కామారెడ్డిలో కబ్జాలపై పోలీసుల నజర్​

కామారెడ్డిలో కబ్జాలపై పోలీసుల నజర్​
  •  కేసులు పెట్టి, నిందితుల రిమాండ్​
  •  ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న ఘటనలు

కామారెడ్డి, వెలుగు: జిల్లాలో భూ కబ్జాలపై పోలీసులు సీరియస్​గా నజర్​పెట్టారు. దీంతో భూకబ్జాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు బాధితుల నుంచి కంప్లైంట్స్​ అందగానే ఎంక్వైరీకి ఆదేశిస్తున్నారు. కబ్జాలు వాస్తవమని తేలితే తక్షణమే కేసులు నమోదు చేయాలని కింది స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఫిర్యాదులపై యాక్షన్​ తీసుకుంటుండడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు.

 ఉన్నతాధికారులకు లేకుంటే స్థానిక పీఎస్​లలో ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో భూ కబ్జాల విషయమై కంప్లైంట్ ​చేసినా సివిల్ ​వివాదాలంటూ పోలీసులు కేసు తీసుకోలేదు. దీంతో గతంలో కంప్లైంట్​ చేసిన వారు సైతం మళ్లీ పీఎస్​లలో కంప్లైంట్స్​ ఇచ్చేందుకు వస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే కామారెడ్డి సబ్​ డివిజన్​ పరిధిలో నాలుగు భూ కబ్జా కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా కేంద్రం రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతో భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. టౌన్​లో ఎక్కడైనా ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జాదారులు నజర్​ వేస్తున్నారు. 

స్థానిక లీడర్ల అండ ఉండడంతో బాధితులు కూడా వెనక్కి తగ్గాల్సి వస్తోంది. కొన్ని ఘటనల్లో బాధితులు కబ్జాదారులతో సెటిల్​మెంట్​ చేసుకున్న సందర్భాలూ ఉన్నాయి. మార్కెట్ లో మంచి ధర ఉన్నా, తక్కువ రేటుకే తమ భూములను అప్పగించారు. భూ కబ్జాలపై పోలీసులకు కంప్లైంట్ ​చేయగా సివిల్ పంచాయతీలంటూ చర్యలు తీసుకొలేదు. స్థానికంగా ఉన్న ఆఫీసర్లు సైతం పట్టించుకోకపోవడంతో పలువురు బాధితులు ఇటీవల జిల్లా ఎస్పీకి కంప్లైంట్​ చేశారు. కాంగ్రెస్​ ప్రభుత్వం హైదరాబాద్​ లో ప్రజాదర్బార్ ను నిర్వహిస్తుండగా అక్కడికి సైతం వెళ్లి ఫిర్యాదు చేస్తున్నారు. విషయం జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయికి చేరుతుండడంతో పోలీసులు యాక్షన్​లోకి దిగారు. కబ్జాలు వాస్తవమని తేలితే  కేసులు నమోదు చేసి, నిందితులను  అరెస్ట్​ చేసి రిమాండ్​కు పంపుతున్నారు.

అరెస్ట్​ చేసి రిమాండ్​కు..

కామారెడ్డి టౌన్​లోని కాకతీయ నగర్ ​కాలనీలో రిటైర్డ్​ తహసీల్ధార్​ పోశెట్టి 1989లో 263 గజాల ప్లాట్​ కొన్నారు. ఈ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా ఖాళీగా ఉంచారు. కడీలు పాతి బోర్డును ఏర్పాటు చేయగా, టౌన్​కు చెందిన శంకరప్ప, ఇతడి కొడుకు శివకుమార్​, మరో వ్యక్తి  సంతోష్​కుమార్ కడీలను ధ్వంసం చేసి కబ్జాకు ప్రయత్నించారు.ఫేక్​ డాక్యుమెంట్లను సైతం  సృష్టించారు. బాధితుడు గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. బాధితులు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా దేవునిపల్లి పీఎస్​లో కేసు నమోదైంది. శంకరప్ప, శివకుమార్​, సంతోష్​కుమార్​లను అరెస్ట్ ​చేసి రిమాండ్​కు పంపారు. 

పలువురిపై కేసులు

కామారెడ్డి సమీపంలోని రామేశ్వర్​పల్లి శివారులో భూమి కబ్జా చేశారని బాధితుడి ఫిర్యాదు చేయగా శ్రీనివాస్​ అనే వ్యక్తితో పాటు మరో నలుగురిపై కేసు నమోదుచేశారు. దేవునిపల్లి శివారులోని కాకతీయనగర్ ​కాలనీలో టౌన్​కు చెందిన బస్వయ్య 1985లో 703 గజాల ప్లాట్లు కొన్నాడు. గతంలో భూమి అమ్మిన వ్యక్తి కుటుంబ సభ్యులు సరిహద్దులు మార్చి, ఫేక్​ డాక్యుమెంట్స్​ తయారు చేశారు. కొద్దిరోజుల కింద ఈ ప్లాట్ల నుంచి రోడ్డు వేసి కబ్జాకు ప్రయత్నించారు. దీనిపై బాధితుడు ఫిర్యాదు చేయగా, ఏడుగురిపై కేసు నమోదు చేశారు. నలుగురిని అదుపులోకి తీసుకోగా, ముగ్గురిని అరెస్ట్ ​చేయాల్సి ఉంది.