- శ్రీని, అనురాగ్ ఎంట్రీతో మారిన సీన్!
(వెలుగు స్పోర్ట్స్ డెస్క్): బీసీసీఐలో ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ‘దాదాగిరి’ మూడేండ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. బోర్డుకు ప్రెసిడెంట్ అయిన తొలి క్రికెటర్గా కొత్త చరిత్ర సృష్టించిన సౌరవ్ తన పనితీరుతో బీసీసీఐ అధికారుల మనసు గెలవలేకపోయాడు. దాంతో, తన కెప్టెన్సీ కెరీర్ మాదిరిగా అడ్మినిస్ట్రేటర్గా కూడా దాదా ఆట అర్ధాంతరంగా ముగిసింది. వాస్తవానికి నెల రోజుల కిందట ‘కూలింగ్ ఆఫ్’ నిబంధనను తొలగిస్తూ బీసీసీఐ రాజ్యాంగానికి చేసిన సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గంగూలీ, షా తదితరులు చాలా సంతోషించారు. బోర్డులో మరో మూడేళ్ల పాటు వీళ్లే కొనసాగుతారని అంతా అనుకున్నారు. కానీ, నెల రోజులు తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది. మరో టర్మ్ కొనసాగుతానని స్వయంగా కోరిన దాదాను ఎందుకు వద్దంటున్నారు? ఈ విషయంలో తెరవెనుక ఏం జరిగింది? అనేది ఇప్పుడు క్రికెట్తో పాటు పొలిటికల్ సర్కిల్స్లోనూ హాట్ టాపిక్గా మారింది.
కారణం ఇదేనా..
ఈ నెల 18న జరిగే బీసీసీఐ ఏజీఎంలో తదుపరి కార్యవర్గాన్ని ఖరారు చేసేందుకు ఈ వారంలో ఢిల్లీ, ముంబై వేదికగా జరిగిన రెండు మీటింగ్స్తో దాదా ఫ్యూచర్ తేలిపోయింది. ఢిల్లీ మీటింగ్ తర్వాత బోర్డుకు కొత్త అధ్యక్షుడు వస్తాడని తెలిసింది. కానీ, గంగూలీని ఐసీసీ చైర్మన్ ఎలక్షన్స్లో దింపుతారని బోర్డు వర్గాలు చెప్పాయి. అయితే, ముంబై మీటింగ్ తర్వాత ఐసీసీ చైర్మన్ పోస్టుకు కూడా దాదాను దూరం చేశారు. ఇందుకు పలు కారణాలు కనిపిస్తున్నాయి. కోహ్లీని టీమిండియా కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మకు పగ్గాలు అప్పగించే వ్యవహారంలో గంగూలీ తీరుపై విమర్శలు వచ్చాయి.తన విషయంలో గంగూలీ అబద్దాలు చెప్పాడని కోహ్లీ పరోక్షంగా విమర్శలు చేయగా.. సౌరవ్ అతనికి షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అనుకున్నాడు. అలాగే, బీసీసీఐ స్పాన్సర్లకు ప్రత్యర్థులైన కంపెనీలకు గంగూలీ బ్రాండ్ అంబాసిడర్గా ఉండటంపై మెంబర్స్ గుర్రుగా ఉన్నారట. ఈ విషయంలో మాజీ ప్రెసిడెంట్ ఎన్. శ్రీనివాసన్ ముంబై మీటింగ్లో దాదాపై నేరుగా ఎదురుదాడికి దిగినట్టు తెలుస్తోంది. అలాగే, రూల్స్కు విరుద్ధంగా టీమ్ సెలెక్షన్ మీటింగ్స్కు కూడా గంగూలీ అటెండ్ అవుతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఇండియా కెప్టెన్గా ఉన్నప్పటి మాదిరిగా బోర్డులోనూ అన్ని విషయాలు తన కనుసన్నల్లో జరగాలని దాదా కోరుకున్నాడని తెలుస్తోంది. అందుకే బోర్డు పెద్దలు అతని పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. చివరకు తన క్లోజ్ ఫ్రెండ్ అయిన జై షా కూడా మొహం చాటేశారని తెలుస్తోంది.
పొలిటికల్ యాంగిల్ ఉందా?
రాజకీయాల్లోకి రావాలని గంగూలీపై చాన్నాళ్ల నుంచి ఒత్తిడి ఉంది. కానీ, తనకు ఆసక్తి లేదని సౌరవ్ చెబుతూనే ఉన్నాడు. అదే సమయంలో తను ఇటు బీజేపీతో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ముందు నుంచి సత్సంబంధాలను కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో 2019లో అతనికి బీసీసీఐ పగ్గాలు అప్పగించే ముందు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటిదాకా ప్రెసిడెంట్ రేసులో ఉన్న బ్రిజేష్ పటేల్ను కాదని చివరి నిమిషంలో గంగూలీకి పగ్గాలు ఇచ్చారు. తొలుత బీసీసీఐలో దాదా హవా నడవగా.. గతేడాది సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ అనురాగ్ ఠాకూర్ బోర్డు వ్యవహారాల్లో ఏదో రకంగా జోక్యం చేసుకోవడం మొదలైందని తెలుస్తోంది. మళ్లీ క్రికెట్ అడ్మినిస్ట్రేషన్ లోకి రావాలని భావిస్తున్న ఠాకూర్.. ఐసీసీ చైర్మన్ పీఠంపై కన్నేసినట్టు సమాచారం. ఆయనతో పాటు శ్రీనివాసన్ కూడా ఈ పదవి కోరుకుంటున్నాడట. అందుకే గంగూలీని ‘సీన్’ నుంచి తప్పించారన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో క్రికెట్ ఫీల్డ్లో 16 ఏళ్ల పాటు కొనసాగిన దాదా.. బోర్డు ‘పొలిటికల్ క్రీజు’లో మాత్రం ఎక్కువసేపు నిలువలేకపోయాడు.