేశారు. అతడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.